Sunday, September 26, 2021

"నాన్నగారి అంతులేని ప్రేమ ప్రవాహం" - (By పద్మ గారు (హైదరాబాద్))

నాన్నగారు రాముడు గురించి చెబుతున్నప్పుడు రాముడిలా, కృష్ణుడి గురించి చెబుతున్నప్పుడు కృష్ణుడిలా అనిపించేవారు. రామకృష్ణుడిలా, షిర్డీసాయిబాబాలా, శంకరాచార్యునిలా బుద్ధుడిలా, భగవాన్ లా ఇలా నాన్నగారు ఎవరి గురించి చెబితే వారి రూపంలా అనిపించేవారు. నాన్నగారిలో అందరి మహాత్ములను దర్శించిన ఆనందం కలిగేది. నాన్నగారి సమక్షంలో చింతామణిలా చింతలు తీరేవి. కల్పవృక్షంలా కోరికలు తీరేవి. చంద్రుని వెన్నెలలా చల్లదనం ప్రసరించేది.

షిర్డీసాయిబాబా నా భక్తులను నా దగ్గరకు తీసుకుంటాను అని చెప్పారు. అంటే మనం ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నా గురువుకి తెలుస్తుంది. మేము నల్గొండ జిల్లా రాశి సిమెంట్ ఫేక్టరీ దగ్గర ఉండేవాళ్ళము. అక్కడి నుండి 1992 డిసెంబరు మొదటి వారంలో హైదరాబాదుకి మారాము. ఆ చివరి వారంలో నాన్నగారు పరిచయం అయ్యారు. మేము హైదరాబాద్ రావడం వల్ల ప్రయోజనం ఏమిటంటే, నాన్నగారి సన్నిధికి చేరుకోవడం జరిగింది. ఆయన రప్పించుకున్నారు. ఇది "దైవానుగ్రహం".

మా అత్తగారు, ఆడపడుచు నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేసారు. నాన్నగారు అప్పుడు లక్ష్మీవాళ్ళ నాన్నగారు వరహాలరాజుగారి ఇంట్లో ఉన్నారు. నాన్నగారు నన్ను బాగా పలకరించారు. ఏం చదివావు? ఏం పుస్తకాలు చదువుకుంటూ ఉంటావు? అని అడిగారు. మొదటి దర్శనంలోనే నాకు నాన్నగారంటే బాగా ఇష్టం ఏర్పడింది. రెండు రోజుల్లో త్యాగరాయ గానసభలో "రమణభాషణములు" పుస్తకం ఆవిష్కరణోత్సవం ఉంది రమ్మని ఆహ్వానపత్రిక ఇచ్చారు.

త్యాగరాయ గానసభలో సామవేదం షణ్ముఖశర్మగారితో పాటు వేరే వక్తలు కూడా మాట్లాడారు. అక్కడ నాన్నగారు కూడా అరగంటసేపు మాట్లాడి ఆత్మగురించి చెప్పారు. నాకు సబ్జక్ట్ చాలా కొత్తగా, ఆశక్తిగా ఉంది అనిపించింది. అదే ట్రిప్ లో 1993 జనవరి 1న రేణుకగారి ( Biological ) ఇంట్లో భోజనాల ఏర్పాట్లు, మధ్యాహ్నం నాన్నగారి ఉపన్యాసం చాలా వైభవంగా జరిగాయి.

సంక్రాంతికి మా అత్తగారి ఊరు కోడవల్లి వెళ్ళాము. అక్కడినుండి జిన్నూరు మొదటిసారి వెళ్ళటం జరిగింది. నాన్నగారు అరుగుమీద కూర్చుని ఉన్నారు. ఆయన నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఏం పుస్తకాలు చదువుతావు? అని అడిగారు. నాన్నగారూ మీ దగ్గరకు వచ్చింది తక్కువే కాని మీ కేసెట్స్ బాగా విన్నాను అని చెప్పాను. నీ డైలీ లైఫ్ కి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? అని అడిగారు. నేను ఇంతవరకూ జపం చేసుకోవాలి, పుణ్యం చేసుకోవాలి అనుకున్నాను. మీరు చెప్పిన Aim high & Aim at the highest అని చెప్పింది చాలా నచ్చింది. God realisation ultimate destination అని తెలిసింది అన్నాను. మా అత్తగారితో, పార్వతమ్మగారూ మీ కోడలు చాలా త్వరగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి నాన్నగారు నన్ను బ్లెస్ చేసారు.

1993 వ సం ॥ రం డిసెంబరు ఆఖరి వారంలో మొదటిసారిగా అరుణాచలం వెళ్ళాము. అప్పుడు నాన్నగారు మోరీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మాకు అక్కడ పక్కనే ఒకరూమ్ ఇచ్చారు. నాకు అరికాళ్ళలో Corns ఉండటం వల్ల చెప్పులు లేకుండా ఇంట్లోకూడా నాలుగు అడుగులు వెయ్యలేకపోయేదాన్ని. ఆ కారణంగా గిరిప్రదక్షిణ చెప్పులు లేకుండా చెయ్యటం అసాధ్యం అనిపించి చెప్పులతో ప్రదక్షిణకి బయలుదేరాను. నాన్నగారు మమ్మల్ని కుబేరలింగం దగ్గర ఉండమని, ఆయన అక్కడకు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. తరువాత మేము గిరి ప్రదక్షిణ పూర్తిచేసి తిరిగి వచ్చాము. ఆ సాయంత్రం నాన్నగారు నాతో నువ్వు ఈ రోజు భోజనం చేయవద్దు, రామారావుగారు పండ్లు తెచ్చి ఇస్తారు అవే తీసుకో అన్నారు. చెప్పులతో గిరి ప్రదక్షిణకు వెళ్ళినందుకే నాన్నగారు భోజనం మానేసి పండ్లు తినమన్నారేమో అనిపించింది. అందువల్ల మరుసటిరోజు ఉదయం చెప్పులు లేకుండానే గిరిప్రదక్షిణ చేసాను. నాన్నగారు అలా అని ఉండకపోతే నేను చేయలేకపోదును. ఆ తరువాత నాన్నగారు నువ్వు ఇంక ఒకసారి కూడా తిరగవద్దు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే కారులో వెళ్ళి, ఎక్కడయినా కూర్చోవాలనిపిస్తే కాసేపు కూర్చుని వచ్చేయి అన్నారు. నాన్నగారు ఏదైనా ఒకసారి వద్దు అంటే దానిమీదకు నా మనసు పోయేది కాదు.

