Tuesday, December 21, 2021

"మీ సంకల్పమే నా సంకల్పం" - (By సుజాత గారు)

నీ ఇష్టమే నా ఇష్టం గా, నీ సంకల్పమే నా సంకల్పంగా ఒకటిగానే ఉండాలి :

మా మావయ్యగారు, నాన్నగారు చిన్ననాటి నుండి స్నేహితులు. మా మరిది గారి పెళ్ళికి మా మావయ్యగారు నాన్నగారిని ఆహ్వానించారు. అలా మా ఇంటికి మొదటిసారి నాన్నగారు వచ్చారు. అదే నేను నాన్నగారిని మొట్ట మొదటి సారి చూడటం. మా మావయ్య గారు వల్లనే మాకు నాన్నగారు లభించారు. అలా నాన్నగారు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా మంది భక్తులు నాన్నగారిని దర్శనం చేసుకోవటానికి వచ్చి, నాన్నగారికి పాద పూజ చేస్తూ నమస్కారాలు పెడుతూ ఉండేవారు. భక్తి అనేది లోపల ఉండాలి గాని ఇలా పైకి వ్యక్తపరచటం ఏమిటి అనుకునేదాన్ని. మొదట్లో మేము నాన్నగారిని గురువుగా కాకుండా, మావయ్య గారికి స్నేహితుడిగా మాత్రమే చూసేవాళ్ళం. కానీ క్రమంగా ఆయన మమ్మల్ని ఆకర్షించుకొని, ఆయన వైభవం అర్థమయ్యేలా చేశారు. నాన్నగారు మా మరిది గారి పెళ్ళికి వచ్చినప్పుడు, మేడమీద జరిగిన ఉపన్యాసంలో అక్షరమణమాల గురించి చెప్పారు. ఆరోజు నేను సబ్జెక్టు బాగా ఎంజాయ్ చేశాను. తరువాత నాన్నగారు ఉండగా, ఎవరో భక్తులు నాతో ఈ బిల్డింగ్ చాలా బాగుంది మీరు చాలా బాగా కట్టుకున్నారు అని అన్నారట. అప్పుడు నేను అక్షరమణమాల కన్నా ఈ బిల్డింగ్ అందంగా ఉందా? అని అన్నానట. నేను అన్నానో, లేదో నాకు జ్ఞాపకం లేదు కానీ, నాన్నగారు మాత్రం ఎప్పుడూ సుజాత అన్న ఆ మాట నా హృదయంలో ఉండి పోయింది అనేవారు. మనల్ని పవిత్రం చేయడానికి అలా ఏదో ఒక రకంగా, ఏదో ఒంపు పెట్టుకుని మన అందరినీ తలుస్తూ ఉంటారు.

నాన్నగారు నన్ను భగవద్గీత చదవమన్నారు. నాన్నగారు నా జీవితంలో ప్రవేశించినప్పటి నుండి ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్ని. పుస్తకం తెరవగానే ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకాన్ని చదువుతూ నాన్నగారు బోధిస్తున్నట్టుగా భావించి, దాని అర్థాన్ని కూడా అర్థమయ్యేలా చేయమని ప్రార్థించే దానిని. అలా దాని తాత్పర్యం మననం చేస్తూ ఉంటే, అది అనుభవంలోకి కూడా వచ్చేది. ఒకసారి నాన్నగారు కోయంబత్తూర్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశాను. అప్పుడు నాన్నగారు ఏమి చదువుతున్నావు అమ్మా అని అడిగారు. భగవద్గీత లో రెండవ అధ్యాయం చదువుతున్నాను అని చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్.. అని, మంచి చేసినవాడికి దుర్గతి లేదని కృష్ణుడు చెప్పాడు అమ్మా అన్నారు.

ఒకరోజు నాకు సడన్ గా ఈరోజు నీ భర్తకు మరణం వస్తే..! అనే తలంపు వచ్చింది. వెంటనే దేహాలు అన్నీ చనిపోతాయి కాని ఆత్మకు చావు పుట్టుకలు లేవు అనే వాక్యం స్ఫురించింది. ఆ రోజు రాత్రి నా భర్త కి హార్ట్ ఎటాక్ వచ్చింది. అదే సమయానికి నాకు లోపల ఆత్మకి చావు పుట్టుకలు లేవు చనిపోయేది శరీరమే అనే వాక్యం బాగా మననం జరుగుతూ ఉంది. ఆ తరువాత నా భర్తని ఆస్పత్రిలో చేర్చి ఇంజక్షన్ ఇచ్చారు. అది రియాక్షన్ ఇచ్చింది. తరువాత మరొక ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు అంతా సర్దుకుంది. ఆ తరువాత సౌరిస్ అమ్మగారు విభూది పంపించారు. అంతా ఈశ్వరుడి ప్రణాళిక ప్రకారం జరిగింది. నాకు రామనామం అంటే చాలా ఇష్టం. అందువలన నా భర్త హాస్పత్రి లో ఉన్నప్పుడు రామనామం ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. రామనామం చెయ్యడం వలన నా భర్త ఉన్న గది అంతా చాలా ప్రశాంతంగా ఉండేది. మరలా ఇంకొక సారి హార్ట్ ఎటాక్ వచ్చింది. దానికి ఇంజక్షన్ ఇవ్వడం, తరువాత హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తరువాత తిరిగి వచ్చేసాము.

కొన్ని రోజుల తరువాత నా భర్త హైదరాబాద్ లో ఉన్నప్పుడు మూడవసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. మా ఆడపడుచు భర్త వెంటనే ఆయనని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంగతి మాకు తెలియదు. తర్వాత నాన్నగారు భక్తులలో ఒకరు నాకు ఫోన్ చేసి నా భర్తకు హార్ట్ ఎటాక్ వచ్చింది అన్న విషయం చెప్పారు. అది వినగానే నేను ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఈ లోపు మా మావయ్య గారు, అత్తయ్య గారు నాన్న గారికి ఫోన్ చేసి చెప్పారు. నాన్నగారు అది విని మీ అబ్బాయికి ఏమీ అవ్వదు అనే భరోసా ఇచ్చారు. అందరూ వచ్చినప్పటికీ, నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. నాకు ఆ సందర్భం అంతా ఏదో ఒక సినిమా రీలు జరుగుతూ ఉన్నట్టు అనిపించింది. తరువాత హైదరాబాదు నా భర్త దగ్గరికి వెళ్ళేసరికి నాకు దుఃఖం వచ్చేసింది. ఆ సమయంలో ఆయనకీ చాలా సీరియస్ అయ్యి, దాదాపుగా దేహం నుండి విడిపోయారు. ఆ తరువాత ఆయన నాతో ఆ సంఘటనను గురించి ఈ విధంగా చెప్పారు. "నేను దాదాపు నా దేహం నుండి విడిపోయాను. విడిపోయినప్పుడు విపరీతమైన శాంతి అనుభవమైంది. ఆ మహా శాంతిని నేను వర్ణించలేను. నేను చనిపోయేటప్పుడు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయానని వీరందరూ అనుకుంటున్నారు. కానీ చావులో ఇంత సౌదర్యం ఉందా! ఇంత శాంతి ఉందా! ఎంత బావుందో ఈ మరణం అని అనుకుంటున్నాను. ఈ లోపు ఓం నమో నారాయణాయః అనే నామం జరుగుతోంది. అలా జరుగుతూ ఉంటే సుజాత నన్ను ఎప్పుడు బయట వ్యవహారాలేనా, భగవంతుడిని స్మరించుకోవటం అంటూ ఉండదా! మనల్ని రక్షించేవాడు భగవంతుడే అని ఎప్పుడూ అంటూ ఉంటుంది. ఇప్పుడు నామం జరుగుతూ ఉంది అనుకున్నాను. అదే సమయంలో దేహంలోకి నేను ప్రవేశించటం జరిగింది. అలా జరిగిన తరువాత మీరందరూ నాకు జ్ఞాపకం వచ్చేసారు" అని ఆయనకు కలిగిన అనుభవాన్ని నాతో పంచుకున్నారు. అది విని, కేవలం గురువు అనుగ్రహం వలన మాత్రమే అలా జరిగింది అనుకున్నాను. నా భర్తకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తక్కువ. అందువల్ల నేను ఆయనతో, నాన్నగారు మీకు మూడు సార్లు ప్రాణంపోసారు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉంటాను. నాకు మరణం అంటే భయం లేదు అంటారు. మరణం అంటే భయం లేదు కానీ, చనిపోయేటప్పుడు ఆరోగ్యంగా చనిపోవాలి కదా! శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఇవి రెండే మనకు ఆస్తులు అని ఆయనకి చెబుతూ ఉంటాను.

ఇవి అన్నీ జరిగిన తరువాత, నాన్నగారి దగ్గరికి శృంగవృక్షం లో ప్రవచనం జరిగేటప్పుడు వెళ్ళాను. నన్ను చూసి నీవు చాలా ధైర్యంగా ఉన్నావమ్మా అన్నారు. మీ అనుగ్రహం, మరియు మీరు చెప్పిన ఆ వాక్యాలు నన్ను అలా ధైర్యంగా నిలబెట్టాయి కానీ, అది నా తెలివితేటలు వల్ల కాదు నాన్నగారూ అని మనసులో అనుకున్నాను. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు! లేనిదానికి ఉండటం అంటూ లేదు! ఈ వాక్యము యొక్క రుచి అప్పుడు అలా చూపించారు. కానీ పూర్తిగా మనోనాశనం అయితే గాని దాని అందాలు మనకు తెలియవు. మధ్య మధ్యలో గురువు దయవలన అలా రుచి చూస్తూ ఉంటాము.

మా ఇంట్లో ఒక మామగారు ఉండి వంట చేసేవారు. నాన్నగారు వచ్చినప్పుడు నేను నాన్నగారికి భోజనం వడ్డించే దానిని. నాన్న గారు ఒకసారి నాతో మీ ఇంట్లో మామ ఉన్నారు కదా! ఆవిడే నీకు ఆస్థి అన్నారు. ఆవిడి ఇంట్లో నా సొంత మనిషిలా ఉండి అన్నీ చూసుకునేవారు. కాబట్టి నేను నాన్నగారి దగ్గరకు వచ్చినా, సత్సంగాలకి వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అందువల్ల నాన్నగారు నాతో, ఆ మామగారు నీకు ఆస్థి అమ్మా అనేవారు. ఇప్పుడు ఆవిడ లేని లోటు నాకు తెలుస్తోంది. ఆవిడ పెట్టిన చారు అంటే నాన్నగారికి చాలా ఇష్టం. సత్యవతమ్మ గారూ మీరు పెట్టిన చారు చాలా అద్భుతంగా ఉందండి అనేవారు.

మాది ఉమ్మడి కుటుంబం. కొంచెం కుటుంబము పెద్దది అయిన తరువాత మా అత్తయ్య గారు వేరే ఇంటికి వెళ్ళారు. ఒకసారి నాన్నగారు మా అత్తయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు, పూజ గదిలో నాన్నగారికి పాద పూజ చేశారు. ఆ పూజ గదిలో ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో రాముడి పట్టాభిషేకం ఫోటో ఉంటుంది. నాన్నగారు ఆ మందిరాన్ని చూసి ఇది సుజాతకి ఉంచేయండి అని చెప్పారు. మా మరిది గారి పెళ్ళికి దేవుడు సామాగ్రి తీసుకుంటూ, మా అత్తయ్య గారు నన్ను కూడా నాకు నచ్చింది తీసుకోమన్నారు. నాకు అక్కడ ఉన్న వాటిలో రాముడి పట్టాభిషేకం ఫోటో బాగా నచ్చి అది తీసుకున్నాను. మనల్ని అనుగ్రహించడానికి సత్యమే అనేక రూపాలు ధరించి వచ్చింది కాబట్టి నాకు అందరి దేవుళ్ళు సమానమే. మనం తరించటానికి ఏదో ఒక రూపం, ఒక నామం సరిపోతుంది. నాన్నగారు అద్వైత వాసన రావడం కూడా చాలా కష్టం అన్నారు. వినటంలో మన లోపం ఏమైనా ఉందేమో కానీ, ప్రవచనాల ద్వారా నాన్న గారు మనకు అన్నీ బోధించారు. ఇప్పుడు మనకి ఆచరణ మొదలయ్యింది అనిపిస్తోంది. నాన్నగారు దేహంతో ఉన్నప్పుడు కూడా ఆచరించే వాళ్ళము కానీ, ఏదైనా సమస్య వచ్చేసరికి నాన్నగారికి చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు వెనక్కి తిరిగి మన హృదయానికి చెప్పుకోవటం అనే నిజమైన ఆచరణ మొదలయ్యింది అనిపిస్తుంది.

నాన్నగారి భక్తులు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాన్నగారి దగ్గర లక్ష్మి ఎందుకో ప్రత్యేకంగా అనిపించేవారు. లక్ష్మి దేహం వదిలేసిన తరువాత, నాన్నగారు వైజాగ్ వచ్చినపుడు నువ్వు లక్ష్మి గురించి ఒక మాట చెప్పు సుజాతా అన్నారు. అప్పుడు నేను నాన్నగారితో ఒకసారి లక్ష్మి విరూపాక్ష గుహ నుండి కిందకు దిగి ఆంధ్ర ఆశ్రమం వైపు వెళ్తుంటే, మీరు కారులో వెళుతూ లక్ష్మిని పిలిచి కారులో ఎక్కించుకుని, అమ్మా లక్ష్మీ మన కంటే తెలివైన వారు, మనకంటే ధనవంతులు, మనకంటే ఎంతో గొప్ప గొప్ప వారు చాలా మంది ఉన్నారు కానీ మనల్ని ఇక్కడికి పిలిపించుకొని అరుణాచలేశ్వరుడు ఎందుకు ఆకర్షించుకున్నాడో..! అరుణాచలేశ్వరుడు మనల్ని అందరినీ తన చెంతకు చేర్చుకుని, చింతన నేర్పి అప్పుడు తన స్వరూపాన్ని ఇస్తాడు అమ్మా, మనందరం అదృష్టవంతులం అమ్మా! అని మీరు లక్ష్మి తో అన్నారట నాన్నగారూ. లక్ష్మి చెప్పిన ఈ వాక్యం నా హృదయంలో ఉండిపోయింది అని చెప్పాను. ఒకసారి నాన్నగారి సమక్షంలో నా మనసులో చెడు తలంపులు, మంచి తలంపులు వచ్చేస్తున్నాయి. అప్పుడు నాన్నగారు ప్రవచనంలో ఆ చెడు తలంపులు నీవు కాదు, మంచి తలంపులు నీవు కాదు అని చెప్పారు. హైదరాబాద్ భక్తులు ఒకరు నాన్నగారు గురించిన అనుభవాలను రాయమన్నారు. అది విని నేను ఒక గదిలో కూర్చుని రాస్తూ ఉంటే, నాన్నగారు వచ్చి కంగారు ఏమి లేదు నెమ్మదిగా రాయమ్మా అన్నారు. విష్ణు సహస్రనామాలలో భగవంతుడి చూపు మన పై పడితే చాలు మన పని అయిపోతుంది అని ఉంటుంది. ఆ వాక్యం గురించి నాన్న గారిని అడిగాను. దానికి నాన్నగారు ఏమీ సమాధానం చెప్పకుండా, నేను నీ తండ్రి లాంటి వాడిని నీకు ఏ సందేహం వచ్చినా నన్ను అడుగు అన్నారు.

ఒకసారి నాన్నగారు కోయంబత్తూరు వెళ్ళినప్పుడు నాకు కూడా వెళ్ళాలనిపించింది కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించక వెళ్ళటం కుదరలేదు. అప్పుడు మనసులో నాన్నగారూ మీరు అంతటా వ్యాపించి ఉన్నారు. మీరు అక్కడ ఏదైతే బోధిస్తున్నారో అది నాకు కూడా అందాలి. మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు కదా! అనుకున్నాను. అక్కడ నాన్నగారు ఏమేమి చెబుతున్నారో అవి అన్ని నాకు భగవాన్ పుస్తకం చదువుతున్నప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చేస్తూ ఉండేవి. నా స్నేహితురాలు పద్మ నాన్నగారు మీకు ఇమ్మన్నారు అని చెప్పి ఒక చిన్న కొటేషన్ తో కూడిన లామినేషన్ ఫొటో నాకు ఇచ్చారు. ఆ కొటేషన్ ఏమిటంటే Experience teaches us that love does not consist of two people looking at each other but of looking together in the same direction. అంటే నీ ఇష్టమే నా ఇష్టం గా, నీ సంకల్పమే నా సంకల్పంగా ఒకటే ఉండాలి కానీ, రెండూ ఉండకూడదు అనే కొటేషన్ తో ఉన్న ఫోటో నాకు పంపించారు. అది నేను పూజగదిలో పెట్టుకున్నాను. ఇప్పటికీ అది చూసి చాలా ఆనందపడుతూ ఉంటాను. ఈ వాక్యం నన్ను బాగా వెంటాడుతుంది. భగవంతుడికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. మనకి భగవంతుడు కావాలి అనే ఆకలి ఉండాలే కానీ భగవంతుడు మనల్ని బాగు చేయటానికి, ఆయన స్వరూపం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నాన్నగారు జ్ఞానం గురించి ఎక్కువ బోధించేవారు.

మొదటి సారి అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూ, కుబేర లింగం దగ్గరకు వచ్చేసరికి నాన్నగారు అక్కడ కూర్చుని ఉన్నారు. నేను కొంచెం మానసికంగా, శారీరకంగా సున్నితంగా ఉంటాను. అప్పుడు నాన్నగారు నాతో నీకు కాళ్లు నొప్పులు పెడుతున్నాయా అమ్మా అని అడిగారు. చాలా నొప్పులుగా ఉన్నాయి నాన్నగారూ అని చెబితే, నాన్నగారు నువ్వు రూమ్ కి వెళ్ళిన తరువాత కొబ్బరి నూనె రాసుకో తగ్గిపోతుంది అని ప్రేమగా చెప్పారు. నాన్నగారు నాతో మొదట నువ్వు మూడుసార్లు అరుణాచలం వద్దాము అనుకున్నావు కదా! కానీ రాలేకపోయావు అన్నారు. నాన్నగారు ఆ మాట ఎందుకు అన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

నాన్నగారు వచ్చిన ప్రతిసారీ స్టేషన్ కి వెళ్ళి నాన్నగారిని తీసుకురావటం, తిరిగి వెళ్ళేటప్పుడు నాన్నగారితో పాటు స్టేషన్ కి వెళ్ళటం అలవాటు. అలా ఒకసారి నాన్నగారితో పాటు స్టేషన్ కి వెళ్ళినప్పుడు నాన్నగారు ట్రైన్ ఎక్కి గుమ్మం దగ్గర నిలబడి నా వైపు చూస్తున్నారు. నేను ఎటో చూస్తూ నాన్నగారి వైపు చూశాను. అప్పుడు నాకు లోపల నుండి, ఒకవైపే కాదు రెండు వైపులా కలిస్తే తొందరగా పని అయిపోతుంది. రెండు చూపులు కలిస్తే తొందరగా పని అయిపోతుంది అనే తలంపు వచ్చింది. అంటే మనం ఈశ్వర సంకల్పాన్ని గౌరవిస్తూ ఉంటే మన పని అయిపోతుంది. ఈశ్వర సంకల్పాన్ని గౌరవించము అనుకోండి మన ప్రారబ్దం మనకు చెప్పు దెబ్బలు కొట్టి గౌరవించేటట్టు చేస్తుంది. ఈ చావు, పుట్టుకలు ఎప్పటి వరకు అంటే ఆయన్ని అంగీకరించే వరకు! అప్పటి వరకు చావు, పుట్టుకలు తప్పవు.

ఒకసారి అరుణాచలంలో ఉండగా అందరము కలిసి అరుణాచలేశ్వరుడి గుడిలోకి వెళ్ళాము. అక్కడ మా మావయ్యగారు , మా చిన్న మావయ్య గారు కూడా నాన్నగారిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి వీరు ఇద్దరు గురువుని చూడగానే అక్కడ ఉన్న స్థలం మురికిగా ఉందా లేదా అనేది కూడా చూడకుండా సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి సరెండర్ అయిపోతారు అమ్మా! వారి భక్తి అటువంటిది అని చెప్పారు. మా అమ్మాయి వివాహ సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి, అవి నా మనసుని తాకకుండా, నాన్నగారి దయవలన ఆయన సబ్జెక్టు నిరంతరం వింటూ హాయిగా నిద్రించేదాన్ని. ఒక్కసారి మా అత్తయ్య గారు నన్ను ఏదో అంటే నా మనసు చివుక్కు మనిపించి, తిరిగి నేను ఒక మాట అన్నాను. తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పాను. అప్పుడు నాన్నగారు అమ్మా, ఇంకెప్పుడూ మీ అత్తయ్యను ఏమి అనకు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. పడటం మంచిది. తిరిగి అనకూడదు. ఇంకెప్పుడూ అనకు. ఈసారికి ఏదో అయిపోయింది అన్నారు. అదొక పాఠంగా తీసుకున్నాను. అరుణాచలంలో ఉండగా ఒకసారి నాకు టీ తాగాలని తలంపు వచ్చింది. అప్పుడు నాన్నగారు పై నుంచి కిందకు దిగుతూ, నన్ను చూసి సుజాత నీకు టీ తాగాలని ఉందా అని అడిగి నవ్వేశారు. మన గురించి మనకు తెలియదు కానీ, మనలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తుంది.

ఒకసారి అరుణాచలంలో నేను రమణాశ్రమంలో ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు అని నాన్నగారు నన్ను అడిగారు. రమణాశ్రమంలో ఉన్నాను అని చెప్పాను. వెరీగుడ్ అని చెప్పి, ఈ దేహం ఎంత నిజమో, ఈ కొండ కూడా అంతే నిజం అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. కొండ మీద ఇష్టం లేకుండా, గురువు మీద ఇష్టం లేకుండా ఆ మాట మనకు ఎక్కడ అర్థం అవుతుంది అనుకున్నాను. నాన్నగారు ఒకసారి "భగవాన్ కి పైకి భక్తి, లోపల అంతా జ్ఞానం. ఈ జ్ఞాన మార్గంలో నడిచే వారంటే ఆయనకి కళ్ళు ఇంత అయిపోతాయి, జ్ఞానం గురించి మాట్లాడుతుంటే భగవాన్ కి ముఖంలో ఒక వెలుగు వచ్చేస్తుంది" అని గిరి ప్రదక్షణ చేస్తున్నప్పుడు చెప్పారు. ఒకసారి నాన్నగారితో గుడిలోకి వెళ్తే, గోత్రనామాలు అడిగి పూజారి పూజ చేశారు. అప్పుడు నాన్నగారు ఈ గోత్ర నామాలతో మన దేహ బుద్ధుని ఇంకా పెంచేస్తారు, అవి అన్ని వ్యవహారికంగా జరుగుతాయి అన్నారు. అంటే ఇవి ఏమి నిజం కాదు అని చెప్పకుండా చెప్పారు అనిపించింది.

ఒకసారి అరుణాచలంలో భక్తులు ఎవరో గోదానం చేసుకుంటున్నారు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి గోదానం ఎవరు చేస్తుంది? మిథ్యా నేను చేస్తుంది, ఈ దానాలు అన్నీ నిజం కాదు. నేనుని దానం చేయుటమే నిజమైన దానం అని చెప్పారు. నేనెవడను కూడా ఎక్కువగా ఎంజాయ్ చేసేదాన్ని, నాకు ఏదైనా ఒక వాక్యం నచ్చితే దానిని తరుచూ చదివి ఎంజాయ్ చేసేదాన్ని. నేను ఒకసారి నాన్నగారితో నారాయణపేట వెళ్ళాను, అక్కడ నాన్నగారు నన్ను హే భగవాన్, జయ భగవాన్ అనుకోమని చెప్పారు. పైకి అనకు లోపల అనుకో అన్నారు. నారాయణపేటలో శబరి తిరిగిన చోటుకి మమ్మల్ని తీసుకు వెళ్ళారు, అవి అన్నిచూపించి, తరువాత నన్ను పిలిచి ఇప్పుడు మనం శబరి ఉన్న స్థలం అవీ చూశాం కదా! అవి అన్ని మనకు మాత్రలు లాంటివి, గురువు అనుగ్రహం ఇంజక్షన్ లాంటిది అమ్మా,.ఆ అనుగ్రహం వలన తక్షణమే ఇప్పుడే ఇక్కడే నీకు శాంతి అందుతుంది అన్నారు. గురువు దయ అటువంటిది.

నాన్నగారికి వండి పెట్టాలి అనిపించేది. నాకు రుచిగా వండటం రాదు. వండినప్పుడు ఒక్కటి కూడా సరిగ్గా కుదిరేది కాదు. బాలేదు అని నాన్నగారు చెప్పేసేవారు. పద్మ దగ్గర నేర్చుకో అనేవారు. అలా నేర్చుకున్న తర్వాత ఒకసారి బీరకాయ కూర వండి పెడితే చాలా బాగుందమ్మా అన్నారు. ఆ తరువాత నుండి మనకు రాని పని దగ్గరకు మనం వెళ్ళకూడదు, ఎవరికైతే వచ్చో వారు చేస్తారు అనుకొని నేను వంట జోలికి వెళ్ళటం మానేసాను. ఏదైనా సరే మనం భాధ పడకుండా, మనల్ని సంతృప్తిపరుస్తూ మనల్ని లోపల ఉన్న నిజం దగ్గరకి తీసుకువెళ్ళే ఘనత ఆయనకే చెందుతుంది. అలా మనల్ని ప్రేమిస్తూ, మన లోపాల్ని చూపిస్తూ, వాటినుండి విడుదల చేస్తూ అద్వైత శిఖరాలకు మనందరినీ మోసుకుని వెళుతున్నారు మన నాన్నగారు. డ్యూటీ ని సరిగ్గా చేయమని నాన్నగారు నాకు ఎలా ట్రైనింగ్ ఇచ్చారంటే, మా అత్తగారి తల్లిని తీసుకుని ఒకసారి జిన్నూరు వెళ్ళాము. నాన్నగారు అరుగు మీద కూర్చున్నారు దర్శనం చేసుకుని మా అత్తగారు తల్లిని వదిలేసి నేను మెట్లు దిగిపోయాను. నాన్నగారు నన్ను పిలిచి మామని దగ్గర ఉండి తీసుకు వెళ్ళు అని చెప్పారు. అప్పటి నుండి పెద్ద వారి పట్ల నేను చేయగలిగే పని ఉంటే చేయటం నేర్చుకున్నాను. అది కూడా గురువు దయే. డ్యూటీని సరిగ్గా చేయడం అనేది కూడా నాన్నగారే నేర్పించారు. మా బాబు కొంచెం ఇన్నోసెంట్, వాడిని చూసుకోవడానికి చాలా సహనం ఉండాలి. అప్పుడు కూడా సహనం అనేది నాన్నగారు నాకు నేర్పించారు. ఒకసారి వైజాగ్ లో ఒక భక్తులు ఇంటికి నాన్నగారు వచ్చారు. అప్పుడు వంట చేసి తీసుకెళితే బాగుండును అనిపించినా, పట్టించుకోకుండా వెళ్ళిపోయాను. అప్పుడు నాన్నగారు రూమ్ లో నుండి వచ్చి జిన్నూరు వెళ్ళిపోతూ ప్రేమ అడగదు, అజ్ఞానం అడుగుతుంది అని చెప్పారు. అప్పుడు నేను, హృదయం వంట చేసి పట్టుకెళ్ళమని చెప్పింది. కానీ నాకు ఉన్న వాసన హృదయం చెప్పిన మాటను విననివ్వకుండా చేసేసింది అనుకున్నాను. ఆ విధంగా నాన్నగారు ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉండేవారు. ఒకసారి నాన్నగారు గోపాలపట్టణంలో ఉన్నారు. అక్కడికి వెళుతూ మనవలకి కట్టే LIC పనులు ఉంటే అవి అన్ని చూసుకుని ఆయన దగ్గరకు వెళ్ళాను. వెళ్ళగానే నాన్నగారు మాట్లాడుతూ నీ మనవలకి నీవు కట్టే LIC లు కంటే "రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ బిహేవియర్" నిన్ను హృదయంలోనికి తీసుకెళ్తాయి అన్నారు.

ఒకసారి నాన్నగారు నువ్వు కాశీ రాలేదు కదా అమ్మా, నిన్ను సారనాథ్ తీసుకెళ్తాను అన్నారు. ఎందుకు అన్నారో తెలియదు కానీ నాన్నగారు దేహం వదిలేసే ముందు సారనాథ్ నిన్ను తీసుకెళ్తానమ్మా అన్నారు. ఒకసారి ఏదో చిన్న ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక చిన్న కవర్ ఇస్తుంటే ఇచ్చేవాడు భగవంతుడే, పుచ్చుకునేవాడు భగవంతుడే అని తలంపు వచ్చింది. అప్పుడు నాన్నగారు పక్కనే ఉన్నారు. నాకు ఆ తలంపు రాగానే నాన్నగారు వెరీగుడ్ వెరీగుడ్ అన్నారు. ఇదంతా కూడా నాన్నగారు మన జీవితంలో ప్రవేశించడం వలనే గానీ మన తెలివితేటలు వలన కాదు.

Sunday, November 7, 2021

"నాన్నగారు సాక్షాత్తు శివ స్వరూపమే" - (By భవాని గారు)

ఒకసారి నా భర్తతో కలిసి రామకృష్ణ మఠానికి వెళ్ళాను. అక్కడే మొట్టమొదటిసారి చిక్కడపల్లి స్వరాజ్యం గారు నన్ను చూసి నీకు భక్తి ఎక్కువ ఉన్నట్టు ఉంది. నువ్వు సత్సంగానికి వస్తూ ఉండు అని చెప్పారు. అప్పటి నుండి నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. చిక్కడపల్లిలో పప్పాగారి సత్సంగం జరుగుతూ ఉండేది. అక్కడ రామ నామము ఎక్కువ చేసేవారు.

రాందాస్ పప్పాగారి శిష్యులలో ఒకరైన కృష్ణాభాయి మాతాజి గురు వైభవం అనే పుస్తకం రాశారు. అందులో జ్ఞాని లక్షణాలను వర్ణించారు. అది చూసి మనము గురువు గురించి అన్వేషణ చేయాలి అనే ఆలోచన నాలో కలిగింది. అప్పటి నుండి గురువు కోసం నా అన్వేషణ మొదలయ్యింది. నాన్నగారు ఫోటో ఒకటి అభయ హస్తంతో ఆశీర్వదించినట్టు ఉంటుంది. అందులో ఆ హస్తము సర్పాన్ని పోలి ఉంటుంది. ఆ హస్తంతో గత జన్మలో నాకు అనుబంధం ఉన్నట్టు అనిపించేది. నాన్నగారు పరిచయం అవ్వకముందు ఆ హస్తం నన్ను ఆశీర్వదించినట్టు నేను అందులో ఒదిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉండేది. నాకు అలా ప్రేమించే గురువు కావాలి అనుకునే దానిని.

ఒకసారి మా అమ్మగారి ఇంట్లో పూజ గది శుభ్రం చేస్తుంటే,అక్కడ భగవాన్ చిత్రపటం కనిపించింది. ఆ పటం చూడగానే 'నన్ను చూడు, నన్ను చూడు' అని భగవాన్ అంటూ ఆ పటం కూర్చున్నట్టు ఉంది. అప్పుడు మా తండ్రి గారిని పిలిచి మీకు ఈ భగవాన్ చిత్రపటం ఎవరిచ్చారు అని అడిగి, నేను ఈయనను చూడాలి అన్నాను. మా స్నేహితుడు ఒకరు నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళారు. నాన్నగారు నాకు ఈ ఫోటో ఇచ్చారు అని చెప్పారు. నాన్నగారు అంటే ఎవరు అని మా తండ్రి గారిని అడిగాను. ఆయన ఒక జ్ఞాని అని చెప్పారు.అంతటా వ్యాపించి ఉన్నవాడు జ్ఞాని అని, జ్ఞాని లక్షణాలలో కృష్ణాభాయ్ మాతాజీ వర్ణించారు. మా తండ్రి గారు అయన స్నేహితుడిని నాన్నగారి దగ్గరికి తీసుకు వెళ్ళమని అడిగితే, ఆయన ఏమి సమాధానం చెప్పలేదు. అలా ఆయన సమాధానం చెప్పకపోయేసరికి, నాన్నగారు జ్ఞాని అంటున్నారు కదా, ఆయన జ్ఞాని అయితే ఇప్పుడు మనమిద్దరమూ మాట్లాడుకునేటప్పుడు కూడా ఉంటారు కదా, నాకు కనుక నిజమైన భక్తి ఉంటే నన్ను ఆయనే దగ్గరికి రప్పించుకుంటారు అని మా తండ్రి గారికి చెప్పి, హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్ తీయమన్నాను. తరువాత ట్రైన్ ఎక్కించడానికి మా తండ్రిగారు వచ్చారు. నాకు కొంచెం అనారోగ్యంగా ఉండటం వలన, సీట్లో కూర్చో పెట్టిన తరువాత, నువ్వు ఇంత అనారోగ్యంగా ఉంటే, నేను నిన్ను ఎలా పంపించగలను అని తిరిగి ఇంటికి తీసుకు వచ్చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి మా నాన్నగారి స్నేహితుడు ఫోన్ చేసి, నాన్నగారి దగ్గరికి వెళ్దాము రెడీగా ఉండండి అని చెప్పారు. నాన్నగారు చూడటానికి సాధారణ వ్యక్తిలా కనిపిస్తారు కాని మీరు అలా అనుకోవద్దు అని మా తండ్రిగారి స్నేహితుడు మాకు చెప్పారు. మేము కారు దిగి వెళుతూ ఉంటే, అప్పటికే నాన్నగారు అరుగుమీద మా కోసం ఎదురు చూస్తున్నట్టు అక్కడే తిరుగుతూ కనిపించారు. నాన్నగారు మమ్మల్ని చూడగానే రెడ్డిగారు మీరు వచ్చి 15 రోజులు కూడా కాలేదు మరలా వచ్చారు ఏమిటి అని అడిగారు. అయితే మా తండ్రిగారు, మీరు భగవాన్ ఫోటో ఇచ్చారు కదా నాన్నగారు అది చూసి మా అమ్మాయి మీ దగ్గరకి తీసుకు వెళ్ళండి అని అడుగుతోంది అని చెప్పారు. ఆ ఫోటో మిమ్మల్ని తీసుకువచ్చింది రెడ్డి గారు అన్నారు నాన్నగారు. ఫోటో తీసుకు రావటం ఏమిటి నాన్నగారు నాకు అర్థం కాలేదు అన్నారు మా తండ్రిగారు. అప్పుడు నాన్నగారు ఈ అమ్మాయిది, నాది జన్మ, జన్మల బంధం రెడ్డి గారు అన్నారు. తరువాత నాన్నగారు మాతో మాట్లాడటం మొదలు పెట్టారు. నాకు తెలియకుండానే నా నేత్రాలు వెంబడి కన్నీరు ధారలుగా కారుతున్నాయి. నువ్వు హైదరాబాదులో ఉంటావా అని అడిగి, హైదరాబాద్ కి ఎన్ని ట్రైన్లు ఉంటాయి ఇలా అడుగుతూ ఉంటే ఇదేంటి నాన్నగారు జ్ఞాని కదా అన్నీ తెలిసి ఉంటాయి కదా ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అనుకున్నాను. అంటే నాకు అప్పటికీ నాన్నగారు జ్ఞాని అని తెలుసు కానీ అది ఆపాదించుకోవడం తెలియలేదు. నాన్నగారు నాతో మేము కూడా హైదరాబాదు 27వ తారీఖున వస్తున్నాము అని చెప్పారు. సరే, నాన్నగారు మీరు వచ్చినప్పుడు అడ్రస్ ఇవ్వండి మేము వస్తాము అని చెప్పి , రామారావు గారి దగ్గర అడ్రస్ తీసుకున్నాను. నువ్వు ఏమి చేస్తూ ఉంటావు అని అడిగారు నాన్నగారు. నేను రామదాసు పప్పాగారి సత్సంగం జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్తాను అని చెప్పాను. తరువాత కొన్ని పుస్తకాలు, క్యాసెట్లు ఇచ్చి ఇవి మీ సత్సంగానికి ఉపయోగపడతాయి పట్టుకువెళ్ళు అని చెప్పారు. నేను పుస్తకాలు చదవను నాన్నగారు అన్నాను. ఇవి ఉపయోగపడతాయి పట్టుకువెళ్ళు అని మరలా చెప్పేసరికి ఆ పుస్తకాలు తీసి పక్కకు పెట్టుకున్నాను. నీకు ఏమి ఇష్టము అని అడిగారు. నాకు పాటలంటే చాలా ఇష్టం నాన్నగారు, పాడాలని ఉంటుంది గానీ నా స్వరం అంతగా బాగోదు అందుకు నేను పాడినా ఎవరు వినరు అని చెప్పాను. నీకు రమణపాటల పుస్తకం ఇస్తాను అందులో రమణ పాటలు ఉంటాయి, అవి పాడుకో అని చెప్పి దానితో పాటు నేను ఎవరు అనే ఒక చిన్న పుస్తకం తీసుకొని వచ్చారు. ఆ పుస్తకం ఇచ్చి ఇది నీకు అర్థమయినా, అర్థం కాకపోయినా చదువుకొని రోజు తల కింద పెట్టుకొని పడుకో అని చెప్పారు. నాన్నగారు పాటల పుస్తకం ఇచ్చినప్పటినుండి ఆ పాటలు పాడే దానిని అప్పటినుండి నా స్వరం బాగుంది అని అందరూ నా పాటలను వినేవారు.తరువాత హైదరాబాద్ వచ్చేశాను.

స్వరాజ్యం గారి ఇంటికి సత్సంగానికి వెళ్ళి వారితో, మన పప్పా ఎలా అయితే ఉంటారో, నాన్నగారు కూడా అలాగే ఉన్నారు అని చెప్పాను. అది విని స్వరాజ్యం గారు చాలా ఆనందపడ్డారు. ఇంకో వారం రోజుల్లో హైదరాబాద్ వస్తారు అని చెప్పాను. ఆ వారం రోజులు కూడా అందరూ గోపికలు కృష్ణుడు కోసం ఏ విధంగా అయితే ఎదురుచూస్తారో అలా ఆర్తిగా ఎదురు చూశారు. నేను తీసుకువెళ్ళిన పుస్తకాలు అందరూ పట్టుకొని వెళ్ళారు. నాన్న ఉవాచ అనే పుస్తకం స్వరాజ్యం గారి చేతికి వచ్చింది. ఆ పుస్తకంలో "నా దర్శనం అయిన తరువాత మీకు జ్ఞానం లభించకపోతే ఆ దోషం నాది కాని మీది కాదు" అనే వాక్యం స్వరాజ్యం గారి చదివి, దోషం ఆయన మీద వేసుకుని మాట్లాడుతున్నారు అంటే, అది సామాన్యం కాదు, ఆయన మహానుభావుడు అన్నారు.27 వ తారీఖున నాన్నగారు చెప్పిన అడ్రస్ కి చేరుకున్నాము. కానీ నాన్నగారు మరునాడు వస్తారని తెలుసుకుని మరలా మరుసటి రోజు వెళ్ళాము.