నాన్నగారు పరిచయమైన కొత్తలో నేను నాన్నగారితో, అందరూ భగవాన్, భగవాన్ అంటున్నారు. వర్కు అంతా చేసేది మీరయినా, మీరు కూడా అంతా భగవాన్ చేసారంటున్నారు. మీకు భగవాన్ గురువు అవ్వచ్చు కానీ మాకు భగవాన్ గురువు ఎలా అవుతారు? మాకు అన్నీ తెలియజేసి బోధించేది మీరే కదా! మాకు మీరే గురువు అన్నాను. అప్పుడు నాన్నగారు నవ్వుతూ, నీలాంటివాడే పండరీపురంలో ఒకడు ఉన్నాడు. ఇద్దరు గురుశిష్యులు ఉండేవారు. గురువుగారు అరుగుమీద కూర్చున్న సమయంలో పాండురంగడి ఊరేగింపు వచ్చింది. అప్పుడు గురువుగారు శిష్యుడితో, పెరుమాళ్ వెళ్ళిపోతున్నాడు తొందరగా వచ్చి చూడమని పిలిచారు. అప్పుడు ఆ శిష్యుడు మీ పెరుమాళ్ వెళ్ళిపోతే మీరు చూసుకోండి, నేను నా పెరుమాళ్ కి పాలు కాచుకుంటున్నాను, నేను రాను అన్నాడు. అంటే ఆ శిష్యుడికి గురువుగారే పెరుమాళ్ అన్నమాట!

ఒకసారి మా నాన్నగారితో కలిసి రవీంద్రభారతిలో అనూప్ జలోటా బజన్స్ ఉంటే వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అర్థరాత్రి అయిపోవడం వల్ల అమ్మగారింట్లో ఉండిపోయాను. మర్నాడు ఉదయం మా హౌస్ ఓనర్ సిద్ధయ్యగారు ఫోన్ చేసి మా ఇంట్లో దొంగలు పడ్దారని చెప్పారు. వెళ్ళి చూస్తే కొంత డబ్బు, బంగారం పోయాయి. మా ఎదురింటి సాయిగారి భార్య నాగేశ్వరి, సిద్ధయ్యగారు, సంధ్య, ఇంటి ప్రక్కవారు అందరూ వచ్చారు. నేను బీరువాలో చూసి మా గురువుగారి కేసెట్స్ సేఫ్ గా ఉన్నాయి అని ఆనందపడ్డాను. వారు డబ్బు, బంగారం పోయాయని బాధ పడకుండా కేసెట్స్ చూసి ఆనంద పడుతున్నారు, ఆ కేసెట్స్ లో ఏముంది? అని అడిగారు. మా గురువుగారి ప్రవచనాలు ఉన్నాయని చెప్పాను. మా ఇంట్లో అన్ని గదుల్లో నాన్నగారి ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోలో ఉన్నది ఎవరని అడిగారు. మా గురువుగారు, నాన్నగారు అంటారు అని చెప్పాను. ఆ తరువాత నాన్నగారు వచ్చినప్పుడు వారందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. నాన్నగారి అంగీకారంతో అశోక్ నగర్ లో మా ఇంట్లో సత్సంగం పెట్టుకున్నాము.

అశోక్ నగర్ లో త్యాగరాయ గానసభ మా ఇంటికి దగ్గరగా ఉండేది. సిద్ధయ్యగారు నాన్నగారి ఉపన్యాసం త్యాగరాయ గానసభలో పెట్టుకోవచ్చుకదా అని సలహా ఇచ్చారు. నేను నాన్నగారిని త్యాగరాయ గానసభలో ఉపన్యాసం పెట్టుకుందామని అడిగాను. నాన్నగారు అంగీకరించారు. "శ్రీ నాన్నగారి ఆధ్యాత్మిక ప్రవచనం" అని చిన్న పేపర్ ప్రకటన ఇచ్చాను. ఆ హాలు మొత్తం జనంతో నిండిపోయింది. కార్యక్రమం చాలా బాగా జరిగింది. మేము అశోక్ నగర్ లో ఉన్న రోజుల్లో, నాన్నగారి ఉపన్యాసం త్యాగరాయ గానసభలో పెట్టుకుందామని అడిగేదాన్ని. నాన్నగారు అందుకు అంగీకరించేవారు. నాన్నగారు వస్తే పెద్ద పండుగలా ఉండేది. నాన్నగారు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ మేము ఆయన దగ్గరకు వెళ్ళేవాళ్ళము. అప్పుడు నాన్నగారు మదురానగర్ లక్ష్మిగారి ఇంటిలో ఉండేవారు. నల్లకుంట సావిత్రి మామ్మగారి ఇంటికి కూడా వచ్చేవారు. ప్రవచనం చేసేటప్పుడు ఏదైనా పుస్తకం చదువుతూ చెప్పేవారు. ఆ పుస్తకం నా చేతికి ఇచ్చి చదవమనేవారు. రెండు లైన్లు చదివాక దానిమీద వివరణ ఇచ్చేవారు. నేను ఎప్పుడైనా వెనక కూర్చున్నా ముందుకు రమ్మని పుస్తకం ఇచ్చేవారు. అలా చాలాకాలం నాకు ముందు కూర్చునే అవకాశం లభించింది. ముందురోజు చెప్పిన ఉపన్యాసంలో ప్రశ్నలు అడిగేవారు. ఒకసారి సనత్ కుమారుడు గురించి చెబుతూ సనత్ కుమారుడే భగవాన్ గా జన్మించాడని చెప్పారు. మర్నాడు భగవాన్ సనత్ కుమారుడిగా ఉండగా ఏమి చెప్పాడమ్మా అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. మన నిజ స్వరూపం బ్రహ్మం, మన స్వరూపం ఆత్మ. కానీ మనలో ఉన్న బ్రహ్మం మనకి అందాలంటే అది ఎలా అందాలో సనత్ కుమారుడు చెప్పాడు. ఏమి చెప్పాడంటే ఎవరూమాట్లాడటం లేదేమిటి? అన్నారు. అప్పుడు ఆహార శుద్ధి వలన ఇంద్రియ శుద్ధి అన్నాను. నాన్నగారు అవును అని నావైపు తిరిగారు.
ఆహారశుద్ధి వల్ల - ఇంద్రియశుద్ది
ఇంద్రియశుద్ధి వల్ల - మనశ్శుద్ధి
మనసుశ్శుద్ధి వల్ల - అంతఃకరణశుద్ధి
అంతకరణశుద్ధి వల్ల - ఆత్మానందం అందుతుంది అని సనత్ కుమారుడు చెప్పాడు, నాన్నగారూ అన్నాను. అప్పుడు నాన్నగారు నవ్వుతూ Very Good. You are born teacher, you are not made teacher అన్నారు. ఒకసారి ఈశ్వరునికి మరోపేరేమిటి? అని అడిగారు.
"కర్మఫలదాత" అని చెప్పాను.