నాన్నగారికి స్వరాజ్యం గారిని పరిచయం చేశాను. నాన్నగారు అమ్మ స్వరాజ్యం ఇంత ఎండలో వచ్చారా అమ్మా అన్నారు. అప్పుడు స్వరాజ్యం గారు నాన్నగారు పాదాలు పట్టుకుని మేము భగవంతుని చూడటానికి, దేవాలయానికి వచ్చాము నాన్నగారు అన్నారు. నాన్నగారు ఆ మాట విని చాలా ఆనందపడ్డారు. నాన్నగారు తమ భక్తులకు ఏ మార్గము ఇష్టమో ఆ మార్గం యొక్క వైభవాన్ని వివరిస్తూ భక్తులను సన్నిహితంగా చేసేసుకుంటారు. నాన్నగారు చిక్కడపల్లి సత్సంగానికి వచ్చినప్పుడు రామ నామం చేసాము. అది చూసి మీరు అంతా వైకుంఠాన్ని దింపేసారు అమ్మా అని చెప్పి రామ నామము హృదయం మీద మనసుని పెట్టి చెయ్యాలమ్మా అన్నారు. నాన్నగారు చెప్పినప్పటి నుండి అలాగే చేయడం మొదలుపెట్టాము. నాన్నగారు వచ్చే ఒక ఆరు నెలల ముందు వరకు పుట్టమ్మ గారు అనే భక్తురాలు మా సత్సంగానికి వచ్చేవారు. ఆమె డైరెక్టుగా పప్పా దగ్గర మంత్రం తీసుకున్నారు. ఆవిడ అన్నారు రామ నామము చేయండి,రాముడిని ధ్యానం చేయండి. మీ ఇంటికి ఎవరైతే వస్తున్నారో వారిని రాముడిలా భావించి సేవ చేసుకోండి అని చెప్పారు. అలా చేస్తే ఆ రాముడే మీ ఇంటికి వస్తాడు. రాముడే మీకు జ్ఞానం ఇస్తాడు అని స్వరాజ్యం గారికి చెప్పారు. అలా చెప్పిన తర్వాత సరిగ్గా ఆరు నెలలకి నాన్నగారు చిక్కడపల్లి రావటము తటస్థించింది. స్వరాజ్యం ఆంటీ నాన్నగారికి చిక్కడపల్లి భక్తులని పరిచయం చేసిన తరువాత, నాన్నగారు మా అందరికీ జ్ఞానము ఇచ్చేయండి అన్నారు. అయితే అక్కడ సన్నజాజుల మాలలు వేసి నాన్నగారు ఫోటోకి పెట్టాము. ఆ మాల మధ్యలోకి ఊడి పడిపోయింది. సరిగ్గా నాన్నగారు అదే సమయానికి మౌనంగా చూస్తూ ఉన్నారు.ఆ మాల తెగిన శబ్దం కూడా వినవచ్చింది. అలాగేనమ్మ అన్నారు నాన్నగారు. నాన్న గారి దగ్గరికి వచ్చిన తరువాత ఆత్మ యొక్క వైభవం తెలిసింది. ఆయన సమక్షంలో తండ్రి వైభవాన్ని చూస్తూ ఉంటే,లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోగలము కానీ లేకపోతే అది మనకు సాధ్యపడదు.

నాకు, నా భర్తకి నాన్నగారు మంత్ర దీక్ష ఇచ్చేటప్పుడు నా భర్తని మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని అడిగారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. తర్వాత నాన్నగారు మీకు రాముడంటే ఇష్టమని రామనామం ఇచ్చారు. నాన్నగారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక భక్తురాలి ఇంట్లో అందరూ కూర్చుని ఉండగా మీలో మోక్షం ఎవరికైనా కావాలా అని అడిగారు. నాన్నగారు నాకు మోక్షం కావాలి అని నిలబడ్డాను. అప్పుడు నాన్నగారు ఈ అమ్మాయి మోక్షము అడుగుతోంది అన్నారు. అక్కడ ఉన్న భక్తులు అందరూ నాన్నగారు అన్న ప్రతీ మాటకీ నవ్వుతున్నారు, నాకు ఓ పక్క నుండి దుఃఖం వచ్చేస్తుంది. కానీ నాన్నగారు నాకు నిజంగానే మోక్షం కావాలి అన్నాను. అప్పుడు నాన్నగారు అన్నారు ఇది పుస్తకం పైత్యంలా ఉందండి అన్నారు. ఆ మాట నాన్నగారు ఎందుకు అన్నారో అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు అర్ధమవుతోంది. అప్పట్లో పుస్తకంలో చదివిందే నాన్నగారిని అడిగాను.

నల్లకుంటలో రేణుగారి హాల్లో నాన్నగారు ప్రవచనం జరుగుతోందని భక్తులందరూ వెళ్ళారు. నాకు కొంచెం ఆరోగ్యం సహకరించక ఇంటిలో ఉండిపోయాను. అంతకు ముందు రోజు రాత్రి వచ్చిన భక్తురాలు మా ఇంటికి వచ్చి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాన్నగారు చిత్రపటాని చూపించి ఈయన ఎవరు అనుకుంటున్నావు నా అంశే అని నాకు స్వప్నంలోకి వచ్చి చెప్పారు. ఇప్పుడు భక్తులందరూ వెళ్లిపోయారు దయచేసి నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకుని వెళ్ళు, నీకు ఆరోగ్యం ఎలా ఉన్నా సరే నేను జాగ్రత్తగా తీసుకుని వెళతాను అని చెప్పారు. అలా ఆ రోజు నాన్నగారు సంకల్పం వలన ఇద్దరం రేణుకా గారి హాల్ కి వెళ్ళాము. నాన్నగారి దగ్గరకు వెళ్ళిన తరువాత ఆ భక్తురాలుని నాన్నగారికి పరిచయం చేశాను. అప్పుడు నాన్నగారు ఆమెను నీవు ప్రవచనం అయ్యేంతవరకు కూర్చో తర్వాత మీ ఇంటికి వెళదాము అని చెప్పారు.

మా పాప కడుపులో ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు అది చూసి అందరూ పుట్టే శిశువు ఏమైనా అంగవైకల్యంతో పుడుతుంది ఏమో అని భయపడ్డారు. ఆ సమయంలో నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే దుఃఖం వచ్చేసింది. నాతో పాటుగా ఉన్న నా తల్లిదండ్రులు నన్ను ఓదార్చటానికి ప్రయత్నం చేస్తే, నాన్నగారు వారిని వారించి వద్దని చెప్పి తనకి ఎంతసేపు అలా దుఃఖం బయటకు వస్తుందో రానివ్వండి అన్నారు. అలా కొద్ది సేపటి తరువాత దుఃఖం ఆగింది. అప్పుడు నాన్నగారు ఏమైందమ్మా అని అడిగారు. నాన్నగారు నాకు ఆరోగ్యం బాగా లేదు అందువలన పుట్టే బిడ్డకు అది ఏమైనా ఎఫెక్ట్ అయ్యి పుట్టే బిడ్డ అంగవైకల్యంతో పుట్టవచ్చు అని అందరూ అంటున్నారు. అందుచేత నాకు భయం వేస్తోంది అని చెప్పాను. దానికి నాన్నగారు కళ్ళు మూసుకుని మౌనంగా ఉండి నా గర్భం వైపు చూస్తూ, నీ గర్భంలో పెరుగుతున్న శిశువు బంగారంలా ఉందమ్మా అని చెప్పారు. అప్పుడే నాకు ఆడపిల్ల పుడుతుంది అని అర్థం అయ్యింది. ఆ మాట వినగానే నాకు ఏమి అనిపించిందంటే నా గర్భంలో ఉన్న శిశువు నాన్నగారే బంగారంలా చేసి ఉంచారు అనిపించింది. అలా నాన్నగారు స్కానింగ్ తీసిన డాక్టర్ లా చెప్పారు. అప్పటినుండి నా ప్రసవం అయ్యేవరకు నాన్నగారు ఎప్పుడు వచ్చినా అక్కడికి భక్తులు తీసుకువచ్చిన దానిమ్మ పండ్లును నన్ను పిలిచి నాకు ప్రసాదంగా ఇచ్చేవారు. నాకు తొమ్మిదో నెల వచ్చిన తర్వాత ఒకరోజు లోపల శిశువుకి కదలికలు లేవు అని ఆస్పత్రిలో చేరాను. అదే సమయంలో నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారు. నాన్నగారు ఇక్కడ చాలా రోజులు ఉంటారు కానీ నాకు చూసే భాగ్యం లేదు అని నాన్నగారు పాదాలు ఫోటో చూస్తూ, దుఃఖిస్తూ ఉన్నాను. మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్ వచ్చి, లోపల పరిస్థితి అంతా బానే ఉంది మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాను. నాన్నగారు నన్ను చూడగానే దగ్గరికి పిలిపించుకుని కూర్చోపెట్టుకుని అరుణాచల కరుణాలయా అని నా భర్త రాసిన పాటను పాడించుకున్నారు. రాత్రంతా నేను దుఃఖించినందువలన నాన్నగారు అలా ప్రేమతో ప్రతిస్పందించారు అనిపించింది.

మా అమ్మగారి ఇంట్లో నాన్నగారి ప్రవచనాలు జరిగేవి. అలా జరుగుతున్నప్పుడు మా అబ్బాయి అక్కడ ఉన్న వారితో కలిసి నామం చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి నామం చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు భక్తులందరూ భోజనానికి వచ్చారు. నేను వాడికి భోజనం పెడదామని వాడిని వెతుక్కుంటూ వస్తున్నాను. మా అబ్బాయి పక్కనే నాన్నగారు కూర్చుని ఉన్నారు. నాన్నగారు నన్ను చూసి వీడు మన బాలశివుడు అమ్మా అన్నారు. మా అబ్బాయి ఈ మధ్య పాడిన పాటకి భక్తులందరూ చాలా బాగా పాడాడు అని ఫోన్ చేసి వారి ప్రేమని తెలియజేసారు. నాన్నగారి యొక్క అనుగ్రహ వెల్లువ వాడి మీదికి భక్తుల ప్రేమ రూపంలో పంపిస్తున్నారు ఏమో అనిపించింది. అమ్మాయికి మూడో నెల వచ్చిన తర్వాత నాన్నగారి చేత నామకరణం చేయించాము. విజయలక్ష్మి అనే పేరు పెడతాను అమ్మా. ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించుకుని వస్తుంది అని చెప్పారు. అప్పుడు నా భర్త నాన్నగారి మీద అష్టోత్తరం రాశారు. నాన్నగారు పాదపూజ చేసుకుంటూ అష్టోత్రం చదివాము. అలా చదువుతూ ఉంటే, మా చిక్కడపల్లి భక్తులందరూ ఆనంద భాష్పాలు రాల్చాము. నాన్నగారు ఏది చేసినా వైభవంగానే ఉంటుంది. అలాగే నాన్నగారు ఈ పాటలను రాయించుకోవడం కూడా ఆయన వైభవంగానే ఉంది. నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా పాపకి అక్షరాభ్యాసం చేయించాలి అనుకుని ఒక భక్తురాలిని నాన్నగారు రేపు ఉదయం అందుబాటులో ఉంటారా అని అడిగాను. ఆమె నాకు తెలియదు అని చెప్పారు. నాకు ఎందుకో తెలియకుండానే దుఃఖం వచ్చింది. తర్వాత నాన్నగారి దగ్గరికి లోపలికి వెళ్ళాను. అప్పుడే నాన్నగారు బయటకు వస్తూ నన్ను పిలిచి ఎలా ఉన్నావు భవాని అని అడిగారు. నాన్నగారు అలా అడగగానే పాపకి రేపు అక్షరాభ్యాసం మీచేత చేయ్యిద్ధామనుకుంటున్నాను నాన్నగారు అని చెప్పాను. రేపు మేము ఫలానా భక్తురాలు ఇంటిలో ఉంటాము. నన్ను అక్కడికి పాపని తీసుకుని రమ్మని చెప్పారు. ఆ మాట విని నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మన మనసులో ఏమి అనుకుంటామో అది ఆయనకి తెలుస్తూ ఉంటుంది.

నాన్నగారు ఒకసారి ప్రవచనానికి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులు ముప్పై మంది ఉంటారు వారికి మాత్రమే వంట చేసాము. వచ్చిన భక్తులందరినీ మా అమ్మగారు భోజనం చేయమని అడుగుతూ ఉంటే, నా మనసులో అందరిని భోజనం చేయమని అడుగుతున్నారు చేసినది సరిపోదేమో అనుకుంటూ ఉన్నాను. మేము చేసిన వంట నాన్నగారి దయవలన అక్షయపాత్రలా అయ్యి వచ్చిన భక్తులందరికీ సరిపోయింది. తరువాత శివాలయానికి నాన్నగారితో కలిసి వెళ్ళాము. అక్కడ నందీశ్వరుడు దగ్గర నాన్నగారి ఎదురుగా నిలబడి ఉన్నాను. అప్పుడు నాన్నగారు అందరూ ఈశ్వరుడు ఉన్నాడు అని లోపలికి వెళ్ళిపోతారు కానీ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే భక్తులలో ఉంటాడు అన్నారు. భక్తులను గౌరవిస్తే భగవంతుడిని గౌరవించినట్టే. భక్తులను గౌరవించకుండా భగవంతుని గౌరవిస్తే ఆయనను గౌరవించినట్లు అవ్వదు అని నాకు చెప్పారు. అలా నాలో ఉన్న దోషాన్ని నాకు తెలియ చేసి దాన్ని నివృత్తి చేశారు. నాన్నగారు ఒకసారి గొల్లలమామిడాడ వచ్చేటప్పుడు మధ్యదారిలో బలభద్రాపురం అనే గ్రామంలో సాయిబాబా దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి విరాళాలు రాకపోవటం వలన అభివృద్ధి చెందలేదు. నాన్నగారు వస్తున్నారని తెలిసి ఆ గుడిలో పూజారి గారు మా తండ్రి గారితో నాన్నగారిని ఒక్కసారి గుడికి తీసుకొని రమ్మన్నారు. అలా నాన్నగారు వెళ్ళి అక్కడ ఉన్న బాబా విగ్రహాన్ని తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న హుండీలో ఎంతోకొంత విరాళం సమర్పించి రెడ్డిగారు రేపటినుండి మీ గుడి అభివృద్ధిలోకి వస్తుంది విరాళాలు వస్తాయి అని చెప్పారు. నాన్నగారు ఆ గుడిని అంత ప్రేమతో తిలకిస్తూ ఉంటే, మనము మహాత్ముల దగ్గరికి పవిత్రులము అవ్వటానికి వెళతాము, మహాత్ములు అటువంటి స్థలానికి పవిత్రత ఇవ్వటానికి వెళతారు అనిపించింది. తదుపరి కాలంలో ఆ గుడి చాలా అభివృద్ధిలోకి వచ్చింది. తర్వాత అయ్యప్పస్వామి గుడికి వెళ్ళి అక్కడ నుండి ద్వారపూడిలో ఉన్న బాబా గుడికి వెళ్ళాము ఆ రోజు గురువారం అవ్వటం వలన ప్రసాదాలు ఇచ్చారు. నాతో పాటు కొంతమంది మన భక్తులు కూడా ఉన్నారు. మా అందరికీ నాన్నగారు తీర్థం ఇచ్చారు. తరువాత మా చేతిలో ఉన్న ప్రసాదాలు ఎక్కడైనా కూర్చుని తిందాము అనుకుంటున్నాము. అప్పుడు నాన్నగారు మా అందరి ప్రసాదాలు తీసుకొని నాకు ఇచ్చి మా తండ్రి గారిని పిలిచి మీరు ఇక్కడ కూర్చొని ముందు ఈ ప్రసాదం స్వీకరించండి అని చెప్పారు. మా తండ్రి గారు లేదు నాన్నగారు తరువాత తింటాను అన్నారు. కానీ నాన్నగారు ముందు మీరు తినండి, తిన్న తర్వాత బయలుదేరుదాము అని చెప్పారు. మా తండ్రిగారు నాన్నగారు వచ్చిన ఆనందంలో భోజనం చేయలేదట ఆ విషయం నాకు తరువాత తెలిసింది. నాన్నగారిది ఎంత ప్రేమో అనిపించింది.

తరువాత ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు, మెడిటేషన్ హాల్ లో కూర్చుని ఉన్నాము. నాన్నగారు నాకు దృష్టిని ఇస్తూ ఉంటే, అప్పుడు ఉన్న అవగాహన బట్టి ఏ సాధకుడు అయినా కొంచెం సిద్ధంగా ఉన్నాడు అంటే వాడి పని పూర్తి అయిపోతుంది అనిపించేది. నాన్నగారి ద్వారా ప్రసరించే ఆ దృష్టి అంతా తీక్షణంగా ఉంది. నాకు నాన్నగారు రెండు నేత్రాలు కనిపించటంలేదు ఒకటే నేత్రం కనిపిస్తోంది అది రాక్షసి నేత్రంలా అనిపించి, నాకు భయం వేసింది. నాకు సర్వస్వము నాన్నగారే, నా మనసు సహకరిస్తేనే కదా నాన్నగారి దగ్గరికి వెళ్తాను లేదంటే వెళ్ళలేను అని నా మనసుకి భయం పట్టుకొని నాన్న గారి దగ్గరకి వెళ్దామని అని వెళ్ళేసరికి నాన్నగారు రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు పరుగున వెళ్ళి నాన్నగారు మీ కన్ను రాక్షస కన్నులా కనిపించి నాకు భయం వేసింది అని చెప్పాను. నువ్వు ఏమీ కంగారు పడకమ్మా కాసేపు విశ్రాంతి తీసుకొని వచ్చి మెడిటేషన్ హాల్లో కూర్చుని ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాము అని చెప్పి లోపలికి వెళ్ళారు. మధ్యాహ్నం వచ్చిన తరువాత నాన్నగారు గురువుకి శత్రువులు ఎవరూ ఉండరు అమ్మ నీ అహంకారమే నీకు శత్రువు. దానికి ఎలాగైనా కనపడనివ్వు, నువ్వు ఏమీ కంగారు పడకు అని చెప్పారు. అప్పుడు లోపల నా మనసు సర్దుకుని భయం తొలగింది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నాన్నగారు ఎప్పుడు వస్తే అదే మంచి రోజు అనుకునే వాళ్ళం ప్రత్యేకంగా మంచి రోజు చూసే వాళ్ళం కాదు. మా అమ్మాయి ఫంక్షన్ అలాగే జరిగింది, గృహప్రవేశము కూడా అలాగే జరిగింది. గృహప్రవేశ సమయంలో నాన్నగారు చాలా నీరసంగా ఉన్నారు అందువలన నాన్నగారు రెస్ట్ తీసుకోండి మధ్యాహ్నం నుండి మా ఇంటికి వెళదాము అని చెప్పాను. నాన్నగారు నా వైపు కూడా చూడకుండా నేను 12లోపు భవాని ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మంజునాద్ లో మంజునాథుడు ఎలా అయితే అడుగుపెడతాడో అలా మా గృహాములో నాన్న పాదం మోపారు. మొత్తం ఇల్లంతా తిరిగి చూసారు. మా తల్లిదండ్రులకు ఒక సమయంలో ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఎవరో ఒక భక్తురాలు వచ్చి నెల్లూరులో ఉన్న గొలగమూడి వెంకయ్య స్వామి గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు. నేను మా చెల్లి అక్కడికి వెళ్ళి 111 ప్రదక్షిణాలు చేస్తుంటే, నాకు తలనీలాలు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చి, తలనీలాలు సమర్పించడం జరిగింది. తర్వాత హైదరాబాద్ వచ్చేసాము. మేము వచ్చిన తరువాత నాన్నగారు వచ్చారు అని దర్శనానికి వెళ్ళాము. నన్ను చూడగానే నాన్నగారు కళ్ళు పెద్దవి చేసుకుని కారణం లేకుండా తలనీలాలు ఎందుకు సమర్పించావు అని అడిగారు. స్త్రీలు ఎవ్వరూ తలనీలాలు సమర్పించవలసిన అవసరం లేదు అని చెప్పారు. మరుసటి రోజు కూడా ఇంగ్లీషులో మరలా అదే చెప్పారు. నాన్నగారు నాకు ఆ రోజు ఏమని తెలియజేశారు అంటే, అక్కడ ఇక్కడ ఉన్న భగవంతుడు ఒక్కటే, వేరు కాదు. ప్రారబ్ధాన్ని ఖర్చు పెట్టించడానికి నీ జీవితంలోకి గురువు వచ్చాడు నీవు తప్పించుకోలేవు. నీకు అన్నీ నేనే అని నాకు తెలియజేశారు. రాముడిని, కృష్ణుడిని, బాబాని చూడకపోయినా నాన్నగారు అది అంతా పూర్ణం చేసేసారు. నాన్నగారి సమక్షం చాలు అనిపించేది.