ఒక సందర్భంలో నాన్నగారు మనం పూర్వజన్మలో ఈ దేహం నిజం, ఈ సంఘటనలు నిజం, ఈ కుటుంభసభ్యులు నిజం అనుకున్నాము. ఈ జన్మలో కూడా ఈ దేహం నిజం, ఈ సంఘటనలు నిజం. ఈ కుటుంబ సభ్యులు నిజం ... ఇలాగే అనుకుంటున్నాము. వచ్చే జన్మలో కూడా అలాగే అనుకుంటాము అని చెప్పి ఈ సంసారం గురించి భగవాన్ ఎమన్నారో చెప్పారు. తరువాత దాని గురించి అడుగుతూ భగవాన్ ఈ సంసారాన్ని ఏమన్నారు? అని అడిగారు. భగవాన్ ఈ సంసారాన్ని Ever unreal ( ఎప్పుడూ అసత్యమే ) అన్నారు అని చెప్పాను. నీ సబ్జక్ట్ grasping బాగుంది. గడియారం ముల్లు ఎంత accurate గా తిరుగుతుందో అలా ఉంది. అంత accurate గా ఉంది నీ సబ్జక్ట్ అన్నారు. అక్కడ నేను చేసిందేమీ లేదు. నాన్నగారు చెప్పిన మాటలే తిరిగి చెప్పేదాన్ని. అయినా నాన్నగారు నన్ను మెచ్చుకుంటూ టీచింగ్ కి బాగా ప్రోత్సహించేవారు.

ఒకసారి నాన్నగారిని భక్తియోగం ఒకటి సరిపోతుంది కదా నాన్నగారూ అని అడిగాను. "భక్తియోగం అంతా అక్కరలేదు. "సర్వభూతహితేరతాహః" ఈ ఒక్క వాక్యం చాలమ్మా! భాగవతంలో రంతిదేవుడు అనే భక్తుడు ఉన్నాడు. రంతి దేవుడు భోజనం చేసేటప్పుడు తనకి ఆకలిగా ఉన్నా ఎవరైనా అడిగితే వారికి బిక్ష కాదనకుండా ఇచ్చేవాడు. మంచినీళ్ళు తాగేటప్పుడు అడిగితే ఆ నీరు కూడా ఇచ్చేసేవాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఏమైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ భక్తుడు నేను అందరి హృదయాలలో ఉండాలి. అలా ఉండి ఏ జీవికైనా దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని వారు అనుభవించకుండా నేనే అనుభవించేస్తాను. అప్పుడు జీవకోటి దుఃఖం లేకుండా సుఖంగా ఉంటారు. అలాంటి వరం ఇమ్మని అడిగాడు. అలా అన్ని భూతాల క్షేమం కోరేవారికి మోక్షం ఇవ్వకుండా ఎవరూ ఆపలేరు అన్నారు.

నాన్నగారి మనవడు వర్మగారు srinannagaru.com పేరుతో Website start చేసి wonderful work చేస్తున్నారు. దేశ, విదేశాలలో ఉండే భక్తులు అందరూ నాన్నగారి పుట్టినరోజుకి, గురుపూర్ణిమకి వెళ్ళలేకపోయాము అనే బాధ లేకుండా audio, video లద్వారా అన్ని ఉపన్యాసాలు వినగలిగేలా, చూడగలిగేలా అవకాశాన్ని కల్పిస్తూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒకసారి నాన్నగారితో నేను వర్మకి వ్యక్తి భావన లేదు కదా నాన్నగారూ! అని అడిగాను. అవునమ్మా కరెక్టుగా చెప్పావు. వర్కు చేస్తాడు కానీ వ్యక్తి కనపడడు అని నాన్నగారు వర్మని మెచ్చుకున్నారు.

కనస్ట్రక్షన్ వర్క్ రీత్యా మా కుటుంబం హైదరాబాదునుండి చెన్నైకి మారవలసి వచ్చింది. అప్పుడు నాన్నగారు పద్మ మద్రాసు వెళ్ళడంవల్ల హైదరాబాదుకి నష్టం, మద్రాసుకి లాభం అన్నారు. నాన్నగారు హైదరాబాదులో లక్ష్మి ఇంటికి వచ్చేవారు. లక్ష్మి నాన్నగారికి బాగా సేవ చేసేవారు. భక్తులను కూడా చాలా ప్రేమగా ఆదరించేవారు. సహనంతో, నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండేవారు. ఆమెని చూసినప్పుడు గురువు సేవచేసుకోవడం ఎంత అదృష్టం? అనిపించేది. నాన్నగారు నాకు ఆ కోరిక మద్రాసులో తీర్చేసారు. 2000 సం॥ రం నుండి 2003 వరకు మూడు సం॥ రాలు నాన్నగారు అరుణాచలం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చి ఉండేవారు. నాన్నగారితో నాకు కారులో అరుణాచలం వెళ్ళే అవకాశం వచ్చేది. కారులో కూడా సబ్జక్ట్ చెబుతూనే ఉండేవారు. ఖన్నా, శాంతి, వడివేలు, సంగీత విద్వాంసులు మణిగారు, వారి భార్య .... చెన్నై భక్తులంతా వచ్చేవారు. కొంతమంది మన భక్తులు కూడా వచ్చేవారు. అలా మా హాలు మొత్తం నిండిపోయేది. మద్రాసులో నాన్నగారితో నేను గడిపిన రోజులు నాకు Golden days.

నాన్నగారు కోయంబత్తూరు, కొత్తగూడెం వెళ్ళినప్పుడు నాన్నగారికి ఫోన్ చేసి నేను రావచ్చా అని అడిగితే రామ్మా పద్మా అనేవారు. కొత్తగూడెం వెళ్ళినప్పుడు అక్కడ సౌకర్యంగా ఉంటుందని రమ్మనేవారు. అక్కడ అంతా ఆచార్యులవారి సబ్జక్ట్ చెప్పేవారు. ఎంత అందంగా చెప్పేవారు అంటే, సముద్రపు కెరటంలో ఒక బుడగ పగిలిపోతే ఆ బుడగ నీరుగా మారుతుంది. బుడగగా అసత్యం కానీ నీరుగా సత్యం. బంగారపు వడ్డాణం కరిగిస్తే వడ్డాణం కరిగిపోతుంది కానీ బంగారంగా మిగులుతుంది. మట్టి కుండను పగలగొడితే కుండ రూపాన్ని కోల్పోతుంది కానీ మట్టిగా మిగిలి ఉంటుంది.
బుడగ అసత్యం - నీరుగా సత్యం.
వడ్డాణంగా అసత్యం - బంగారంగా సత్యం.
కుండగా అసత్యం - మట్టిగా సత్యం.
దేహబుద్ధి, జీవబుద్ధి నశిస్తే బ్రహ్మాకారం చెందుతాం. జీవబుద్ధి అసత్యం, బ్రహ్మపదార్థం సత్యం. అప్పుడు limitations దాటి Every thing అయిపోతాం అని చెప్పేవారు.

"మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయః! అంటే అసలు మనిషి జన్మదొరకటం, జ్ఞానం పొందాలనే కాంక్ష కలగడం, కలిగినా దానిని నెరవేర్చే గురువు అనుగ్రహం దొరకడం ఇవి మూడూ దైవానుగ్రహం అన్నారు శంకరాచార్యుల వారు. అంటే అనేక వేల జన్మల పుణ్యఫలం ఉంటేనే గానీ అవి దొరకవు. అందులోనూ ఒక మహాగురువు ఆశ్రయం దొరకితే ఇక నీకు దశ తిరిగిందిలే అనేవారట ఆచార్యులవారు.

నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా గురువుగారు దేహంతో ఉన్నంతకాలం ఆయనతో గడిపినందుకు చాలా సంతృప్తిగా ఉంది. దేహం వచ్చినందుకు ప్రారబ్ధం ఎలా ఉన్నా, ఒక మహాత్ముని చుట్టూ 25 సం ॥ లు సన్నిహితంగా తిరిగే అవకాశం లభించింది. ఎప్పుడూ నాన్నగారి ధ్యాసతోనే గడిపేవాళ్ళము. ఆ ధ్యాసలో పిల్లలు పెరగటం, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో అవేమీ గుర్తులేవు. నిరంతరం నాన్నగారి సబ్జక్ట్, సత్సంగం అంతే! కొన్నిసార్లు సత్సంగానికి వినటానికి వెళ్ళేవాళ్ళము. కొన్నిసార్లు చెప్పటానికి వెళ్ళేవాళ్ళం. ఎలా అయినా మొత్తంగా సత్సంగాలచుట్టూ, నాన్నగారిచుట్టూ తిరిగేవాళ్ళం. అలా మన దృష్టి ఎటూ మళ్ళకుండా సబ్జక్ట్ చుట్టూ ఉండేలా ఆయన చేసారు.

కష్ణుడు అంటే ఇష్టం ఉండటం వేరు. కృష్ణుడు చెప్పిన భగవద్గీత యొక్క వైభవాన్ని అర్థం చేసుకుని కృష్ణుని ఇష్టపడటం వేరు అని చెప్పారు నాన్నగారు. అలా నాకు నాన్నగారి సబ్జక్ట్ వినేకొలది లోపల నాన్నగారంటే ఇష్టం, గౌరవం పెరుగుతూ వచ్చాయి. అది జ్ఞాని వైభవం. నాన్నగారి సబ్జక్ట్ ఒక మహా సముద్రం. మనం అందులో ఒక నీటి బిందువు లాంటివాళ్ళం. నాన్నగారి గురించి నేను తెలుసుకున్నది కూడా ఆ నీటి బిందువు అంత మాత్రమే అనిపిస్తుంది.

నాన్నగారు ఒకసారి ప్రవచనంలో ఏమి చెప్పారంటే, Theory మొత్తం అంతా వింటాము కానీ, ఆ సబ్జక్ట్ లోతుల్లోకి మాత్రము దిగము. అంటే చెరువులోకి దిగకుండా అలా చెరువుగట్టు మీద కూర్చునే ఉంటాము. అది చూసి, చూసి గురువు ఒక్క తోపు తోస్తాడు. అప్పుడు నీటిలో పడిపోతాము. మనం చేయాలని స్నానం చేయకపోయినా, అందులో పడిపోయాము కాబట్టి స్నానం అయిపోతుంది. అలా గురువుకి "One kick is enough" అని చెప్పారు. మనం నీటిలో పడకుండా అలా కాలక్షేపం చేస్తూ ఉంటే గురువు ఎప్పుడో ఒక తన్ను తన్నితే లోపలికి వెళ్ళిపోతాము.

నాకు 24 సం ॥ ల వయసులో Auto - Immune disorder ( One type of arthritis ) వచ్చింది. డాక్టర్స్ పెద్దగా hope ఇవ్వలేదు. ఒకసారి కారులో నాన్నగారితో అరుణాచలం వెళ్తూ ఉంటే నాన్నగారు "అమ్మా పద్మా 1984 వ సం ॥ లో నాకు అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్స్ నేను చనిపోతాను అని చెప్పారమ్మా! డాక్టర్స్ అందరూ నాకు కేన్సర్ అనుకున్నారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ దేహంలో ఉండగా ఇంక మరలా అరుణాచలం చూడలేనేమో అని తలంపువచ్చింది" అని చెప్పారు. అప్పుడు నేను నాన్నగారితో, నా అనారోగ్యం గురించి డాక్టర్స్ చెప్పినప్పుడు నాకు వచ్చిన తలంపు ఏమిటంటే, నాన్నగారి సమక్షాన్ని కోల్పోతాను అనిపించింది అన్నాను. దానికి నాన్నగారు జ్ఞానం పొందే అవకాశం మిస్ అయిపోతాను అనిపించిందా? అని అడిగి మౌనం వహించారు. కానీ ఆ తరువాత నాకు 25 సం ॥ రాలు ఆయన సమక్షంలో ఆనందంగా గడిపే అవకాశాన్ని కలుగజేసారు. ఇది ఆయన నాకు ప్రసాదించిన వరం.