నా భర్త ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి అనుకున్నారు. నాన్నగారు నన్ను నాభర్తని అరుణాచలం రమ్మని కబురు పంపారు. మేము అరుణాచలం వెళ్ళిన తరువాత ప్రత్యేకంగా నా భర్తను నాన్నగారు గదిలోకి పిలిచి మీరు ఉద్యోగం మానవద్దు అని చెప్పి మాట్లాడారు. కానీ నా భర్త ఎంత చెప్పినా వినకపోయేసరికి చివరికి నాన్నగారు ఇది శివుడి ఆజ్ఞ మీరు ఉద్యోగం చేయవలసిందే అని చెప్పారు. మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా నా భర్త చెవిలో అదే మాట తరచు వినిపిస్తూ ఉండేదట. అయినా సరే, రిజైన్ లెటర్ తీసుకొని ఆయన ఆఫీస్ కి వెళ్ళి బాస్ కి ఇచ్చారు. అక్కడ ఆ బాస్ నువ్వు ఈ లెటర్ ఇస్తే నా శవాన్ని దాటి వెళ్తావు అని ఆయనకి తెలియకుండానే అన్నారట. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెబితే ఆ భాస్ ద్వారా నాన్నగారు అనిపించారు అనుకున్నాను. నాన్నగారు నా భర్తని ఒక ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేయమన్నారు కానీ రిటైర్ అయ్యేంతవరకు చేస్తాను అని నా భర్త అన్నారు. నాన్నగారి దయవలనే మేము ఈ రోజుకి కూడా ఆనందంగా ఉన్నాము. ఒకసారి అరుణాచలంలో నాన్నగారు రామకృష్ణుడి దగ్గరకి ఎవరో ఒక భక్తుడు వచ్చి మీరు మీ 18 మంది శిష్యులను తల్లిలా చూసుకుంటున్నారు అని అన్నాడట అని చెబుతూ నా వైపు చూసి కళ్ళు పెద్దవి చేసుకుని నన్ను జీవ లక్షణాలతో ఉన్న ఆ తల్లితో పోలుస్తావా అని అన్నారు. ఇంకా గట్టిగా అంటే నా గుండె ఆగిపోదును నాన్నగారు అని నా మనసులో అనుకుంటున్నాను. ఈ లోపు నాన్నగారు ఆ భక్తుడు కూడా అలాగే గుండె ఆగిపోదును అనుకున్నాడట అన్నారు. ఒకసారి కృష్ణుడి గురించి చెబుతూ నాన్నగారు ఆ తన్మయత్వంలో ఉన్నారు. అప్పుడు మా అమ్మాయి విజయ ఫోన్ చేసి నాన్నగారికి నమస్కారాలు చెప్పమంది. నేను లేచి నిలబడి నాన్నగారు మీకు విజయ నమస్కారాలు చెప్పమంది అన్నాను. నాన్నగారు నెమ్మదిగా ఎవరు విజయ అంటే, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఆ గోల నీకేలా అన్నారు. ఆ రోజున నాన్నగారు మేడ మీద నుంచి గదిలోకి వెళ్ళటానికి రెండు గంటల సమయం పట్టింది ప్రతి భక్తుడు దగ్గర ఆగుతూ కృష్ణుడి గురించి మాట్లాడుతూ వెళ్ళారు. నాన్నగారు ఏ మహాత్ముడు గురించి మాట్లాడినా, ఆ మహాత్ముడు అయ్యి మాట్లాడేవారు. అందుకే మనము ఆయన సన్నిధిలో కరిగిపోయే వాళ్ళము. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నాన్నగారు సత్సంగాల ద్వారా నాన్నగారి ప్రవచనాలతో చాలా సహాయం లభించేది.

మా అమ్మాయి చదువు నిమిత్తం కేరళ వెళ్ళవలసి వచ్చింది. కానీ అక్కడ నాన్ లోకల్ సమస్య వస్తుందని భయపడి నాన్నగారితో విన్నవించుకుంటే, ముందు పరీక్ష రాయనివ్వు తరువాత చూద్దాము అన్నారు. నాన్నగారి దయ వలన మా అమ్మాయి చదువుకి ఏ ఆటంకమూ కలగలేదు. నాన్నగారు సర్వసమర్థుడు, ఈ సృష్టిలో ఏ పని అయినా ఆయనకు సాధ్యమే. నాన్నగారితో పాటు కాశీ వెళ్ళి, అక్కడ నుండి గయకు వెళ్ళాము. గయలో విష్ణుపాదాని చూసి నాన్నగారు పాదాలను చూస్తే అచ్చుగుద్దినట్టు నాన్నగారి పాదాలు విష్ణు పాదాలు లాగానే అనిపించాయి. కాశీలో కొంత మంది భక్తులతో కలిసి అక్కడ కొన్ని ఘాట్లు ఉంటే గంగానదిలో పడవలో దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము. వర్షం పడటం వలన అన్ని పడవలు ఆగిపోయినా, మా పడవను నడిపే అతను మాత్రం మమ్మల్ని తీసుకు వెళ్ళటానికి అంగీకరించాడు. మధ్యలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర నుండి పడవ ముందుకి కదలడం లేదు. ఆ పడవ నడిపే వ్యక్తి చాలా భయంతో, పడవను కదపటానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఉన్న భక్తులులో ఒకరు ఆ పడవ నడిపే వారిని ఏమయింది అని అడిగితే, పడవ ముందుకి కదలటం లేదు. మెలి తిరుగుతోంది ఇలా తిరిగితే నీరు పడవని ముంచేస్తుంది అన్నాడు. అయినా కానీ మన భక్తుల ముఖాలాలో ఎవరికీ మరణ భయం కనిపించలేదు అందరూ చాలా ఆనందంగా రామనామము చేసుకున్నాము, అమ్మవారి మీద పాటలు పాడుకున్నాము. మాకు ఈ సంఘటన జరిగే సమయంలో అక్కడ నాన్నగారు మా గురించి ఎక్కడికి వెళ్ళారు అని అడిగారట. ఎవరికీ చెప్పకుండా దేవాలయాలు దర్శనార్థం వెళ్ళారు నాన్నగారు అని అక్కడ ఉన్న భక్తులు చెప్పారట. నాన్నగారు ఆ మాట వినగానే, నిద్ర పోకుండా చెయ్యి పైకి ఎత్తి అభయ హస్తం చూపిస్తూనే ఉన్నారట. ఈ లోపు పడవనడిపే ఆయన దగ్గరలో ఉన్న ఘాట్ లోకి పడవలో ఉన్న తాడుని విసిరాడు ఆ తాడుని ఆ ఘాట్ లో ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్న గునపానికి గట్టిగా మెలిపెట్టి పడవను నెమ్మదిగా ఆ ఘాట్ దగ్గరకు లాగారు. అలా నాన్నగారి దయతో మేము అందరము ప్రమాదం నుండి తప్పుకుని ఘాట్ దగ్గరికి చేరుకున్నాము. మా అమ్మాయికి సంబంధించిన ప్రతీ విషయము నాన్నగారే స్వయంగా చూసుకుంటున్నారు అనిపిస్తుంది. తన వివాహ విషయం ఎప్పుడైనా ప్రస్తావిస్తే మీ అబ్బాయికి మీరు చూసుకోండి కానీ అమ్మాయి విషయానికి వస్తే నాకు చెప్పండి. నేను ఆలోచించి చెబుతాను దాన్నిబట్టి చేద్దాము అన్నారు. నాన్నగారు షష్టిపూర్తికి చిక్కడపల్లి భక్తులు అందరం జిన్నూరు వెళ్ళాము. కన్నమ్మ గారు మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా భోజనానికి ఆహ్వానించి చాలా ప్రేమగా స్వయంగా ఆమె వడ్డించారు. మేము ఇక చాలు కన్నమ్మ గారు మా కడపు నిండిపోయింది అంటే, నేను మీ కడుపు నింపుతాను, నాన్నగారు మీ మనస్సులు నింపుతారు అన్నారు. నాన్నగారు శివ స్వరూపమే కదా, శివుడి దగ్గర అమ్మవారు మాత్రమే ఉండగలరు. అలా కన్నమ్మ గారు అమ్మవారి స్వరూపం. నాన్నగారు కన్నమ్మ గారితో చిక్కడపల్లి భక్తులు అని ఉంటారు, వారందరూ గోపికలు అన్నారట.

Sunday, October 3, 2021

"శ్వాస పోయినా విశ్వాసం చెదరకూడదు" - (By శ్రీనివాస్ గారు)

నాన్నగారిని మనం పట్టుకున్నాము అనడం కంటే, నాన్నగారే మనల్ని పట్టుకున్నారు అనటమే సరియైనది. ఎందుకంటే! మనం నాన్నగారిని పట్టుకుంటే ఎప్పుడో వదిలేసేవాళ్ళము. ఆయనే మనల్ని పట్టుకోవడం వలన మనకి ఆయన మీద ఇష్టాన్ని, ప్రేమని ఆయనే కలిగించుకుని, ఈ జీవితానికి సరిపడే తీపి జ్ఞాపకాలను నింపారు. నాన్నగారు మన చెయ్యిపట్టి నడిపించారు అనే మాట కంటే, ప్రతి సంఘటనలోను మనల్ని ఎత్తుకుని తీసుకెళ్తున్నారు అని సత్వగుణంలో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం రజో, తమో గుణాల్లో ఉన్నప్పుడు దానిని గుర్తించలేము. మోక్ష జ్ఞానాల గురించి మాట్లాడలేకపోయినా, నాన్నగారి సమక్షంలో గడిపిన కొన్ని మధురమైన సంఘటనలు మీతో పంచుకుంటాను.

మొట్టమొదటిగా నేను నాన్నగారి దగ్గరకు వెళ్ళడానికి, అలా వెళ్ళినప్పుడు ఆయనతో గడిపే అవకాశం లభించడానికి కారణమైన, నా కుటుంబ సభ్యులకు, నాన్నగారి భక్తులకు, అలాగే నాన్నగారి కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాన్నగారితో నాకు ఏర్పడిన ఈ అనుబంధం ఈ జన్మలోది కాదేమో, అది పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. మనం పూర్వ జన్మలో చేసుకున్న సాధనను బట్టి మనకు ఏ కుటుంబంలో జన్మను ఇవ్వాలి అనేది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు అని నాన్నగారు చెబుతారు కదా! అలా నాన్నగారి దయవలన, భక్తుల కుటుంబంలో జన్మించడం జరిగింది.

నాకు సుమారు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు శ్రీ నాన్నగారిని మొట్టమొదటిసారిగా శృంగవృక్షంలో మా అమ్మగారితో పాటు దర్శించుకున్నాను. అప్పటికి మా కుటుంబ సభ్యులకు నాన్నగారిని తరచూ దర్శించుకునే భాగ్యము ఉండేది కాదు. మరొకసారి నేను నాలుగవ తరగతి చదువుతున్నప్పుడు, శృంగవృక్షంలో అరుణాచల జ్యోతికి నాన్నగారి దర్శనం చేసుకున్నాను. ఆ తరువాత మా తండ్రి గారి వృత్తిరీత్యా మా కుటుంబం నౌడూరు అనే గ్రామము రావటం జరిగింది. అలా ఆ గ్రామము వెళ్ళటమే, మా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఊర్లో మా ఇంటి ప్రక్కనే నాన్నగారు భక్తులు ఉండడం వలన, తరచూ మా అమ్మగారు వారితో పాటు శ్రీ నాన్నగారి దర్శనానికి వెళుతూ, మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళేవారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు అప్పట్లో భక్తి తెలియకపోయినా, నాన్నగారు చాలా ప్రేమగా పలకరించి, ఆయన మీద ఇష్టాన్ని, ప్రేమను కలుగజేసుకున్నారు. నా చదువు విషయంలో తగిన సలహాలు ఇస్తూ మార్గనిర్దేశం చేసేవారు. నా పదవ తరగతి అయిన తరువాత, ఇంటర్మీడియట్ లో నాన్నగారు నన్ను MPC గ్రూపు తీసుకోమన్నారు. అలా నాన్నగారి సలహాతో గుడివాడ హాస్టల్లో ఉండి ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఆ సమయంలో ఒకసారి నాన్నగారు అరుణాచలం నుంచి భీమవరం వస్తుంటే, తెల్లవారుజామున గుడివాడలో నాన్నగారిని దర్శనం చేసుకోవటానికి రైల్వేస్టేషన్ కి వెళ్ళాను. ట్రైన్ వచ్చిన తరువాత నాన్నగారు ఉన్న భోగీ లోకి వెళితే, ఆ సమయంలో నాన్నగారు ఇంకా నిద్రలేవలేదు అని, అక్కడ ఉన్న భక్తులు దూరం నుండి నమస్కారం చేసుకోమన్నారు. నాన్నగారు సడన్ గా మేల్కొని నన్ను అత్యంత ప్రేమతో ఆశీర్వదించారు. అది చాలా చిన్న సంఘటనే అయినప్పటికీ, నాకు అది మరచిపోలేని మధురమైన సంఘటన. ఆ సంఘటన ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, నాన్నగారు నాపై ఎంతో ప్రేమ కురిపించారు అనిపిస్తూ ఉంటుంది. అలా చదువుకునే రోజుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రవచనాలు ఉంటే వెళ్ళేవాడిని. అప్పుడు నాన్నగారు ఎంతో ప్రేమగా నా యోగ క్షేమాలు అడుగుతూ, ఆయనపై ప్రేమ కలిగేటట్టు చేసుకున్నారు. నాకు ఇంటర్ అయిన తరువాత నాన్నగారితో కలిసి నేను మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళాను. తర్వాత ఇంజనీరింగ్ నూజివీడులో చదువుకున్నాను. కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడు నాన్నగారి దర్శనానికి వెళ్లేవాడిని. నాకు నాన్నగారు చెప్పే సబ్జెక్ట్ తెలియకపోయినా, ఆయన చూపించే ప్రేమకు ఆయన వైపుకు ఆకర్షితుడిని అయ్యేవాడిని. ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత, ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ హైదరాబాదులో ఉండేవాడిని. అలా నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు, నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని.

తర్వాత నాకు మాచర్ల ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా జాబ్ వచ్చింది. నాన్నగారు కొమ్మరలో ఉంటే ఆశీర్వాదము తీసుకుందామని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నాన్నగారు మరొక చోటకు వెళదామని బయలుదేరుతున్నారు, నన్ను చూసి నన్ను ఆశీర్వదించి, అక్కడ నుండి కారులో ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు. అలా ప్రతి సంఘటనలోనూ ఆయనే మనకి ఆయనపై ప్రేమ కల్పిస్తూ, నెమ్మది నెమ్మదిగా ఆయన వశం చేసుకున్నారు. మాచర్లలో లెక్చరర్ గా ఒక సంవత్సరం పని చేశాను. తర్వాత భీమవరం కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నాన్నగారి దర్శనభాగ్యం బాగా కలిగేది. భీమవరం చుట్టుపక్కల నాన్నగారు చెప్పే ప్రవచనాలకి వెళ్ళేవాడిని, అలా తరచూ నాన్నగారి దర్శనానికి వెళ్ళడం జరిగేది. అలా ఒక సంవత్సరం అయిన తర్వాత నాకు M.Tech చదవటానికి హైదరాబాదులోని, తిరుచునాపల్లిలో రెండు చోట్ల సీట్లు వచ్చాయి. నాకు ఎక్కడ జాయిన్ అవ్వాలో అర్థం అవ్వక, నాన్నగారిని అడుగుదామని వెళ్ళి అడిగాను. అప్పుడు జిన్నూరు లో నాన్నగారు అరుగు మీద కొంత మంది భక్తులు కూర్చుని ఉన్నారు. వారిలో ఒక ఇంజనీర్ గారు కూడా ఉన్నారు, నాన్నగారు వారిని అడిగి, వారి సలహా తీసుకుని, నన్ను తిరుచునాపల్లి లో జాయిన్ అవమని చెప్పారు. ఆ విధంగా నాన్నగారి ఆశీర్వాదంతో తిరుచునాపల్లి వెళ్ళాను. ఆ సమయంలో నాన్నగారు అరుణాచలం వచ్చినప్పుడు, నేను కూడా వెళ్ళి నాన్నగారి దర్శనం చేసుకుని వస్తూ ఉండేవాడిని. ఒకసారి హాస్టల్ లో మధ్యాహ్నం పడుకొని ఉన్నాను. అప్పటికీ ఈ జ్ఞానం, మోక్షం అనే వాటి మీద నాకు ఏమీ తపన ఉండేది కాదు. అప్పుడు నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నాన్నగారి పాదంతో నా మనసుని నొక్కిపెట్టి, లోపలికి పంపిస్తున్నారు, కానీ నాకు పవిత్రత లేకపోవటం వలన, ఉక్కిరిబిక్కిరి అయ్యి బయటకు వచ్చేస్తున్నాను, నాన్నగారు లోపల వస్తువు ఎంత పవిత్రంగా ఉందో, నువ్వు కూడా అంత పవిత్రంగా ఉంటే అది లభిస్తుంది అని చెబుతున్నారు, అలా ఆ స్వప్నం కరిగిపోయింది. ఇది నాన్న గారి దయ వలన కలిగిన, మొట్టమొదటి ఆధ్యాత్మిక అనుభూతి. M.Tech చదువుకునే సమయంలో, నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు నాన్నగారు నన్ను తిరుచునాపల్లికి దగ్గరగా ఉండే పుణ్యక్షేత్రాలను ఏమైనా దర్శించుకున్నవా అని ఎంతో ప్రేమతో అడిగి తెలుసుకుంటూ ఉండేవారు.