నాకు కాశీ వెళ్ళాలని ఉండేది. కాకపోతే ట్రైన్ లో వెళ్ళాలంటే సమయం ఎక్కువ పడుతుంది, నాకు ప్రయాణం చేయటం కష్టమవుతుంది అనుకున్నాను. నాన్నగారు ఆ కోరిక కూడా తీర్చేసారు. అప్పటికే నాన్నగారు రెండుసార్లు కాశీ వెళ్ళారు. మళ్ళీ కాశీ వెళుతున్నారని తెలిసింది. నాన్నగారూ ఈ సారి మీరు హైదరాబాదు వచ్చేయండి. ఇక్కడనుండి అందరం ఫ్లైట్ లో వెళదాము అని అడిగాను. సరేనమ్మా అయితే అన్నారు. అలా నాన్నగారు హైదరాబాద్ వస్తే ఫ్లైట్లో వెళ్ళాము. తొమ్మిది రోజులు నాన్నగారితో కాశీలో గడిపాను. కాశీలో 20 మందికంటే ఎక్కువ పట్టని బోటులో నాన్నగారు భక్తులతో కలిసి బయలుదేరారు. ఒడ్డున ఉన్న రాయిమీదనుండి బోటులోకి దూకాలి. కొంతమంది ఎక్కగలిగిన వాళ్ళు దూకేసారు. నాకు దూకే పరిస్థితిలేదు కనుక ఆగిపోయాను. బోటు బయలుదేరి వెళ్ళిపోతుంటే నాన్నగారు పద్మ ఏది? అని అడిగారట. అదేంటి పద్మని ఎక్కించుకోవద్దా అని ఉషని అడిగి మళ్ళీ వెనక్కి వెళ్దాం పదండి అన్నారట. అప్పుడు బోటు మాకోసం తిరిగిరాగానే, రాయిమీద నుండి బోటులోకి ఎక్కలేను అనుకున్నదానిని నాకు తెలియకుండానే ఎక్కేసాను. నాతోపాటు మరో ఇద్దరు భక్తులు విజయ్ కుమార్ గారు, ఆయన భార్య ఇందిర గారు కూడా ఎక్కారు. ఆరోజు నాన్నగారు నదిలోనుండి నీరుతీసి బోటులో ఉన్న భక్తులందరిమీదా చల్లుతూ చాలా ఆనందంగా గడిపారు. పక్కనే వేరే బోట్ లో ఉన్న భక్తులు కూడా నాన్నగారూ మామీద కూడా చల్లండి అంటే వారిమీద కూడా నీళ్ళు చల్లారు. నాన్నగారు భద్రాచలం వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు. కానీ వెళ్తే బావుండును అనుకున్నాను. తరువాత నాన్నగారితో మూడుసార్లు భద్రాచలం వెళ్ళే అవకాశం కలిగింది! రెండుసార్లు శ్రీశైలం కూడా వెళ్ళాను.

కాలడి వెళ్ళినప్పుడు పూర్ణానదిలో స్నానంచేసి, అక్కడ చిన్ని కృష్ణుడి గుడి ఉంటే నాన్నగారితోపాటు దర్శనానికి వెళ్ళాము. బయటికి వచ్చిన తరువాత అమ్మా పద్మా కృష్ణుడిని చూసావా? కృష్ణుడి దర్శనం అయ్యిందా? అని చాలా ఆనందంగా అడిగారు. నేను మామూలు విగ్రహాన్ని చూసానంతే! నాన్నగారు నిజంగా కృష్ణుడి దర్శనం అయినట్టు ఇంత ఆనందంగా అడుగుతున్నారు ఏమిటి అనుకున్నాను.

నాన్నగారితో కోయంబత్తూరు వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు వెళ్ళిపోయినా నేను చివరి వరకూ ఉండిపోయాను. అప్పుడు రంగరాజుగారు నాన్నగారితో, ఈసారి వేరే ప్రదేశాలు చూద్దాము అన్నారు. నాన్నగారు, నేను, రామచంద్రరాజు గారు, రంగరాజుగారు, ఆయన భార్య అందరం కారులో బయలుదేరాము. మధురై, భగవాన్ జన్మస్థలమైన తిరుచ్చుళి, కుమారస్వామి క్షేత్రమైన తిరుప్పరకుండ్రం వెళ్ళాము. ప్రతి గుడిలోకి వెళ్ళి వచ్చిన తరువాత ఇది పద్మ డెస్టినీలో ఉంది అనేవారు. భగవాన్ ఆత్మానుభవం పొందిన స్థలానికి తీసుకువెళ్ళి ఇక్కడే భగవాన్ ఆత్మానుభవం పొందారు. నువ్వు ఇక్కడ కాసేపు కూర్చో పద్మా అన్నారు. తిరుప్పరకుండ్రం గుడికి వెళ్ళినప్పుడు, మధురై ఈశ్వరుని గుడికి వెళ్ళినప్పుడు, అక్కడి పూజారులు నాన్నగారు ఎవరో తెలియక పోయినా, దేవుడికి అలంకరించిన పూలమాల తీసి నాన్నగారి మెడలో వేసారు. ఏమీ తెలియనివారిని కూడా ఆకర్షించే వైభవం "జ్ఞాని వైభవం."

ఒకసారి నాన్నగారితో అరుణాచలం నుంచి కారులో పాండిచ్ఛేరి వెళ్ళాము. అక్కడ అరబిందో ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. సమాధితో పాటు అక్కడన్నీ చూపించారు. అరబిందో 40 సంవత్సరాలు బయటికి రాకుండా ఒకే గదిలో ఉండిపోయారు. వాకింగ్ కూడా ఆ గదిలోనే చేసేవారు. సావిత్రి లాంటి పుస్తకాలు రచించారు. మనకి రెండురోజులు మనుషులు కనపడకపోతే ఉండలేము. భగవాన్ ని ఎక్కడికయినా వెళదామని భక్తులు అడిగితే, ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలే! గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఇంక ఆరోభూతం ఏమీ లేదని చెప్పేవారు అన్నారు. నాన్నగారు చెప్పిన ఈ రెండు మాటలూ నాకు బాగా స్ఫూర్తినిచ్చాయి. కోయంబత్తూరులో రోజూ ప్రారబ్ధాన్ని, ఏకాంతవాసాన్ని ఎంజాయ్ చెయ్యాలని, కష్టసుఖాలను ప్రసాద బుద్ధితో స్వీకరించాలని చెప్పారు. జ్ఞాని ప్రారబ్ధాన్ని మామిడి రసం తాగినట్టు, చెరుకురసం త్రాగినట్టు అనుభవిస్తారని చెప్పారు. రెండు సం ॥ ల నుండి నేను ఎక్కడికీ వెళ్ళలేకపోయినా నాకు ఏమీ అనిపించలేదు. నాన్నగారి అనుగ్రహంలో అదంతా సహజంగా జరిగిపోతూ వచ్చింది.

అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్ ॥
"నేను అందరి హృదయాలలో ఉన్నాను. జఠరాగ్ని రూపంలో కూడా ఉన్నాను. జఠరాగ్ని రూపంలో ఉండి తినే ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే" అన్నాడు కృష్ణుడు.

మీరు సుబ్బారావు అనే వ్యక్తికి భోజనం పెట్టారనుకోండి! నేను సుబ్బారావుకి భోజనం పెట్టాను, సుబ్బారావుకి భోజనం పెట్టాను అనుకోకండి. ఆయనకి ఆకలిగా లేకపోతే మనం పెట్టినా తినలేడు. ఎవరికైనా భోజనం పెట్టినా ఈశ్వరుడికి పెట్టాను, ఈశ్వరుడే తిన్నాడనుకోండి. సుబ్బారావులో జఠరాగ్నిరూపంలో ఉండి జీర్ణమయ్యేలా చేసేది ఈశ్వరుడే! తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేసేది నేనే అన్నాడు కదా! భగవంతుడు మన హృదయానికి అంత దగ్గరగా ఉండటం వలన, మనం పాపకర్మలు చేయకుండా పవిత్రంగా ఉండాలి అన్నారు.