M.Tech అయిన తర్వాత, మరల భీమవరం కాలేజ్ లో లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నాన్నగారు 2009 లో September లో పుట్టిన రోజు అయిన తర్వాత కాశీ వెళ్ళారు. వారితో పాటు నేను కూడా వెళ్ళాను. సెప్టెంబర్ 28న ఈ దేహం పుట్టినరోజు. అదే రోజు విజయదశమి కూడా వచ్చింది. ఆరోజు ఉదయాన్నే నాన్నగారి ఆశీర్వాదం కోసం వెళ్ళాను. అప్పుడు నాన్నగారు నన్ను నీ వలన అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు తరిస్తాయి అమ్మ అని ఆశీర్వదించారు. నాన్నగారు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు తలచుకున్నా, ఆనందం అనిపించి, ఆ అర్హత కూడా ఆయనే ఇవ్వాలి, అలా ఆయనే ప్రిపేర్ చేస్తారు అనిపిస్తుంది. రాముడు జటాయువుకి అంతిమ సంస్కారం చేసినప్పుడు, “మహాత్ములు, మహర్షులు, గొప్ప,గొప్ప తపస్సులు చేసిన వారు ఏ లోకానికి అయితే వెళ్తారో ఓ జటాయువు నువ్వు కూడా ఆ లోకానికి వెళతావు, ఇది రామాజ్ఞ” అంటారు కదా! అలాగే ఇది నాన్నగారి ఆజ్ఞ. అయితే నాన్నగారు మీద విశ్వాసం మనకు చెక్కుచెదరకుండా ఉండాలి. నేను ఎప్పుడూ కూడా నాన్నగారిని మీ పాదాలను వదలకుండా పట్టుకునేటట్టు అనుగ్రహించండి అని ప్రార్థించేవాడిని. ఆయన పాదాలను పట్టుకుని ఉంటే, ఆయనే తీసుకువెళ్తారు, కాకపోతే ఈ మాయలో పడిపోయి నాన్నగారి పాదాల మీద విశ్వాసం కోల్పోకూడదు. నువ్వు బుద్ధిమంతుడువి నువ్వు తరిస్తావు అమ్మ అని ప్రోత్సహించేవారు.

2009లో కాశీలో నాన్నగారి సమక్షంలో నా పుట్టిన రోజు జరుపుకోవటం అనేది నాకు ఒక మధురానుభూతి. ఒకసారి ఏదో ఒక సమస్య వలన నాకు బాధ కలిగి నాన్నగారికి విన్నవించుకున్నాను. అప్పుడు నాన్నగారు “మనం గుడిలో ఉన్న ఏ దేవుడినీ అయితే పూజిస్తామో, ఆ దేవుడు మన అందరి హృదయాలలో ఉండి వారి ప్రారబ్దం ప్రకారం ఆడిస్తాడు కాబట్టి దాని గురించి మనం చింతించనవసరం లేదు” అన్నారు. నాన్నగారు చెప్పిన ఈ వాక్యము నాకు చాలా శక్తిని ఇచ్చి, నాపై ప్రభావితం చూపింది. నాన్నగారు స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం అంటారు. నాకు స్వప్రయత్నం లేదు, కాల పరిపక్వము గురించి తెలియదు. ఆయన ఏమి చేసుకోవాలనుకుంటున్నారో అది ఆయనే చేసుకోవాలి, అంతా ఆయన అనుగ్రహమే. నాన్నగారు ఇంటి దగ్గర దర్శనం చేసుకోవటం, ఆయన సమక్షంలో ఏకాంతంగా కొద్దిసేపు గడపటం ఇలాంటివి ఎక్కువ నా హృదయానికి హత్తుకునేవి. నా జీవితంలో నాకు ఎదురు అయిన, ప్రతి సంఘటన నాన్నగారితో ముడిపడి ఉంది.

2011 సెప్టెంబర్ 1 వినాయక చవితి అయింది. ఆ రోజు భగవాన్ అరుణాచలంలో అడుగుపెట్టిన రోజు కదా! నాన్నగారు ఐ భీమవరం లో ప్రవచనం పెట్టారు. నేను పనిచేసే చోటు నాకు ఏమైనా ఇబ్బంది ఉంటే అది నాన్నగారితో చెప్పుకునే వాడిని. అలా నేను నా ఉద్యోగ విషయంలో వచ్చిన సమస్యను చెప్పు కున్నప్పుడు, కాలేజీలో పని నేను ఏ విధంగా చేసుకోవాలో కూడా నాన్నగారు నాకు సూచించారు. నువ్వు Administration విభాగంలో ఉన్నావు కాబట్టి, ఎవరు ఏ పనికి సరి పోతారో, కరెక్ట్ గా వారిని ఆ ప్లేస్ లో పెట్టు. అప్పుడు నీకు పని చేసుకోవటం సులభం అవుతుంది అని చెప్పి, అక్కడ ఉన్న వారితో, వీడు వచ్చి నాతో చెప్పుకున్నాడు, వీడికి ఇబ్బంది ఏమీ ఉండదు అలవాటైపోతుంది అనే అభయమిచ్చి, ఆ భారం కూడా ఆయనే వహించారు. అలా నాన్నగారు ప్రతి ఒక్క భక్తుల విషయంలో వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ, ఆధ్యాత్మిక జీవితంలోనే కాకుండా బాహ్య జీవితంలో కూడా ఎలా సమన్వయ పరచుకుంటూ జీవించాలో చక్కగా వివరించేవారు. ఒక్కొక్క భక్తుని ఒక్కోరకంగా తరింప చేస్తారు అన్నట్టు ఒకరిని చూపుతో, ఒకరిని మాటతో, ఒకరిని టచ్ తో, అనుగ్రహిస్తూ, నాన్నగారు సహజంగా అందరిని తరింపచేస్తారు. వారి మనస్తత్వాన్ని బట్టి ఏమి చేయాలో నాన్నగారికే తెలుస్తుంది. అలా నాన్నగారు భక్తులు అందరిపై ఎంతో ప్రేమ కురింపించేవారు.

2015 సంక్రాంతి సెలవుల్లో బేలూరు మఠం వెళ్ళాలి అనుకొని, వెళ్ళే ముందు నాన్నగారికి చెప్పాము. నాన్నగారు వెళ్ళి రమ్మని ఆశీర్వదించారు. అక్కడ మూడు రోజులు ఉండి తిరిగి వచ్చి, వెంటనే నాన్నగారి దర్శనానికి వెళ్ళాను. నేను రావడం చూసి నాన్నగారు “రామకృష్ణుడు వస్తున్నాడు” అన్నారు. రామకృష్ణుడు ఫోటో ఒకటి, “రామకృష్ణుడు, శారదామాత, వివేకానందుడు” ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఒకటి, కొన్ని బుక్స్ తీసుకువెళ్ళి నాన్నగారికి ఇచ్చాను. బేలూరుమఠం వెళ్ళి వచ్చిన తరువాత “బుద్ధిమంతుడు” అని సంబోధించడం మొదలుపెట్టారు. “కర్తలేని కర్మ చేసేవాడిని బుద్ధిమంతుడు అంటారు” అని చెప్పారు. కానీ నేనేమో కర్తలేని కర్మను చేయట్లేదు, నాన్నగారు బుద్ధిమంతుడు అంటున్నారు. మనకి అలా చేసే శక్తిని ఆయనే కలగజేయాలి అనుకునేవాడిని. నాన్నగారు ఒకసారి “బేలూరు మఠానికి వెళ్ళి వచ్చావు కదా, అక్కడ ఏమేమి చూసావో! నీ అనుభవం చెప్పు” అని అడిగారు. అప్పుడు “నాన్నగారు, చూడటం అయితే చూసి వచ్చాను గాని లోపల పవిత్రత లేకపోవడం వలన నాకు ఏమీ అర్థం కాలేదు” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు “You are right” అన్నారు. అర్హత లేనప్పుడు భగవంతుడు వచ్చి మన పక్కన కూర్చున్నా గుర్తించలేము.

2015 శివరాత్రికి నాన్నగారు భీమవరం వచ్చారు. అక్కడ కూడా నాకు అవకాశం బాగా ఇచ్చేవారు ఏమైనా నాతో మాట్లాడాలా అని అడిగేవారు. అప్పుడు నేను “మీరు కర్తలేని కర్మ చేయమంటున్నారు కదా నాన్నగారు, నేను అది చేయలేకపోతున్నాను” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు “కర్తలేని కర్మ చేయటం నీకు అలవాటు అవుతుంది” అని అభయమిచ్చారు. 2015 ఆ సమయంలో జీవుడు అంటే, రాగద్వేషాలు ఉంటాయి కదా! నాకు మా తాతయ్య గారికి కొన్ని మనస్పర్థల కారణంగా, నేను మా తాతయ్య గారి ఇంటికి వెళ్ళే వాడిని కాదు. అలా చాలా రోజులు వెళ్ళలేదు. ఒకసారి నాన్నగారి సమక్షంలో “పరిస్థితి ఇలా ఉంది నాన్నగారు” అని విన్నవించుకున్నాను. ఎందుకు అలా ఉంది అని అడిగారు. “అహంకారం నాన్నగారు” అన్నాను. “ఎవరికి అహంకారం” అని అడిగారు; నాకు, తాతయ్యకు అన్న ఉద్దేశంతో, “ఇద్దరికీ నాన్నగారు” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు కొంతసేపు మౌనం వహించారు. తర్వాత కళ్ళు తెరచి “మనమే వదిలేసుకుందాము అమ్మా” అన్నారు. నాన్నగారు చెప్పిన “మనమే వదిలేసుకుందాము” అనే మాట కేవలం మాట కాదు, “ఒక శక్తి తరంగం”. ఆ మాట ద్వారా నాలో శక్తిని నింపి, నన్ను మా తాతయ్య గారి ఇంటికి వెళ్లేట్టు చేసి ఆ పరిస్థితి చక్కదిద్దారు.

ఒకసారి నేను నాన్నగారు దర్శనానికి వెళ్ళేసరికి, అప్పుడే నాన్నగారు వైజాగ్ నుండి జిన్నూరు వచ్చారు. “ఎలా ఉన్నావు, హ్యాపీ గా ఉన్నావా?” అని అంటూ, “స్పిరిచువల్ గా ఎలా ఉన్నావు?” అని అడిగారు. “బాధగా ఉంది నాన్నగారు స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ చేయలేకపోతున్నాను” అని చెప్పాను. అప్పుడు నాన్నగారు “నేను నిన్ను హార్ట్ లోకి తీసుకుంటాను” అని చెప్పారు. ఆయన హార్ట్ లోకి తీసుకుంటే మనము కరిగిపోతాము అనిపించింది. 2016, 2017 లో నాన్నగారిని దర్శించుకోవటానికి వర్మగారు, మురళిగారు రూపంలో నాన్నగారు నాకు ఎక్కువ అవకాశం కల్పించారు. అందువలన నాన్నగారు భీమవరం వస్తె, నాకు పండుగ వాతావరణంలా అనిపించేది.

2016 సంక్రాంతికి భక్తులందరూ జిన్నూరులో శ్రీ నాన్న గారి సమక్షంలో కూర్చుని ఉన్నాము. ఆ సమయంలో నాకు అంత తపనగా కూడా ఏమీలేదు. నాన్నగారు ప్రవచనం చెబుతూ ఉంటే, భక్తులు ఎవరో పూలదండ తీసుకు వచ్చి, నాన్నగారి మెడలో వేసారు నేను అప్పుడు చాలా డల్ గా ఉన్నాను. ఆ పూల దండ తీసుకుని నాన్నగారి నా మెడలో వేసి ఎంతో ప్రేమగా అభయం హస్తంతో ఆశీర్వదించి, పండగ కాబట్టి భక్తులు అందరూ ఉన్నారు, అందువలన నువ్వు సబ్జెక్టు చెప్పు అని రెండు మూడు సార్లు అన్నారు నాన్నగారు. మనం ఏమి చెప్పగలము అనుకున్నాను. నాన్నగారితో, “నాన్నగారు నిన్న మీరు ఎండుటాకు చెట్టు నుండి రాలిపోయిన తర్వాత అది గాలికి ఎక్కడ పడినా సరే, ఎటు ఎగిరి వెళ్లినా సరే, ఎవరకి పిర్యాదు చేయదు. అలా మన ప్రారబ్దం ఎలా వున్నా ఈశ్వర సంకల్పానికి వదిలివేయాలి. భక్తులు అలా ఉండాలి అని చెప్పారు కదా! ఆ వాక్యం భాగా నచ్చింది, కానీ నాకు ఆ వాక్యం యొక్క లోతు తెలియలేదు నాన్నగారు” అని చెప్పాను. “లోతు తెలియాలి అంటే ఆ వాక్యాన్ని మనం మననం చేసుకోవాలి” అని నాన్నగారు అన్నారు. బ్రెయిన్లో వాక్యాన్ని మననం చేసుకోగా ఆ వాక్యం యొక్క లోతు అర్థం అవుతుంది అని చెప్పారు. అప్పటికే నాన్నగారు దేహం కొద్దిగా నీరసించటం మొదలైంది.

నాన్నగారు భీమవరంలో ఉండగా రోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ పట్టుకుని వెళ్ళేవాడిని. భీమవరంలో మురళిగారి ఇంట్లో నాన్నగారు బ్రష్ చేసుకుంటుంటే, నాన్నగారి దేహం ఒకోసారి తూలుతూ ఉండేది అప్పుడు నన్ను పట్టుకోమనేవారు. కృష్ణుడు మధురాష్టకం ఉంటుంది కదా! “అధరం మధురం, వదనం మధురం” అని అలా నాన్నగారు ప్రతి దినచర్య కూడా “ఆయన బ్రష్ చేసుకోవడం, పౌడర్ రాసుకోవడం, తలకు కొబ్బరి నూనె రాసుకునే విధానం” అంతే మధురంగా ఉండేది అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. 2017 లో ఈ దేహం పుట్టిన రోజుకి ఆయన ఆశీర్వాదం కోసం జిన్నూరు వెళ్ళాను. అంతకు ముందు రోజు నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు అని నాకు తెలియదు. ఆరోజే నాన్నగారికి హైదరాబాద్ ప్రయాణం ఉంది. దేహం అంత నీరసమైన స్థితిలో ఉన్నా Bless చేసి Happiness నింపారు. మరలా తిరిగి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు భీమవరం వచ్చారు అప్పుడు నాన్నగారికి skin rashes వచ్చాయి. అప్పుడు నాన్నగారు దగ్గర ఉండడానికి నాకు అవకాశం లభించింది. నాన్నగారు మధ్యాహ్నం భక్తులతో కూర్చున్నారు. నాన్నగారికి ఆరోజు స్వప్నంలో రామకృష్ణుడు, శారదామాత కనిపించారట. శారదా మాత ఏమీ అనలేదు కానీ రామకృష్ణుడు నీకు ఇప్పుడే ఇలా రావాలా అన్నాడు అని చెప్పి, రామకృష్ణుడుకి “నేను వెళ్ళడం ఇష్టం లేదు ఇప్పుడు” అన్నారు. అప్పుడు “వెళ్ళడం” అన్న మాటకి నాకు అర్థం తెలియక నాన్నగారు సహజంగానే అన్నారు అనుకున్నాను. అప్పటి నుండి ఆయనే రామకృష్ణుడు అయిపోయారు. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా, నిరంతరాయంగా రెండు మూడు గంటలు రామకృష్ణుడు సబ్జెక్ట్ చెప్పేవారు. ఆరోజు నేను కాలేజ్ పని మీద హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. నాన్నగారి దగ్గర సెలవు తీసుకుందాము అని వెళ్తే మళ్ళి నన్ను ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని రామకృష్ణుడు సబ్జెక్ట్ చెప్పారు. నాన్నగారి దగ్గర కూర్చుని అలా మాట్లాడటం అదే ఆఖరిసారి అయింది. తర్వాత దర్శనానికి వెళ్లాను కానీ అంత దగ్గరగా మాట్లాడటం అదే ఆఖరిసారి.

తర్వాత నాన్నగారు వైజాగ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర నాలుగైదు రోజులు ఉండే అవకాశం వచ్చింది. నాన్నగారు జిన్నూరు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చి నైట్ నాన్నగారి దగ్గర ఉండే అవకాశం కలిగింది. అలా జీవితంలో ప్రతి సంఘటనలోను నన్ను అనుగ్రహిస్తూ, ఎంతో ప్రేమని నింపారు అది ఈ జన్మకి సరిపోతుంది అనిపిస్తుంది. జ్ఞానం,మోక్షం ఎలా ఉన్నా, నాన్నగారి పాదాల మీద విశ్వాసం కోల్పోకుండా ఉంటే చాలు అనిపిస్తుంది. నాన్నగారు హైదరాబాద్ వెళ్తుంటే పాలకొల్లు రైల్వేస్టేషన్లో దర్శనాలు, భీమవరం రైల్వేస్టేషన్ లో దర్శనాలు, అలా ప్రతి క్షణం నాన్నగారి సమక్షంలో ఉండటం అనేది ఒక మహద్భాగ్యం, పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో తెలియదు కానీ ఈ జన్మలో అయితే నా వైపు నుంచి స్వప్రయత్నం లేదు అని తెలుస్తోంది. 2017 ఆ సమయంలో భక్తుల ముందు “వీడు సేవ చేస్తున్నాడమ్మా” అనేవారు నాన్నగారు. అవకాశం ఇచ్చింది ఆయనే కదా! మనము ఏ పాటి సేవ చేస్తున్నామో మనకు తెలుసు, నాన్నగారికి తెలుసు. అలా ఎందుకు అనేవారో అప్పుడు అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు అది గుర్తుకు వస్తూ ఉంటే, ఏమని అనిపిస్తుంది అంటే, “పరీక్షల్లో కాకి బొమ్మ గియ్యమని చెప్పి 4 గీతలు గీసిన తర్వాత, కింద కాకి అని రాస్తే ఏవో మార్కులు వేసి పాస్ చేసేస్తారు కదా టీచర్”. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న మా లాంటి వారే అలా ఆలోచిస్తే, ఆయన ఆచార్యులు కదా! మనం చేసే చేష్టలకి 4 గీతలు గీసాము ఏమో, మనం కాకి అని కూడా రాయలేదు. నాన్నగారే కాకి అని పేరు రాసి మార్క్స్ ఇచ్చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. దానికి నాన్నగారు “సేవ” అని పేరు పెట్టారు అని అనుకుంటూ ఉంటాను. శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు అంటారు కదా! ఏ సమయానికి ఎలా ఉంటామో తెలియదు. మనకి ఇలాంటి మహా గురువు లబించారు కాబట్టి శ్వాస పోయేవరకు విశ్వాసంగా ఉంటే ఆయనే చూసుకుంటారు. ఈశ్వరుడికి అసాధ్యం లేదు.

Sunday, September 26, 2021

"నాన్నగారి అంతులేని ప్రేమ ప్రవాహం" - (By పద్మ గారు (హైదరాబాద్))

నాన్నగారు రాముడు గురించి చెబుతున్నప్పుడు రాముడిలా, కృష్ణుడి గురించి చెబుతున్నప్పుడు కృష్ణుడిలా అనిపించేవారు. రామకృష్ణుడిలా, షిర్డీసాయిబాబాలా, శంకరాచార్యునిలా బుద్ధుడిలా, భగవాన్ లా ఇలా నాన్నగారు ఎవరి గురించి చెబితే వారి రూపంలా అనిపించేవారు. నాన్నగారిలో అందరి మహాత్ములను దర్శించిన ఆనందం కలిగేది. నాన్నగారి సమక్షంలో చింతామణిలా చింతలు తీరేవి. కల్పవృక్షంలా కోరికలు తీరేవి. చంద్రుని వెన్నెలలా చల్లదనం ప్రసరించేది.

షిర్డీసాయిబాబా నా భక్తులను నా దగ్గరకు తీసుకుంటాను అని చెప్పారు. అంటే మనం ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నా గురువుకి తెలుస్తుంది. మేము నల్గొండ జిల్లా రాశి సిమెంట్ ఫేక్టరీ దగ్గర ఉండేవాళ్ళము. అక్కడి నుండి 1992 డిసెంబరు మొదటి వారంలో హైదరాబాదుకి మారాము. ఆ చివరి వారంలో నాన్నగారు పరిచయం అయ్యారు. మేము హైదరాబాద్ రావడం వల్ల ప్రయోజనం ఏమిటంటే, నాన్నగారి సన్నిధికి చేరుకోవడం జరిగింది. ఆయన రప్పించుకున్నారు. ఇది "దైవానుగ్రహం".