ఆహారం విషయంలో పాటించవలసిన నియమాలు :
1. మనం కష్టపడి, న్యాయంగా సంపాదించిన సొమ్ముతో కూడినదై ఉండాలి.
2. సాత్వికమైన శాఖాహారం తీసుకోవాలి.
3. భగవంతుని ప్రార్థన చేసిన తరువాత ఆహారం తీసుకోవాలి.
4. ఆహారమును ఎక్కువ, తక్కువ కాకుండా యుక్తముగా తీసుకోవాలి.

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ర్బహ్మాగ్నౌ
బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా॥

ఇచ్చేవాడు బ్రహ్మము, పుచ్చుకునే వాడు బ్రహ్మము. ఇవ్వబడుతున్న క్రియ బ్రహ్మము. ఇచ్చే వస్తువు బ్రహ్మము. మనం ఎవరికైనా మామిడి పండు ఇస్తే - మామిడి పండు ఇచ్చేవాడు బ్రహ్మము. మామిడి పండు పుచ్చుకునేవాడు బ్రహ్మము. మామిడి పండు బ్రహ్మము. అలా బ్రహ్మ భావనతో అన్నీ చేసేవాడు చివరికి బ్రహ్మమునే పొందతాడు అని నాన్నగారు చాలా అద్భుతంగా చెప్పారు.

వైజాగ్ లో మా వదిన ( వైజాగ్ పద్మ ) గారి ఇంటికి నాన్నగారు వచ్చినప్పుడల్లా వదిన నన్ను రమ్మనేవారు. అక్కడ నాన్నగారితో సన్నిహితంగా గడపడానికి మంచి అవకాశం లభించేది. నాన్నగారు వైజాగ్ శ్యామల గారి ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఏసుక్రీస్తు గురించి చెప్పారు. ఏసుక్రీస్తు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి నీవు ప్రభువువి, దేవుడివి అంటూ ఉంటే ఏసుక్రీస్తు - నువ్వు మూడు రోజుల్లో నన్ను 30 నాణాలకు పట్టిస్తావు అన్నారంట. అప్పుడు ఆ శిష్యుడు అదేమిటి ప్రభూ? అలా అంటారు అన్నాడట. అవును అది అంతే అన్నారట. అప్పుడు నేను ముందే క్రీస్తు చెప్పినందుకైనా ఆ శిష్యుడు అలా చేయకుండా ఉండవలసింది నాన్నగారూ అన్నాను. అదేంటమ్మా పద్మా? విధి బలీయమైనది! వాసన బలీయమైనది! ఆ శిష్యుడికి ధన వాసన ఉంది. ధనం అనగానే దానికి లొంగిపోయాడు. తరువాత జీసస్ కి శిలువ వేయడం చూసి, నా వల్లే ఇదంతా జరిగింది అని ఆ నాణాలు అక్కడే పడేసి ఉరివేసుకుని చనిపోయాడు. కానీ ఆ సమయానికి వాసన వలన లొంగిపోయాడు అని చెప్పారు. ఆ నాలుగు రోజులూ సత్సంగంలో విధి బలీ .... యము! వాసన బలీ .... యము! అంటూ చాలా ఉదాహరణలు చెప్పారు.

రావణాసురుడు సీతని తీసుకొచ్చినప్పుడు, మండోదరి రావణాసురుడితో ముందే చెప్పింది. నువ్వు తీసుకొచ్చింది సీతను కాదు నీ మృత్యువుని! సీతను తిరిగి రాముడికి అప్పజెప్పు. రాముడుకి శరణాగతి చెందు అని చెప్పినా రావణాసురుడు వినలేదు. అలాగే వాలితో తార చెబుతుంది. నీ చేతిలో చావు దెబ్బలు తిని వెళ్ళిన సుగ్రీవుడు, మళ్ళీ ఇంత త్వరగా యుద్ధానికి వస్తున్నాడంటే, వెనక ఏదో బలగంతో ( శక్తితో ) వస్తున్నాడు వెళ్ళొద్దని చెబుతుంది. కానీ విన్నాడేంటి? విధి బలీ...యము! అన్నారు.

వాలి భార్య తార వాలి చనిపోయిన తరువాత రాముడితో, భార్యా వియోగం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా! నువ్వు బాధ పడుతున్నావు. మరి భర్త వియోగం నాకు ఎందుకు కలుగజేసావు? అని అడిగింది. అప్పుడు రాముడు తారకి ఒక రహస్యం చెప్పాడు అన్నారు నాన్నగారు. సృష్టి మొదలైన దగ్గర్నుండి ఈనాటి వరకూ ఈశ్వరుడి సంకల్పానికి వ్యతిరేకంగా ఏ సంఘటనా జరగలేదు. ఈశ్వరుడి సంకల్పం ఒకలా ఉంటే, ఇంకొకరకంగా చేయడానికి అసలు అవకాశమే లేదు. ప్రారబ్ధమనే ఇరుసులో నువ్వూ, నేనూ, అందరం బంధీలం అమ్మా తారా! ఇక్కడ ఎవరూ స్వతంత్రంగా వ్యవహరించలేరు. వాలి చనిపోవడం కూడా ప్రారబ్ధంలో భాగమే!

ఈశ్వరః సర్వభూతానాం
హృద్దేశేర్జున తిష్ఠతి |
భ్రామయన్ సర్వభూతాని
యంత్రారూఢాని మాయయా ||

భగవద్గీతలోని ఈ శ్లోకం అంటే నాన్నగారికి చాలా ఇష్టం. "ఈశ్వరుడు అందరి హృదయాలలోనూ తిష్టవేసుకుని కూర్చున్నాడు. మామూలుగా కూర్చోలేదు, తిష్టవేసుకుని కూర్చున్నాడు. యంత్రాన్ని తిప్పేవాడు యంత్రాన్ని తిప్పినట్టు బొమ్మలన్నింటినీ తిప్పుతున్నాడు. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఎటు విసురుతాడో తెలీదు. అలా పిచ్చివాడిలా తిప్పట్లేదమ్మా! వారి వారి ప్రారబ్ధానుసారం తిప్పుతున్నాడు." అన్నారు.