మా అత్తగారు, ఆడపడుచు నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేసారు. నాన్నగారు అప్పుడు లక్ష్మీవాళ్ళ నాన్నగారు వరహాలరాజుగారి ఇంట్లో ఉన్నారు. నాన్నగారు నన్ను బాగా పలకరించారు. ఏం చదివావు? ఏం పుస్తకాలు చదువుకుంటూ ఉంటావు? అని అడిగారు. మొదటి దర్శనంలోనే నాకు నాన్నగారంటే బాగా ఇష్టం ఏర్పడింది. రెండు రోజుల్లో త్యాగరాయ గానసభలో "రమణభాషణములు" పుస్తకం ఆవిష్కరణోత్సవం ఉంది రమ్మని ఆహ్వానపత్రిక ఇచ్చారు.

త్యాగరాయ గానసభలో సామవేదం షణ్ముఖశర్మగారితో పాటు వేరే వక్తలు కూడా మాట్లాడారు. అక్కడ నాన్నగారు కూడా అరగంటసేపు మాట్లాడి ఆత్మగురించి చెప్పారు. నాకు సబ్జక్ట్ చాలా కొత్తగా, ఆశక్తిగా ఉంది అనిపించింది. అదే ట్రిప్ లో 1993 జనవరి 1న రేణుకగారి ( Biological ) ఇంట్లో భోజనాల ఏర్పాట్లు, మధ్యాహ్నం నాన్నగారి ఉపన్యాసం చాలా వైభవంగా జరిగాయి.

సంక్రాంతికి మా అత్తగారి ఊరు కోడవల్లి వెళ్ళాము. అక్కడినుండి జిన్నూరు మొదటిసారి వెళ్ళటం జరిగింది. నాన్నగారు అరుగుమీద కూర్చుని ఉన్నారు. ఆయన నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఏం పుస్తకాలు చదువుతావు? అని అడిగారు. నాన్నగారూ మీ దగ్గరకు వచ్చింది తక్కువే కాని మీ కేసెట్స్ బాగా విన్నాను అని చెప్పాను. నీ డైలీ లైఫ్ కి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? అని అడిగారు. నేను ఇంతవరకూ జపం చేసుకోవాలి, పుణ్యం చేసుకోవాలి అనుకున్నాను. మీరు చెప్పిన Aim high & Aim at the highest అని చెప్పింది చాలా నచ్చింది. God realisation ultimate destination అని తెలిసింది అన్నాను. మా అత్తగారితో, పార్వతమ్మగారూ మీ కోడలు చాలా త్వరగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి నాన్నగారు నన్ను బ్లెస్ చేసారు.

1993 వ సం ॥ రం డిసెంబరు ఆఖరి వారంలో మొదటిసారిగా అరుణాచలం వెళ్ళాము. అప్పుడు నాన్నగారు మోరీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మాకు అక్కడ పక్కనే ఒకరూమ్ ఇచ్చారు. నాకు అరికాళ్ళలో Corns ఉండటం వల్ల చెప్పులు లేకుండా ఇంట్లోకూడా నాలుగు అడుగులు వెయ్యలేకపోయేదాన్ని. ఆ కారణంగా గిరిప్రదక్షిణ చెప్పులు లేకుండా చెయ్యటం అసాధ్యం అనిపించి చెప్పులతో ప్రదక్షిణకి బయలుదేరాను. నాన్నగారు మమ్మల్ని కుబేరలింగం దగ్గర ఉండమని, ఆయన అక్కడకు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. తరువాత మేము గిరి ప్రదక్షిణ పూర్తిచేసి తిరిగి వచ్చాము. ఆ సాయంత్రం నాన్నగారు నాతో నువ్వు ఈ రోజు భోజనం చేయవద్దు, రామారావుగారు పండ్లు తెచ్చి ఇస్తారు అవే తీసుకో అన్నారు. చెప్పులతో గిరి ప్రదక్షిణకు వెళ్ళినందుకే నాన్నగారు భోజనం మానేసి పండ్లు తినమన్నారేమో అనిపించింది. అందువల్ల మరుసటిరోజు ఉదయం చెప్పులు లేకుండానే గిరిప్రదక్షిణ చేసాను. నాన్నగారు అలా అని ఉండకపోతే నేను చేయలేకపోదును. ఆ తరువాత నాన్నగారు నువ్వు ఇంక ఒకసారి కూడా తిరగవద్దు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే కారులో వెళ్ళి, ఎక్కడయినా కూర్చోవాలనిపిస్తే కాసేపు కూర్చుని వచ్చేయి అన్నారు. నాన్నగారు ఏదైనా ఒకసారి వద్దు అంటే దానిమీదకు నా మనసు పోయేది కాదు.

నాన్నగారు పరిచయమైన కొత్తలో నేను నాన్నగారితో, అందరూ భగవాన్, భగవాన్ అంటున్నారు. వర్కు అంతా చేసేది మీరయినా, మీరు కూడా అంతా భగవాన్ చేసారంటున్నారు. మీకు భగవాన్ గురువు అవ్వచ్చు కానీ మాకు భగవాన్ గురువు ఎలా అవుతారు? మాకు అన్నీ తెలియజేసి బోధించేది మీరే కదా! మాకు మీరే గురువు అన్నాను. అప్పుడు నాన్నగారు నవ్వుతూ, నీలాంటివాడే పండరీపురంలో ఒకడు ఉన్నాడు. ఇద్దరు గురుశిష్యులు ఉండేవారు. గురువుగారు అరుగుమీద కూర్చున్న సమయంలో పాండురంగడి ఊరేగింపు వచ్చింది. అప్పుడు గురువుగారు శిష్యుడితో, పెరుమాళ్ వెళ్ళిపోతున్నాడు తొందరగా వచ్చి చూడమని పిలిచారు. అప్పుడు ఆ శిష్యుడు మీ పెరుమాళ్ వెళ్ళిపోతే మీరు చూసుకోండి, నేను నా పెరుమాళ్ కి పాలు కాచుకుంటున్నాను, నేను రాను అన్నాడు. అంటే ఆ శిష్యుడికి గురువుగారే పెరుమాళ్ అన్నమాట!

ఒకసారి మా నాన్నగారితో కలిసి రవీంద్రభారతిలో అనూప్ జలోటా బజన్స్ ఉంటే వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అర్థరాత్రి అయిపోవడం వల్ల అమ్మగారింట్లో ఉండిపోయాను. మర్నాడు ఉదయం మా హౌస్ ఓనర్ సిద్ధయ్యగారు ఫోన్ చేసి మా ఇంట్లో దొంగలు పడ్దారని చెప్పారు. వెళ్ళి చూస్తే కొంత డబ్బు, బంగారం పోయాయి. మా ఎదురింటి సాయిగారి భార్య నాగేశ్వరి, సిద్ధయ్యగారు, సంధ్య, ఇంటి ప్రక్కవారు అందరూ వచ్చారు. నేను బీరువాలో చూసి మా గురువుగారి కేసెట్స్ సేఫ్ గా ఉన్నాయి అని ఆనందపడ్డాను. వారు డబ్బు, బంగారం పోయాయని బాధ పడకుండా కేసెట్స్ చూసి ఆనంద పడుతున్నారు, ఆ కేసెట్స్ లో ఏముంది? అని అడిగారు. మా గురువుగారి ప్రవచనాలు ఉన్నాయని చెప్పాను. మా ఇంట్లో అన్ని గదుల్లో నాన్నగారి ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోలో ఉన్నది ఎవరని అడిగారు. మా గురువుగారు, నాన్నగారు అంటారు అని చెప్పాను. ఆ తరువాత నాన్నగారు వచ్చినప్పుడు వారందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. నాన్నగారి అంగీకారంతో అశోక్ నగర్ లో మా ఇంట్లో సత్సంగం పెట్టుకున్నాము.

అశోక్ నగర్ లో త్యాగరాయ గానసభ మా ఇంటికి దగ్గరగా ఉండేది. సిద్ధయ్యగారు నాన్నగారి ఉపన్యాసం త్యాగరాయ గానసభలో పెట్టుకోవచ్చుకదా అని సలహా ఇచ్చారు. నేను నాన్నగారిని త్యాగరాయ గానసభలో ఉపన్యాసం పెట్టుకుందామని అడిగాను. నాన్నగారు అంగీకరించారు. "శ్రీ నాన్నగారి ఆధ్యాత్మిక ప్రవచనం" అని చిన్న పేపర్ ప్రకటన ఇచ్చాను. ఆ హాలు మొత్తం జనంతో నిండిపోయింది. కార్యక్రమం చాలా బాగా జరిగింది. మేము అశోక్ నగర్ లో ఉన్న రోజుల్లో, నాన్నగారి ఉపన్యాసం త్యాగరాయ గానసభలో పెట్టుకుందామని అడిగేదాన్ని. నాన్నగారు అందుకు అంగీకరించేవారు. నాన్నగారు వస్తే పెద్ద పండుగలా ఉండేది. నాన్నగారు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ మేము ఆయన దగ్గరకు వెళ్ళేవాళ్ళము. అప్పుడు నాన్నగారు మదురానగర్ లక్ష్మిగారి ఇంటిలో ఉండేవారు. నల్లకుంట సావిత్రి మామ్మగారి ఇంటికి కూడా వచ్చేవారు. ప్రవచనం చేసేటప్పుడు ఏదైనా పుస్తకం చదువుతూ చెప్పేవారు. ఆ పుస్తకం నా చేతికి ఇచ్చి చదవమనేవారు. రెండు లైన్లు చదివాక దానిమీద వివరణ ఇచ్చేవారు. నేను ఎప్పుడైనా వెనక కూర్చున్నా ముందుకు రమ్మని పుస్తకం ఇచ్చేవారు. అలా చాలాకాలం నాకు ముందు కూర్చునే అవకాశం లభించింది. ముందురోజు చెప్పిన ఉపన్యాసంలో ప్రశ్నలు అడిగేవారు. ఒకసారి సనత్ కుమారుడు గురించి చెబుతూ సనత్ కుమారుడే భగవాన్ గా జన్మించాడని చెప్పారు. మర్నాడు భగవాన్ సనత్ కుమారుడిగా ఉండగా ఏమి చెప్పాడమ్మా అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. మన నిజ స్వరూపం బ్రహ్మం, మన స్వరూపం ఆత్మ. కానీ మనలో ఉన్న బ్రహ్మం మనకి అందాలంటే అది ఎలా అందాలో సనత్ కుమారుడు చెప్పాడు. ఏమి చెప్పాడంటే ఎవరూమాట్లాడటం లేదేమిటి? అన్నారు. అప్పుడు ఆహార శుద్ధి వలన ఇంద్రియ శుద్ధి అన్నాను. నాన్నగారు అవును అని నావైపు తిరిగారు.
ఆహారశుద్ధి వల్ల - ఇంద్రియశుద్ది
ఇంద్రియశుద్ధి వల్ల - మనశ్శుద్ధి
మనసుశ్శుద్ధి వల్ల - అంతఃకరణశుద్ధి
అంతకరణశుద్ధి వల్ల - ఆత్మానందం అందుతుంది అని సనత్ కుమారుడు చెప్పాడు, నాన్నగారూ అన్నాను. అప్పుడు నాన్నగారు నవ్వుతూ Very Good. You are born teacher, you are not made teacher అన్నారు. ఒకసారి ఈశ్వరునికి మరోపేరేమిటి? అని అడిగారు.
"కర్మఫలదాత" అని చెప్పాను.

ఒక సందర్భంలో నాన్నగారు మనం పూర్వజన్మలో ఈ దేహం నిజం, ఈ సంఘటనలు నిజం, ఈ కుటుంభసభ్యులు నిజం అనుకున్నాము. ఈ జన్మలో కూడా ఈ దేహం నిజం, ఈ సంఘటనలు నిజం. ఈ కుటుంబ సభ్యులు నిజం ... ఇలాగే అనుకుంటున్నాము. వచ్చే జన్మలో కూడా అలాగే అనుకుంటాము అని చెప్పి ఈ సంసారం గురించి భగవాన్ ఎమన్నారో చెప్పారు. తరువాత దాని గురించి అడుగుతూ భగవాన్ ఈ సంసారాన్ని ఏమన్నారు? అని అడిగారు. భగవాన్ ఈ సంసారాన్ని Ever unreal ( ఎప్పుడూ అసత్యమే ) అన్నారు అని చెప్పాను. నీ సబ్జక్ట్ grasping బాగుంది. గడియారం ముల్లు ఎంత accurate గా తిరుగుతుందో అలా ఉంది. అంత accurate గా ఉంది నీ సబ్జక్ట్ అన్నారు. అక్కడ నేను చేసిందేమీ లేదు. నాన్నగారు చెప్పిన మాటలే తిరిగి చెప్పేదాన్ని. అయినా నాన్నగారు నన్ను మెచ్చుకుంటూ టీచింగ్ కి బాగా ప్రోత్సహించేవారు.

ఒకసారి నాన్నగారిని భక్తియోగం ఒకటి సరిపోతుంది కదా నాన్నగారూ అని అడిగాను. "భక్తియోగం అంతా అక్కరలేదు. "సర్వభూతహితేరతాహః" ఈ ఒక్క వాక్యం చాలమ్మా! భాగవతంలో రంతిదేవుడు అనే భక్తుడు ఉన్నాడు. రంతి దేవుడు భోజనం చేసేటప్పుడు తనకి ఆకలిగా ఉన్నా ఎవరైనా అడిగితే వారికి బిక్ష కాదనకుండా ఇచ్చేవాడు. మంచినీళ్ళు తాగేటప్పుడు అడిగితే ఆ నీరు కూడా ఇచ్చేసేవాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఏమైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ భక్తుడు నేను అందరి హృదయాలలో ఉండాలి. అలా ఉండి ఏ జీవికైనా దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని వారు అనుభవించకుండా నేనే అనుభవించేస్తాను. అప్పుడు జీవకోటి దుఃఖం లేకుండా సుఖంగా ఉంటారు. అలాంటి వరం ఇమ్మని అడిగాడు. అలా అన్ని భూతాల క్షేమం కోరేవారికి మోక్షం ఇవ్వకుండా ఎవరూ ఆపలేరు అన్నారు.

నాన్నగారి మనవడు వర్మగారు srinannagaru.com పేరుతో Website start చేసి wonderful work చేస్తున్నారు. దేశ, విదేశాలలో ఉండే భక్తులు అందరూ నాన్నగారి పుట్టినరోజుకి, గురుపూర్ణిమకి వెళ్ళలేకపోయాము అనే బాధ లేకుండా audio, video లద్వారా అన్ని ఉపన్యాసాలు వినగలిగేలా, చూడగలిగేలా అవకాశాన్ని కల్పిస్తూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒకసారి నాన్నగారితో నేను వర్మకి వ్యక్తి భావన లేదు కదా నాన్నగారూ! అని అడిగాను. అవునమ్మా కరెక్టుగా చెప్పావు. వర్కు చేస్తాడు కానీ వ్యక్తి కనపడడు అని నాన్నగారు వర్మని మెచ్చుకున్నారు.

కనస్ట్రక్షన్ వర్క్ రీత్యా మా కుటుంబం హైదరాబాదునుండి చెన్నైకి మారవలసి వచ్చింది. అప్పుడు నాన్నగారు పద్మ మద్రాసు వెళ్ళడంవల్ల హైదరాబాదుకి నష్టం, మద్రాసుకి లాభం అన్నారు. నాన్నగారు హైదరాబాదులో లక్ష్మి ఇంటికి వచ్చేవారు. లక్ష్మి నాన్నగారికి బాగా సేవ చేసేవారు. భక్తులను కూడా చాలా ప్రేమగా ఆదరించేవారు. సహనంతో, నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండేవారు. ఆమెని చూసినప్పుడు గురువు సేవచేసుకోవడం ఎంత అదృష్టం? అనిపించేది. నాన్నగారు నాకు ఆ కోరిక మద్రాసులో తీర్చేసారు. 2000 సం॥ రం నుండి 2003 వరకు మూడు సం॥ రాలు నాన్నగారు అరుణాచలం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చి ఉండేవారు. నాన్నగారితో నాకు కారులో అరుణాచలం వెళ్ళే అవకాశం వచ్చేది. కారులో కూడా సబ్జక్ట్ చెబుతూనే ఉండేవారు. ఖన్నా, శాంతి, వడివేలు, సంగీత విద్వాంసులు మణిగారు, వారి భార్య .... చెన్నై భక్తులంతా వచ్చేవారు. కొంతమంది మన భక్తులు కూడా వచ్చేవారు. అలా మా హాలు మొత్తం నిండిపోయేది. మద్రాసులో నాన్నగారితో నేను గడిపిన రోజులు నాకు Golden days.

నాన్నగారు కోయంబత్తూరు, కొత్తగూడెం వెళ్ళినప్పుడు నాన్నగారికి ఫోన్ చేసి నేను రావచ్చా అని అడిగితే రామ్మా పద్మా అనేవారు. కొత్తగూడెం వెళ్ళినప్పుడు అక్కడ సౌకర్యంగా ఉంటుందని రమ్మనేవారు. అక్కడ అంతా ఆచార్యులవారి సబ్జక్ట్ చెప్పేవారు. ఎంత అందంగా చెప్పేవారు అంటే, సముద్రపు కెరటంలో ఒక బుడగ పగిలిపోతే ఆ బుడగ నీరుగా మారుతుంది. బుడగగా అసత్యం కానీ నీరుగా సత్యం. బంగారపు వడ్డాణం కరిగిస్తే వడ్డాణం కరిగిపోతుంది కానీ బంగారంగా మిగులుతుంది. మట్టి కుండను పగలగొడితే కుండ రూపాన్ని కోల్పోతుంది కానీ మట్టిగా మిగిలి ఉంటుంది.
బుడగ అసత్యం - నీరుగా సత్యం.
వడ్డాణంగా అసత్యం - బంగారంగా సత్యం.
కుండగా అసత్యం - మట్టిగా సత్యం.
దేహబుద్ధి, జీవబుద్ధి నశిస్తే బ్రహ్మాకారం చెందుతాం. జీవబుద్ధి అసత్యం, బ్రహ్మపదార్థం సత్యం. అప్పుడు limitations దాటి Every thing అయిపోతాం అని చెప్పేవారు.

"మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయః! అంటే అసలు మనిషి జన్మదొరకటం, జ్ఞానం పొందాలనే కాంక్ష కలగడం, కలిగినా దానిని నెరవేర్చే గురువు అనుగ్రహం దొరకడం ఇవి మూడూ దైవానుగ్రహం అన్నారు శంకరాచార్యుల వారు. అంటే అనేక వేల జన్మల పుణ్యఫలం ఉంటేనే గానీ అవి దొరకవు. అందులోనూ ఒక మహాగురువు ఆశ్రయం దొరకితే ఇక నీకు దశ తిరిగిందిలే అనేవారట ఆచార్యులవారు.

నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా గురువుగారు దేహంతో ఉన్నంతకాలం ఆయనతో గడిపినందుకు చాలా సంతృప్తిగా ఉంది. దేహం వచ్చినందుకు ప్రారబ్ధం ఎలా ఉన్నా, ఒక మహాత్ముని చుట్టూ 25 సం ॥ లు సన్నిహితంగా తిరిగే అవకాశం లభించింది. ఎప్పుడూ నాన్నగారి ధ్యాసతోనే గడిపేవాళ్ళము. ఆ ధ్యాసలో పిల్లలు పెరగటం, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో అవేమీ గుర్తులేవు. నిరంతరం నాన్నగారి సబ్జక్ట్, సత్సంగం అంతే! కొన్నిసార్లు సత్సంగానికి వినటానికి వెళ్ళేవాళ్ళము. కొన్నిసార్లు చెప్పటానికి వెళ్ళేవాళ్ళం. ఎలా అయినా మొత్తంగా సత్సంగాలచుట్టూ, నాన్నగారిచుట్టూ తిరిగేవాళ్ళం. అలా మన దృష్టి ఎటూ మళ్ళకుండా సబ్జక్ట్ చుట్టూ ఉండేలా ఆయన చేసారు.

కష్ణుడు అంటే ఇష్టం ఉండటం వేరు. కృష్ణుడు చెప్పిన భగవద్గీత యొక్క వైభవాన్ని అర్థం చేసుకుని కృష్ణుని ఇష్టపడటం వేరు అని చెప్పారు నాన్నగారు. అలా నాకు నాన్నగారి సబ్జక్ట్ వినేకొలది లోపల నాన్నగారంటే ఇష్టం, గౌరవం పెరుగుతూ వచ్చాయి. అది జ్ఞాని వైభవం. నాన్నగారి సబ్జక్ట్ ఒక మహా సముద్రం. మనం అందులో ఒక నీటి బిందువు లాంటివాళ్ళం. నాన్నగారి గురించి నేను తెలుసుకున్నది కూడా ఆ నీటి బిందువు అంత మాత్రమే అనిపిస్తుంది.

నాన్నగారు ఒకసారి ప్రవచనంలో ఏమి చెప్పారంటే, Theory మొత్తం అంతా వింటాము కానీ, ఆ సబ్జక్ట్ లోతుల్లోకి మాత్రము దిగము. అంటే చెరువులోకి దిగకుండా అలా చెరువుగట్టు మీద కూర్చునే ఉంటాము. అది చూసి, చూసి గురువు ఒక్క తోపు తోస్తాడు. అప్పుడు నీటిలో పడిపోతాము. మనం చేయాలని స్నానం చేయకపోయినా, అందులో పడిపోయాము కాబట్టి స్నానం అయిపోతుంది. అలా గురువుకి "One kick is enough" అని చెప్పారు. మనం నీటిలో పడకుండా అలా కాలక్షేపం చేస్తూ ఉంటే గురువు ఎప్పుడో ఒక తన్ను తన్నితే లోపలికి వెళ్ళిపోతాము.

నాకు 24 సం ॥ ల వయసులో Auto - Immune disorder ( One type of arthritis ) వచ్చింది. డాక్టర్స్ పెద్దగా hope ఇవ్వలేదు. ఒకసారి కారులో నాన్నగారితో అరుణాచలం వెళ్తూ ఉంటే నాన్నగారు "అమ్మా పద్మా 1984 వ సం ॥ లో నాకు అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్స్ నేను చనిపోతాను అని చెప్పారమ్మా! డాక్టర్స్ అందరూ నాకు కేన్సర్ అనుకున్నారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ దేహంలో ఉండగా ఇంక మరలా అరుణాచలం చూడలేనేమో అని తలంపువచ్చింది" అని చెప్పారు. అప్పుడు నేను నాన్నగారితో, నా అనారోగ్యం గురించి డాక్టర్స్ చెప్పినప్పుడు నాకు వచ్చిన తలంపు ఏమిటంటే, నాన్నగారి సమక్షాన్ని కోల్పోతాను అనిపించింది అన్నాను. దానికి నాన్నగారు జ్ఞానం పొందే అవకాశం మిస్ అయిపోతాను అనిపించిందా? అని అడిగి మౌనం వహించారు. కానీ ఆ తరువాత నాకు 25 సం ॥ రాలు ఆయన సమక్షంలో ఆనందంగా గడిపే అవకాశాన్ని కలుగజేసారు. ఇది ఆయన నాకు ప్రసాదించిన వరం.

నాకు కాశీ వెళ్ళాలని ఉండేది. కాకపోతే ట్రైన్ లో వెళ్ళాలంటే సమయం ఎక్కువ పడుతుంది, నాకు ప్రయాణం చేయటం కష్టమవుతుంది అనుకున్నాను. నాన్నగారు ఆ కోరిక కూడా తీర్చేసారు. అప్పటికే నాన్నగారు రెండుసార్లు కాశీ వెళ్ళారు. మళ్ళీ కాశీ వెళుతున్నారని తెలిసింది. నాన్నగారూ ఈ సారి మీరు హైదరాబాదు వచ్చేయండి. ఇక్కడనుండి అందరం ఫ్లైట్ లో వెళదాము అని అడిగాను. సరేనమ్మా అయితే అన్నారు. అలా నాన్నగారు హైదరాబాద్ వస్తే ఫ్లైట్లో వెళ్ళాము. తొమ్మిది రోజులు నాన్నగారితో కాశీలో గడిపాను. కాశీలో 20 మందికంటే ఎక్కువ పట్టని బోటులో నాన్నగారు భక్తులతో కలిసి బయలుదేరారు. ఒడ్డున ఉన్న రాయిమీదనుండి బోటులోకి దూకాలి. కొంతమంది ఎక్కగలిగిన వాళ్ళు దూకేసారు. నాకు దూకే పరిస్థితిలేదు కనుక ఆగిపోయాను. బోటు బయలుదేరి వెళ్ళిపోతుంటే నాన్నగారు పద్మ ఏది? అని అడిగారట. అదేంటి పద్మని ఎక్కించుకోవద్దా అని ఉషని అడిగి మళ్ళీ వెనక్కి వెళ్దాం పదండి అన్నారట. అప్పుడు బోటు మాకోసం తిరిగిరాగానే, రాయిమీద నుండి బోటులోకి ఎక్కలేను అనుకున్నదానిని నాకు తెలియకుండానే ఎక్కేసాను. నాతోపాటు మరో ఇద్దరు భక్తులు విజయ్ కుమార్ గారు, ఆయన భార్య ఇందిర గారు కూడా ఎక్కారు. ఆరోజు నాన్నగారు నదిలోనుండి నీరుతీసి బోటులో ఉన్న భక్తులందరిమీదా చల్లుతూ చాలా ఆనందంగా గడిపారు. పక్కనే వేరే బోట్ లో ఉన్న భక్తులు కూడా నాన్నగారూ మామీద కూడా చల్లండి అంటే వారిమీద కూడా నీళ్ళు చల్లారు. నాన్నగారు భద్రాచలం వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు. కానీ వెళ్తే బావుండును అనుకున్నాను. తరువాత నాన్నగారితో మూడుసార్లు భద్రాచలం వెళ్ళే అవకాశం కలిగింది! రెండుసార్లు శ్రీశైలం కూడా వెళ్ళాను.

కాలడి వెళ్ళినప్పుడు పూర్ణానదిలో స్నానంచేసి, అక్కడ చిన్ని కృష్ణుడి గుడి ఉంటే నాన్నగారితోపాటు దర్శనానికి వెళ్ళాము. బయటికి వచ్చిన తరువాత అమ్మా పద్మా కృష్ణుడిని చూసావా? కృష్ణుడి దర్శనం అయ్యిందా? అని చాలా ఆనందంగా అడిగారు. నేను మామూలు విగ్రహాన్ని చూసానంతే! నాన్నగారు నిజంగా కృష్ణుడి దర్శనం అయినట్టు ఇంత ఆనందంగా అడుగుతున్నారు ఏమిటి అనుకున్నాను.

నాన్నగారితో కోయంబత్తూరు వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు వెళ్ళిపోయినా నేను చివరి వరకూ ఉండిపోయాను. అప్పుడు రంగరాజుగారు నాన్నగారితో, ఈసారి వేరే ప్రదేశాలు చూద్దాము అన్నారు. నాన్నగారు, నేను, రామచంద్రరాజు గారు, రంగరాజుగారు, ఆయన భార్య అందరం కారులో బయలుదేరాము. మధురై, భగవాన్ జన్మస్థలమైన తిరుచ్చుళి, కుమారస్వామి క్షేత్రమైన తిరుప్పరకుండ్రం వెళ్ళాము. ప్రతి గుడిలోకి వెళ్ళి వచ్చిన తరువాత ఇది పద్మ డెస్టినీలో ఉంది అనేవారు. భగవాన్ ఆత్మానుభవం పొందిన స్థలానికి తీసుకువెళ్ళి ఇక్కడే భగవాన్ ఆత్మానుభవం పొందారు. నువ్వు ఇక్కడ కాసేపు కూర్చో పద్మా అన్నారు. తిరుప్పరకుండ్రం గుడికి వెళ్ళినప్పుడు, మధురై ఈశ్వరుని గుడికి వెళ్ళినప్పుడు, అక్కడి పూజారులు నాన్నగారు ఎవరో తెలియక పోయినా, దేవుడికి అలంకరించిన పూలమాల తీసి నాన్నగారి మెడలో వేసారు. ఏమీ తెలియనివారిని కూడా ఆకర్షించే వైభవం "జ్ఞాని వైభవం."

ఒకసారి నాన్నగారితో అరుణాచలం నుంచి కారులో పాండిచ్ఛేరి వెళ్ళాము. అక్కడ అరబిందో ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. సమాధితో పాటు అక్కడన్నీ చూపించారు. అరబిందో 40 సంవత్సరాలు బయటికి రాకుండా ఒకే గదిలో ఉండిపోయారు. వాకింగ్ కూడా ఆ గదిలోనే చేసేవారు. సావిత్రి లాంటి పుస్తకాలు రచించారు. మనకి రెండురోజులు మనుషులు కనపడకపోతే ఉండలేము. భగవాన్ ని ఎక్కడికయినా వెళదామని భక్తులు అడిగితే, ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలే! గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఇంక ఆరోభూతం ఏమీ లేదని చెప్పేవారు అన్నారు. నాన్నగారు చెప్పిన ఈ రెండు మాటలూ నాకు బాగా స్ఫూర్తినిచ్చాయి. కోయంబత్తూరులో రోజూ ప్రారబ్ధాన్ని, ఏకాంతవాసాన్ని ఎంజాయ్ చెయ్యాలని, కష్టసుఖాలను ప్రసాద బుద్ధితో స్వీకరించాలని చెప్పారు. జ్ఞాని ప్రారబ్ధాన్ని మామిడి రసం తాగినట్టు, చెరుకురసం త్రాగినట్టు అనుభవిస్తారని చెప్పారు. రెండు సం ॥ ల నుండి నేను ఎక్కడికీ వెళ్ళలేకపోయినా నాకు ఏమీ అనిపించలేదు. నాన్నగారి అనుగ్రహంలో అదంతా సహజంగా జరిగిపోతూ వచ్చింది.

అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్ ॥
"నేను అందరి హృదయాలలో ఉన్నాను. జఠరాగ్ని రూపంలో కూడా ఉన్నాను. జఠరాగ్ని రూపంలో ఉండి తినే ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే" అన్నాడు కృష్ణుడు.

మీరు సుబ్బారావు అనే వ్యక్తికి భోజనం పెట్టారనుకోండి! నేను సుబ్బారావుకి భోజనం పెట్టాను, సుబ్బారావుకి భోజనం పెట్టాను అనుకోకండి. ఆయనకి ఆకలిగా లేకపోతే మనం పెట్టినా తినలేడు. ఎవరికైనా భోజనం పెట్టినా ఈశ్వరుడికి పెట్టాను, ఈశ్వరుడే తిన్నాడనుకోండి. సుబ్బారావులో జఠరాగ్నిరూపంలో ఉండి జీర్ణమయ్యేలా చేసేది ఈశ్వరుడే! తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేసేది నేనే అన్నాడు కదా! భగవంతుడు మన హృదయానికి అంత దగ్గరగా ఉండటం వలన, మనం పాపకర్మలు చేయకుండా పవిత్రంగా ఉండాలి అన్నారు.

ఆహారం విషయంలో పాటించవలసిన నియమాలు :
1. మనం కష్టపడి, న్యాయంగా సంపాదించిన సొమ్ముతో కూడినదై ఉండాలి.
2. సాత్వికమైన శాఖాహారం తీసుకోవాలి.
3. భగవంతుని ప్రార్థన చేసిన తరువాత ఆహారం తీసుకోవాలి.
4. ఆహారమును ఎక్కువ, తక్కువ కాకుండా యుక్తముగా తీసుకోవాలి.

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ర్బహ్మాగ్నౌ
బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా॥

ఇచ్చేవాడు బ్రహ్మము, పుచ్చుకునే వాడు బ్రహ్మము. ఇవ్వబడుతున్న క్రియ బ్రహ్మము. ఇచ్చే వస్తువు బ్రహ్మము. మనం ఎవరికైనా మామిడి పండు ఇస్తే - మామిడి పండు ఇచ్చేవాడు బ్రహ్మము. మామిడి పండు పుచ్చుకునేవాడు బ్రహ్మము. మామిడి పండు బ్రహ్మము. అలా బ్రహ్మ భావనతో అన్నీ చేసేవాడు చివరికి బ్రహ్మమునే పొందతాడు అని నాన్నగారు చాలా అద్భుతంగా చెప్పారు.

వైజాగ్ లో మా వదిన ( వైజాగ్ పద్మ ) గారి ఇంటికి నాన్నగారు వచ్చినప్పుడల్లా వదిన నన్ను రమ్మనేవారు. అక్కడ నాన్నగారితో సన్నిహితంగా గడపడానికి మంచి అవకాశం లభించేది. నాన్నగారు వైజాగ్ శ్యామల గారి ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఏసుక్రీస్తు గురించి చెప్పారు. ఏసుక్రీస్తు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి నీవు ప్రభువువి, దేవుడివి అంటూ ఉంటే ఏసుక్రీస్తు - నువ్వు మూడు రోజుల్లో నన్ను 30 నాణాలకు పట్టిస్తావు అన్నారంట. అప్పుడు ఆ శిష్యుడు అదేమిటి ప్రభూ? అలా అంటారు అన్నాడట. అవును అది అంతే అన్నారట. అప్పుడు నేను ముందే క్రీస్తు చెప్పినందుకైనా ఆ శిష్యుడు అలా చేయకుండా ఉండవలసింది నాన్నగారూ అన్నాను. అదేంటమ్మా పద్మా? విధి బలీయమైనది! వాసన బలీయమైనది! ఆ శిష్యుడికి ధన వాసన ఉంది. ధనం అనగానే దానికి లొంగిపోయాడు. తరువాత జీసస్ కి శిలువ వేయడం చూసి, నా వల్లే ఇదంతా జరిగింది అని ఆ నాణాలు అక్కడే పడేసి ఉరివేసుకుని చనిపోయాడు. కానీ ఆ సమయానికి వాసన వలన లొంగిపోయాడు అని చెప్పారు. ఆ నాలుగు రోజులూ సత్సంగంలో విధి బలీ .... యము! వాసన బలీ .... యము! అంటూ చాలా ఉదాహరణలు చెప్పారు.

రావణాసురుడు సీతని తీసుకొచ్చినప్పుడు, మండోదరి రావణాసురుడితో ముందే చెప్పింది. నువ్వు తీసుకొచ్చింది సీతను కాదు నీ మృత్యువుని! సీతను తిరిగి రాముడికి అప్పజెప్పు. రాముడుకి శరణాగతి చెందు అని చెప్పినా రావణాసురుడు వినలేదు. అలాగే వాలితో తార చెబుతుంది. నీ చేతిలో చావు దెబ్బలు తిని వెళ్ళిన సుగ్రీవుడు, మళ్ళీ ఇంత త్వరగా యుద్ధానికి వస్తున్నాడంటే, వెనక ఏదో బలగంతో ( శక్తితో ) వస్తున్నాడు వెళ్ళొద్దని చెబుతుంది. కానీ విన్నాడేంటి? విధి బలీ...యము! అన్నారు.

వాలి భార్య తార వాలి చనిపోయిన తరువాత రాముడితో, భార్యా వియోగం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా! నువ్వు బాధ పడుతున్నావు. మరి భర్త వియోగం నాకు ఎందుకు కలుగజేసావు? అని అడిగింది. అప్పుడు రాముడు తారకి ఒక రహస్యం చెప్పాడు అన్నారు నాన్నగారు. సృష్టి మొదలైన దగ్గర్నుండి ఈనాటి వరకూ ఈశ్వరుడి సంకల్పానికి వ్యతిరేకంగా ఏ సంఘటనా జరగలేదు. ఈశ్వరుడి సంకల్పం ఒకలా ఉంటే, ఇంకొకరకంగా చేయడానికి అసలు అవకాశమే లేదు. ప్రారబ్ధమనే ఇరుసులో నువ్వూ, నేనూ, అందరం బంధీలం అమ్మా తారా! ఇక్కడ ఎవరూ స్వతంత్రంగా వ్యవహరించలేరు. వాలి చనిపోవడం కూడా ప్రారబ్ధంలో భాగమే!

ఈశ్వరః సర్వభూతానాం
హృద్దేశేర్జున తిష్ఠతి |
భ్రామయన్ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా ||

భగవద్గీతలోని ఈ శ్లోకం అంటే నాన్నగారికి చాలా ఇష్టం. "ఈశ్వరుడు అందరి హృదయాలలోనూ తిష్టవేసుకుని కూర్చున్నాడు. మామూలుగా కూర్చోలేదు, తిష్టవేసుకుని కూర్చున్నాడు. యంత్రాన్ని తిప్పేవాడు యంత్రాన్ని తిప్పినట్టు బొమ్మలన్నింటినీ తిప్పుతున్నాడు. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఎటు విసురుతాడో తెలీదు. అలా పిచ్చివాడిలా తిప్పట్లేదమ్మా! వారి వారి ప్రారబ్ధానుసారం తిప్పుతున్నాడు." అన్నారు.

ఇందిరాగాంధీ దగ్గర ఉండే సెక్యూరిటీలో సిక్కులు ఉంటే ప్రమాదం తీసేద్దామన్నారట! నాకు అందరూ సమానమే అందట. ఆ సిక్కుల చేతిలోనే ఆమె చనిపోయింది. అలా ఎవరయినా చెప్పినా బుద్ధి ( మాయ ) విననివ్వదు. అలాగే రాజీవ్ గాంధీ విషయంలో ఒక అమ్మాయి హ్యూమన్ బాంబ్ పెట్టుకుని పూలమాలతో వస్తే ఎస్. ఐ ఆపేసాడు. రాజీవ్ గాంధీ అదిచూసి పంపించమన్నాడు. ఆ అమ్మాయి వచ్చి దండేసి బాంబ్ పేల్చేసింది. అంటే డెత్ ని ఆహ్వానించటమే! ఎస్. ఐ ఆపినప్పుడు ఆగాలి కదా! వచ్చేయమన్నాడు. మాయ విననివ్వదమ్మా! అని చెప్పి ఇంకో అద్భుతమైన మాట చెప్పారు. "మాయ విననివ్వకపోవడం కాదు, అసలు ఈశ్వరుడే విననివ్వడు." అంటే వాడి ప్రారబ్ధానుసారం ఆడించేయాలి కదా! విధి బలీయము! అన్నారు. అయితే ఈశ్వరుడే మాయలో పెట్టేసి, ఈశ్వరుడే విననివ్వకుండా చేసేస్తే మనం మాయలో పడి కొట్టుకోవడమేనా? ఏంటి పరిస్థితి? అని నాన్నగారే ప్రశ్నించి, ఆయనే సమాదానం చెబుతూ దీనికి పరిష్కారం కూడా కృష్ణుడు చెప్పాడు అన్నారు.

తమేవ శరణం గచ్ఛ
సర్వభావేన భారత !
తత్ప్రసాదాత్ పరాం శాంతిం
స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ !!