ఇందిరాగాంధీ దగ్గర ఉండే సెక్యూరిటీలో సిక్కులు ఉంటే ప్రమాదం తీసేద్దామన్నారట! నాకు అందరూ సమానమే అందట. ఆ సిక్కుల చేతిలోనే ఆమె చనిపోయింది. అలా ఎవరయినా చెప్పినా బుద్ధి ( మాయ ) విననివ్వదు. అలాగే రాజీవ్ గాంధీ విషయంలో ఒక అమ్మాయి హ్యూమన్ బాంబ్ పెట్టుకుని పూలమాలతో వస్తే ఎస్. ఐ ఆపేసాడు. రాజీవ్ గాంధీ అదిచూసి పంపించమన్నాడు. ఆ అమ్మాయి వచ్చి దండేసి బాంబ్ పేల్చేసింది. అంటే డెత్ ని ఆహ్వానించటమే! ఎస్. ఐ ఆపినప్పుడు ఆగాలి కదా! వచ్చేయమన్నాడు. మాయ విననివ్వదమ్మా! అని చెప్పి ఇంకో అద్భుతమైన మాట చెప్పారు. "మాయ విననివ్వకపోవడం కాదు, అసలు ఈశ్వరుడే విననివ్వడు." అంటే వాడి ప్రారబ్ధానుసారం ఆడించేయాలి కదా! విధి బలీయము! అన్నారు. అయితే ఈశ్వరుడే మాయలో పెట్టేసి, ఈశ్వరుడే విననివ్వకుండా చేసేస్తే మనం మాయలో పడి కొట్టుకోవడమేనా? ఏంటి పరిస్థితి? అని నాన్నగారే ప్రశ్నించి, ఆయనే సమాదానం చెబుతూ దీనికి పరిష్కారం కూడా కృష్ణుడు చెప్పాడు అన్నారు.

తమేవ శరణం గచ్ఛ
సర్వభావేన భారత !
తత్ప్రసాదాత్ పరాం శాంతిం
స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ !!

అన్ని విధాలా ఆయన్నే శరణు పొందు. ఆయన అనుగ్రహం వల్ల పరమశాంతిని, శాశ్వతమైన స్థానాన్నీ పొందుతావు. అంటే ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించి జీవించాలి. చేపలు పట్టేవాడు వల విసిరినప్పుడు తెలివైన చేపలు, చేపలు పట్టేవాడి పాదాల దగ్గరకు వెళ్ళిపోతాయి. వల విసిరినప్పుడు ఆ చేపలు అతని వలలో పడవు. అలాగే ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు మాయ వలలో పడరు. ఈశ్వరానుగ్రహం కలిగితే ప్రయోజనం ఏమిటి? ఈశ్వరానుగ్రహం కలిగితే మన జేబులో డబ్బులు పెట్టి వస్తువు కొనుక్కోవటం ఎంత సులభమో, మోక్షం అంత సులభంగా వరిస్తుంది. అప్పుడు మనం ఆయన స్వరూపాన్ని పొందుతాము. అది శాశ్వత ఆనందం అన్నారు.

"మనం కలెక్టరు గారి ఇంటికి వెళ్ళామనుకోండి. వాచ్ మెన్ మనల్ని బయటే ఆపేస్తాడు. కలెక్టరుగారు బాల్కనీలోంచి చూసి లోపలికి పంపమన్నారనుకోండి, వాచ్ మెన్ లోపలికి పంపిస్తాడు. అలా పలానవాడికి దారి ఇవ్వు అని ఈశ్వరుడు చెబితే మాయ దారి ఇస్తుంది. అంటే మాయాధిపతి ఎవరు? ఈశ్వరుడే!" అన్నారు.

రాజశేఖర రెడ్డి ఫ్లైట్ ఎక్కేముందు ఫైలెట్ వద్దండి వాతావరణం బాలేదన్నాడు. అప్పుడు రాజశేఖరరెడ్డి నీకు డెత్ అంటే అంత భయమా? పద వెళ్దాం అన్నారట. అంటే విధి బలీ....యము! అన్నారు.

వరలక్ష్మిగారి అమ్మాయి విజయ వాళ్ళింట్లో ( కొంపెల్ల ) I am that
I am గురించి అద్భుతంగా చెప్పారు.
I am అంటే బ్రహ్మము (Truth ). అది అందరి హృదయాలలోనూ ఉంది. అందరం బ్రహ్మ స్వరూపులం అయ్యే ఉన్నాము.
I am అంటే సద్వస్తువు. That I am అంటే "అది నేనయి ఉన్నాను" అనేది ఇక్కడ ముఖ్యం. దానిలోనే మొత్తం అంతా ఉంది! చీమలోనూ, ఏనుగులోనూ... అన్ని జంతువులలోనూ సద్వస్తువు ఉంది. దేవుడు ఉన్నాడని చేప్పేవాడిలోనూ దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని చేప్పేవాడిలోనూ దేవుడు ఉన్నాడు. మనకు తెలిసినా తెలియకపోయినా I am అనేది అందరిలోనూ ఉంది. అసలు ముందు That I am అది నేనయి ఉన్నాను అని గ్రహించాలి. అది అనుభవంలోకి రావాలి. క్రీస్తు చెప్పిన I am That I am అనేది భగవాన్ కి కూడా నచ్చింది. ఈ వాక్యాన్ని ఆయన బాగా ఎంజోయ్ చేసేవారని నాన్నగారు అన్నారు.

రెడ్డిగారు అనే ఆయన ప్రతి ఆదివారం భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయేవారు. అప్పుడు గాంధీగారు అన్నారట. ఇప్పుడు రమణ మహర్షిలో ఎముందో నాలోనూ అదే ఉంది. నీలోనూ అదే ఉంది. Truth అందరిలోనూ సమానంగానే ఉంది. మరి రమణ మహర్షి దగ్గరకు పరిగెడతావెందుకు? అన్నారట. Truth మీలోనూ ఉంది. నాలోనూ ఉంది. కానీ ఆయనలో ఉన్నది ఆయనకు అనుభవంలోకి వచ్చింది. మనలో ఉన్నది మనకు అనుభవంలోకి రాలేదు అన్నారట. ఆ సమాదానానికి గాంధీగారు కూడా సంతోషించారు అన్నారు.