అన్ని విధాలా ఆయన్నే శరణు పొందు. ఆయన అనుగ్రహం వల్ల పరమశాంతిని, శాశ్వతమైన స్థానాన్నీ పొందుతావు. అంటే ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించి జీవించాలి. చేపలు పట్టేవాడు వల విసిరినప్పుడు తెలివైన చేపలు, చేపలు పట్టేవాడి పాదాల దగ్గరకు వెళ్ళిపోతాయి. వల విసిరినప్పుడు ఆ చేపలు అతని వలలో పడవు. అలాగే ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు మాయ వలలో పడరు. ఈశ్వరానుగ్రహం కలిగితే ప్రయోజనం ఏమిటి? ఈశ్వరానుగ్రహం కలిగితే మన జేబులో డబ్బులు పెట్టి వస్తువు కొనుక్కోవటం ఎంత సులభమో, మోక్షం అంత సులభంగా వరిస్తుంది. అప్పుడు మనం ఆయన స్వరూపాన్ని పొందుతాము. అది శాశ్వత ఆనందం అన్నారు.

"మనం కలెక్టరు గారి ఇంటికి వెళ్ళామనుకోండి. వాచ్ మెన్ మనల్ని బయటే ఆపేస్తాడు. కలెక్టరుగారు బాల్కనీలోంచి చూసి లోపలికి పంపమన్నారనుకోండి, వాచ్ మెన్ లోపలికి పంపిస్తాడు. అలా పలానవాడికి దారి ఇవ్వు అని ఈశ్వరుడు చెబితే మాయ దారి ఇస్తుంది. అంటే మాయాధిపతి ఎవరు? ఈశ్వరుడే!" అన్నారు.

రాజశేఖర రెడ్డి ఫ్లైట్ ఎక్కేముందు ఫైలెట్ వద్దండి వాతావరణం బాలేదన్నాడు. అప్పుడు రాజశేఖరరెడ్డి నీకు డెత్ అంటే అంత భయమా? పద వెళ్దాం అన్నారట. అంటే విధి బలీ....యము! అన్నారు.

వరలక్ష్మిగారి అమ్మాయి విజయ వాళ్ళింట్లో ( కొంపెల్ల ) I am that
I am గురించి అద్భుతంగా చెప్పారు.
I am అంటే బ్రహ్మము (Truth ). అది అందరి హృదయాలలోనూ ఉంది. అందరం బ్రహ్మ స్వరూపులం అయ్యే ఉన్నాము.
I am అంటే సద్వస్తువు. That I am అంటే "అది నేనయి ఉన్నాను" అనేది ఇక్కడ ముఖ్యం. దానిలోనే మొత్తం అంతా ఉంది! చీమలోనూ, ఏనుగులోనూ... అన్ని జంతువులలోనూ సద్వస్తువు ఉంది. దేవుడు ఉన్నాడని చేప్పేవాడిలోనూ దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని చేప్పేవాడిలోనూ దేవుడు ఉన్నాడు. మనకు తెలిసినా తెలియకపోయినా I am అనేది అందరిలోనూ ఉంది. అసలు ముందు That I am అది నేనయి ఉన్నాను అని గ్రహించాలి. అది అనుభవంలోకి రావాలి. క్రీస్తు చెప్పిన I am That I am అనేది భగవాన్ కి కూడా నచ్చింది. ఈ వాక్యాన్ని ఆయన బాగా ఎంజోయ్ చేసేవారని నాన్నగారు అన్నారు.

రెడ్డిగారు అనే ఆయన ప్రతి ఆదివారం భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయేవారు. అప్పుడు గాంధీగారు అన్నారట. ఇప్పుడు రమణ మహర్షిలో ఎముందో నాలోనూ అదే ఉంది. నీలోనూ అదే ఉంది. Truth అందరిలోనూ సమానంగానే ఉంది. మరి రమణ మహర్షి దగ్గరకు పరిగెడతావెందుకు? అన్నారట. Truth మీలోనూ ఉంది. నాలోనూ ఉంది. కానీ ఆయనలో ఉన్నది ఆయనకు అనుభవంలోకి వచ్చింది. మనలో ఉన్నది మనకు అనుభవంలోకి రాలేదు అన్నారట. ఆ సమాదానానికి గాంధీగారు కూడా సంతోషించారు అన్నారు.

I am that I am అనేది క్రీస్తు రియలైజ్ అయ్యాడు. భగవాన్ కి, ఆచార్యులవారికి, బుద్ధుడికి .... అనుభవంలోకి వచ్చింది. I am that
I am అనగానే వాళ్ళలా మనం రియలైజ్ అవ్వలేము కాబట్టి క్రీస్తు,
సాత్వికులు ధన్యులు - వారు స్వతంత్రించుకుందురు.
సమాదాన పరుచువారు ధన్యులు - వారు దేవుని అనుగ్రహానికి పాత్రులగుదురు.
హృదయశుద్ధి గలవారు ధన్యులు - వారు దేవుని చూచెదరు అని చెప్పాడు.
(సమాదాన పరుచువారు: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో, కొంతమంది పట్టుకుంటామని వచ్చి పడగొట్టేస్తూ ఉంటారు. అదే సమాదాన పరుచువారు అయితే, అక్కడికి వెళ్ళి గొడవ పెరగకుండా అడ్డుకుని సర్ధిచెబుతారు. అటువంటి వారు దేవుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు.) డబ్బులు ఉన్నవారు ధన్యులు, అధికారం ఉన్నవారు ధన్యులు అని క్రీస్తు చెప్పలేదు. ఏయే లక్షణాలు ఉంటే భగవంతుడు అనుభవానికి వస్తాడో అవన్నీ చెప్పాడు. ఆధ్యాత్మికమైన బోధలన్నీ హృదయంలోనికి వెళ్ళటానికే! కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 700 శ్లోకాలు కూడా మనం హృదయంలోకి వెళ్ళటానికే! మనకు అది అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా ఫ్యూరిటీ ఉండాలి అన్నారు నాన్నగారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు.

జిన్నూరులో ఒక అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసారు. ఆయితే కొత్త ఆర్గాన్ ని మన శరీరం రిజెక్ట్ చేస్తుంది. అందుకని స్టెరాయిడ్స్ ఇచ్చేస్తారు. ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తారు రిజెక్ట్ చేయకుండా! అయితే ఆ అబ్బాయి body కిడ్నీని రిజెక్ట్ చేసేసింది. అతను చనిపోయాడు. మనలో 99 % purity ఉండి 1 % impurity ఉంటే, మనం బ్రహ్మంలో ఐక్యం అయిపోదామని అనుకున్నా బ్రహ్మం మనల్ని రిజెక్ట్ చేస్తుంది. ఆ అబ్బాయి body కిడ్నీని ఎలా రిజెక్ట్ చేసిందో, అలా బ్రహ్మం మనలో 1 % impurity ఉన్నా కూడా తనలో ఐక్యం చేసుకోకుండా రిజెక్ట్ చేస్తుంది. మనం 100 % Purity ని పొందినప్పుడు బ్రహ్మం తనలో ఐక్యం చేసుకుంటుంది. అందుకే క్రీస్తు ప్యూరిటీ పొందమని ఇవన్నీ చెప్పుకొచ్చాడు అన్నారు.

నను బోలు దీనుల నింపొందకాచుచు
చిరంజీవివై బ్రోవు మరుణాచలా!

అంటే నా లాంటి రమణులు వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రమణుని అనుగ్రహిస్తేనే సరిపోదు. నిన్ను ఆశ్రయించిన జీవకోటి అంతటినీ మోక్షం వచ్చేవరకూ అనుగ్రహిస్తూ చిరంజీవివై ఉండి బ్రోవుము అరుణాచలా! అన్నారు భగవాన్. అని నాన్నగారు చెపుతూ, మనమేంటమ్మా! మన పిల్లాడికి ఫస్ట్ రేంక్ రావాలి, మన పక్కింటివాళ్ళ పిల్లాడికి ఫస్ట్ రేంక్ రాకూడదు. ఇంకా విచిత్రమైన మాట చెప్పారు. మన పొలంలో వర్షం పడాలి, పక్కవాడి పొలంలో వర్షం పడకూడదు. ఇంక మనకి మోక్షం ఎలా వస్తుందమ్మా? అందరి శ్రేయస్సు కోరుకునేవాడికి మోక్షం వద్దన్నా వచ్చి వరిస్తుంది అన్నారు. నేను అనగానే ఎవరూ చెప్పక్కర్లేకుండానే మనకు దేహం స్ఫురిస్తోంది. అలా నేను అనగానే ఎవరికయితే బ్రహ్మం స్ఫురిస్తోందో వాళ్ళకి అది కడసారి జన్మ అన్నారు.

నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో
న శోషయతి మారుతః ॥

అంటే ఆత్మను శస్త్రం ఖండించలేదు. అగ్ని దహించలేదు. నీరు తడపలేదు. గాలి ఎండింపచేయలేదు. అంటే ఆత్మ అవినాశి. అది సర్వవ్యాపి. సర్వకాల సర్వావస్థలలోనూ ఉండేది. ఆత్మను ఎవరూ ఏమీ చేయలేరు. నువ్వు ఇప్పుడే, ఇక్కడే Truth ని రియలైజ్ చెయ్యగలిగితే గొడవే లేదు. అది శాశ్వత ఆనందం. ఒకవేళ నువ్వు ఆస్థాయిని అందుకోలేకపోయినా, ఆత్మ పుడుతూ, చస్తూ ఉంటుందని ఒకవేళ అనుకున్నా కూడా నీకు మళ్ళీ పునర్జన్మ వస్తుంది. ఈ దేహం పోతే ఇంకో కొత్త దేహం ఇస్తాడు. అందుచేత చావుకి ఎవరూ భయపడక్కర్లేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే
న త్వం శోచితుమర్హసి ॥

అంటే పుట్టినవాడు చనిపోవడం ఎలాగూ తప్పదు. చనిపోయినవాడు పుట్టడం ఎలాగూ తప్పదు. కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు. నీకు ఇంకో కొత్త దేహాన్ని, ఇంకో కొత్త తల్లితండ్రులను నిర్ణయించిన తరువాతే ఈ దేహంలోంచి నీ ప్రాణం తీస్తాడు. ఇంకో కుటుంబం నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది అన్నారు. నాన్నగారి భక్తులమయిన మనమందరం అసలు భయపడక్కర్లేదు. ఎందుకంటే నాన్నగారు మనందర్నీ పస్ట్ క్లాస్ పాసింజర్స్ అన్నారు. నేను కాశీ లో బోటు ఎక్కలేకపోయినా, ఆయన వెనక్కి వచ్చి నన్ను ఎక్కించుకుని వెళ్ళారు.

పోస్టాఫీసు మీటింగులలో నాన్నగారు బల్లగుద్ది మరీ చెప్పిన మాటలు : "ఎవరయితే తమ శక్తిని, ఐశ్వర్యాన్ని .... అన్నిటినీ త్రికరణశుద్ధిగా 100 % ఉపయోగించుకుంటూ, బ్రహ్మంకోసం ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో బ్రహ్మాన్ని పొందకుండా గనక మరణిస్తే, ఆలస్యం చేయకుండా మహాయోగులు, మహాత్ములు ఉన్న ఇంట్లో ఆ జీవుడిని తీసుకువెళ్ళి నేను ప్రవేశపెడతాను అర్జునా అన్నాడు కృష్ణుడు."

నేను హైదరాబాదు వస్తున్నానని తెలియగానే బంధువులు, భక్తులు అందరూ స్టేషన్ కి రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. అలాగే మరి మనం చనిపోయినప్పుడు మన జీవుడిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరయినా వస్తారా అంటే వస్తారు. ఇక్కడ మనం మాట్లాడిన మంచి మాట, మంచి తలంపు, మనం చేసే మంచి పని ఏదీ వృధా కాదు. ఆ సత్కర్మ మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి మనల్ని చీకటి లోకాలకు తీసుకెళ్ళకుండా వెలుగున్న లోకాలకు తీసుకెళ్తుంది. జీవుడి కోసం ఎవరూ రారని అనుకోవద్దు అని నాన్నగారు అన్నారు.

నాన్నగారు ఎవరినైనా చూసి ఏదైనా అంటే ఆయన అనుగ్రహం వలన అది జరుగుతుంది. పటేల్ కి ఎంత ధైర్యం ఉందో పద్మకి అంత ధైర్యం ఉంది అనేవారు. ఒకసారి ఏదో చిన్న సంఘటన జరిగింది. నిజానికి ఆ సంఘటనకి నాకు రియాక్షన్ వచ్చింది. కానీ నాన్నగారు పద్మ అసలు ఈ చిల్లర విషయాలు పట్టించుకోదు అన్నారు. నాన్నగారు అలా అనగానే అయితే నాన్నగారు నన్ను చాలా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నారు అనుకున్నాను. అంటే యాక్షన్ ఉండాలి కానీ, రియాక్షన్ ఉండకూడదు అని నాన్నగారు గైడ్ చేసారు.

"సత్యజ్ఞానములేని ఈ జన్మ ఫలమేమి యొప్పగ రావేల అరుణాచలా!"

భగవాన్ అక్షరమణమాలలో చెప్పింది నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సత్యాన్ని తెలుసుకోకుండా, జ్ఞానం పొందకుండా ఈ దేహం చనిపోయింది అనుకోండి ఏం ప్రయోజనం? అంటూ భగవాన్ దగ్గరకి వచ్చిన ఒక వ్యక్తి గురించి చెప్పారు.

ఒక మాష్టారు చాలా సమస్యలు ఉండడంవల్ల చనిపోదామని నిర్ణయించుకుని, చివరిసారిగా దర్శనం చేసుకుందామని భగవాన్ దగ్గరకి వస్తారు. భగవాన్ ఆ సమయంలో విస్తరాకులు కుడుతూ ఉంటారు. ఈ విస్తరాకులు నేను ఎందుకు కుడుతున్నాను? అని అడిగారు. మీరు భోజనం చేయడానికి అని మాష్టారు సమాదానం చెప్పారు. భోజనం చేయకుండానే నేను ఈ విస్తరాకుని పడేసాననుకోండి ఏమిటి ప్రయోజనం? అన్నారు భగవాన్. మీరు కుట్టిన విస్తరాకు వృధా అయినట్టే అని చెప్పిన మాష్టారుకి వెంటనే స్ఫురించింది. నేను చనిపోదామని అనుకుంటున్న విషయం భగవాన్ కి అర్థమయింది, అందుకే విస్తరాకు గురించి ఉదాహరణగా చెపుతున్నారు. జ్ఞానం పొందకుండా చనిపోతే, విస్తరాకులాగే నా జన్మ కూడా వృధా అవుతుందని భగవాన్ తెలియజేస్తున్నారు అని అర్థమై ఆ మాష్టారు ఆత్మహత్యాప్రయత్నం విరమించుకున్నారు. అది మహాత్ముల దర్శనం వల్ల కలిగే ప్రయోజనం!

నాన్నగారు ఒక ప్రవచనంలో, మోక్షం వచ్చేవరకు గురువు వెంటాడుతూనే ఉంటాడు అని చెప్పారు. గురువు దేహంతో కూడానే ఉంటాడా అని అడిగాను. నాన్నగారు "దేహంతో సహా ఉంటాడు" అన్నారు. రామకృష్ణుడు మళ్ళీ పుడతాను అన్నాడు కదా! రామకృష్ణుడు మళ్ళీ పుట్టడం ఏమిటి? రామకృష్ణుడు అనే Individual విడిగా ఉంటుందా? తిరిగి పుట్టడానికి అని అడిగాను. అప్పుడు నాన్నగారు, కృష్ణుడు కూడా చెప్పాడు నేను మళ్ళీ పుడతానని!

యదా యదాహి ధర్మస్య
గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్॥

పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే ॥

ధర్మమునకు హాని కలిగినప్పుడు, అదర్మం పెచ్చుపెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. ధర్మ పరిరక్షణ కొరకు నేను ప్రతియుగమునందు అవతరిస్తాను అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు కదా! వాడు బ్రహ్మమై చెబుతున్నాడు. అంటే రామకృష్ణుడు కూడా బ్రహ్మమై చెబుతున్నాడు నేను మళ్ళీ వస్తాను అని. అంటే వారు దేహాన్ని సృజించుకుంటారు. ఉదాహరణ: వర్షం వచ్చినప్పుడు మన ఇళ్ళల్లో అన్ని తూరలలోంచి నీరు ప్రవహిస్తుంది. అన్ని తూరలలోంచీ వచ్చేది వర్షపు నీరే! అలాగే ఆచార్యులవారై వచ్చినా, రామకృష్ణుడై వచ్చినా.... ఏ రూపంలో వచ్చినా వారిద్వారా ప్రవహించేది మొత్తం బ్రహ్మమే! ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ఇంజన్ కి నీ పెట్టె తగిలించేస్తారు అన్నారు. నాన్నగారు కూడా బ్రహ్మమై చెబుతున్నారు నేను మళ్ళీ వస్తానని! మళ్ళీ పుడతాను అంటే అక్కడ నాన్నగారు అనికాదు. బ్రహ్మమే మళ్ళీ పుడుతుంది.

సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచః॥

భగవంతుడికోసం అన్ని ధర్మాలనూ విడిచిపెట్టేయచ్చు. అప్పుడు ఆయన మనలో ఉన్న పాపాలన్నీ కడిగి ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. అయితే శరణాగతి చెందడం మనచేయాల్సిన పని.

"వ్యక్తిగతమైన నేను ఉన్నంతసేపు గురువునో, ఈశ్వరుడినో నమ్మవలె" అన్నారు భగవాన్. రమణ భాషణములులో వస్తుంది. ఆ వాక్యము నాన్నగారు నాతో చదివించారు. భక్తిమార్గం safest & surest అన్నారు. అంటే నదిని ఈదుకుంటూ వెళ్ళవచ్చు, పడవలోనూ వెళ్ళవచ్చు. అంటే భక్తిమార్గం పడవలో క్షేమంగా ప్రయాణించినట్టు!

"రమ్మని యనలేదె వచ్చినా వంతివ్వ వెరకు నీ తలవిధి అరుణాచలా"

అని అక్షరమణమాలలో భగవాన్ అన్నారు కదా! అంటే రమ్మని పిలిచావు, నీ కూడా తిప్పుకున్నావు, ఇప్పుడు జ్ఞానం ప్రసాదించవలసిన బాధ్యత కూడా నీదే అని అర్థం. అంటే మనకు మోక్షం ప్రసాదించటం నాన్నగారికి, అరుణాచలేశ్వరుడికి వారి విధి అన్నమాట! అయితే కొంచెం మన ముఖం అటువైపు తిప్పి ఉంచాలి.

చివరిసారిగా నేను వైజాగ్ హాస్పిటల్ కి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు, నిండు పున్నమి చంద్రునిలా నవ్వుతూ రెండు చేతులూ ఎత్తి ఆశీర్వదించారు.

ఆయన జీవించి ఉన్నంతకాలం ఆయన సమక్షంలో ఆనందంగా గడిపే భాగ్యం నాకు కలుగచేసారు. అంతులేని ప్రేమ కురిపించారు. సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించారు. జ్ఞానబిక్ష పెట్టారు. మరణభయాన్ని దాటించారు. God realisation పొందేవరకూ కూడానే ఉంటానని అభయం ఇచ్చారు.

అన్నీ తానై సులభంగా ఆధ్యాత్మిక ప్రయాణం చేయిస్తూ, లక్ష్యాన్ని చేరుస్తున్న నాన్నగారి పాదపద్మములకు సర్వదా కృతజ్ఞతా పూర్వక ప్రణామములు!