I am that I am అనేది క్రీస్తు రియలైజ్ అయ్యాడు. భగవాన్ కి, ఆచార్యులవారికి, బుద్ధుడికి .... అనుభవంలోకి వచ్చింది. I am that
I am అనగానే వాళ్ళలా మనం రియలైజ్ అవ్వలేము కాబట్టి క్రీస్తు,
సాత్వికులు ధన్యులు - వారు స్వతంత్రించుకుందురు.
సమాదాన పరుచువారు ధన్యులు - వారు దేవుని అనుగ్రహానికి పాత్రులగుదురు.
హృదయశుద్ధి గలవారు ధన్యులు - వారు దేవుని చూచెదరు అని చెప్పాడు.
(సమాదాన పరుచువారు: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో, కొంతమంది పట్టుకుంటామని వచ్చి పడగొట్టేస్తూ ఉంటారు. అదే సమాదాన పరుచువారు అయితే, అక్కడికి వెళ్ళి గొడవ పెరగకుండా అడ్డుకుని సర్ధిచెబుతారు. అటువంటి వారు దేవుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు.) డబ్బులు ఉన్నవారు ధన్యులు, అధికారం ఉన్నవారు ధన్యులు అని క్రీస్తు చెప్పలేదు. ఏయే లక్షణాలు ఉంటే భగవంతుడు అనుభవానికి వస్తాడో అవన్నీ చెప్పాడు. ఆధ్యాత్మికమైన బోధలన్నీ హృదయంలోనికి వెళ్ళటానికే! కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన 700 శ్లోకాలు కూడా మనం హృదయంలోకి వెళ్ళటానికే! మనకు అది అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా ఫ్యూరిటీ ఉండాలి అన్నారు నాన్నగారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు.

జిన్నూరులో ఒక అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసారు. ఆయితే కొత్త ఆర్గాన్ ని మన శరీరం రిజెక్ట్ చేస్తుంది. అందుకని స్టెరాయిడ్స్ ఇచ్చేస్తారు. ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తారు రిజెక్ట్ చేయకుండా! అయితే ఆ అబ్బాయి body కిడ్నీని రిజెక్ట్ చేసేసింది. అతను చనిపోయాడు. మనలో 99 % purity ఉండి 1 % impurity ఉంటే, మనం బ్రహ్మంలో ఐక్యం అయిపోదామని అనుకున్నా బ్రహ్మం మనల్ని రిజెక్ట్ చేస్తుంది. ఆ అబ్బాయి body కిడ్నీని ఎలా రిజెక్ట్ చేసిందో, అలా బ్రహ్మం మనలో 1 % impurity ఉన్నా కూడా తనలో ఐక్యం చేసుకోకుండా రిజెక్ట్ చేస్తుంది. మనం 100 % Purity ని పొందినప్పుడు బ్రహ్మం తనలో ఐక్యం చేసుకుంటుంది. అందుకే క్రీస్తు ప్యూరిటీ పొందమని ఇవన్నీ చెప్పుకొచ్చాడు అన్నారు.

నను బోలు దీనుల నింపొందకాచుచు
చిరంజీవివై బ్రోవు మరుణాచలా!

అంటే నా లాంటి రమణులు వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రమణుని అనుగ్రహిస్తేనే సరిపోదు. నిన్ను ఆశ్రయించిన జీవకోటి అంతటినీ మోక్షం వచ్చేవరకూ అనుగ్రహిస్తూ చిరంజీవివై ఉండి బ్రోవుము అరుణాచలా! అన్నారు భగవాన్. అని నాన్నగారు చెపుతూ, మనమేంటమ్మా! మన పిల్లాడికి ఫస్ట్ రేంక్ రావాలి, మన పక్కింటివాళ్ళ పిల్లాడికి ఫస్ట్ రేంక్ రాకూడదు. ఇంకా విచిత్రమైన మాట చెప్పారు. మన పొలంలో వర్షం పడాలి, పక్కవాడి పొలంలో వర్షం పడకూడదు. ఇంక మనకి మోక్షం ఎలా వస్తుందమ్మా? అందరి శ్రేయస్సు కోరుకునేవాడికి మోక్షం వద్దన్నా వచ్చి వరిస్తుంది అన్నారు. నేను అనగానే ఎవరూ చెప్పక్కర్లేకుండానే మనకు దేహం స్ఫురిస్తోంది. అలా నేను అనగానే ఎవరికయితే బ్రహ్మం స్ఫురిస్తోందో వాళ్ళకి అది కడసారి జన్మ అన్నారు.

నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో
న శోషయతి మారుతః ॥

అంటే ఆత్మను శస్త్రం ఖండించలేదు. అగ్ని దహించలేదు. నీరు తడపలేదు. గాలి ఎండింపచేయలేదు. అంటే ఆత్మ అవినాశి. అది సర్వవ్యాపి. సర్వకాల సర్వావస్థలలోనూ ఉండేది. ఆత్మను ఎవరూ ఏమీ చేయలేరు. నువ్వు ఇప్పుడే, ఇక్కడే Truth ని రియలైజ్ చెయ్యగలిగితే గొడవే లేదు. అది శాశ్వత ఆనందం. ఒకవేళ నువ్వు ఆస్థాయిని అందుకోలేకపోయినా, ఆత్మ పుడుతూ, చస్తూ ఉంటుందని ఒకవేళ అనుకున్నా కూడా నీకు మళ్ళీ పునర్జన్మ వస్తుంది. ఈ దేహం పోతే ఇంకో కొత్త దేహం ఇస్తాడు. అందుచేత చావుకి ఎవరూ భయపడక్కర్లేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే
న త్వం శోచితుమర్హసి ॥

అంటే పుట్టినవాడు చనిపోవడం ఎలాగూ తప్పదు. చనిపోయినవాడు పుట్టడం ఎలాగూ తప్పదు. కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు. నీకు ఇంకో కొత్త దేహాన్ని, ఇంకో కొత్త తల్లితండ్రులను నిర్ణయించిన తరువాతే ఈ దేహంలోంచి నీ ప్రాణం తీస్తాడు. ఇంకో కుటుంబం నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది అన్నారు. నాన్నగారి భక్తులమయిన మనమందరం అసలు భయపడక్కర్లేదు. ఎందుకంటే నాన్నగారు మనందర్నీ పస్ట్ క్లాస్ పాసింజర్స్ అన్నారు. నేను కాశీ లో బోటు ఎక్కలేకపోయినా, ఆయన వెనక్కి వచ్చి నన్ను ఎక్కించుకుని వెళ్ళారు.

పోస్టాఫీసు మీటింగులలో నాన్నగారు బల్లగుద్ది మరీ చెప్పిన మాటలు : "ఎవరయితే తమ శక్తిని, ఐశ్వర్యాన్ని .... అన్నిటినీ త్రికరణశుద్ధిగా 100 % ఉపయోగించుకుంటూ, బ్రహ్మంకోసం ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో బ్రహ్మాన్ని పొందకుండా గనక మరణిస్తే, ఆలస్యం చేయకుండా మహాయోగులు, మహాత్ములు ఉన్న ఇంట్లో ఆ జీవుడిని తీసుకువెళ్ళి నేను ప్రవేశపెడతాను అర్జునా అన్నాడు కృష్ణుడు."

నేను హైదరాబాదు వస్తున్నానని తెలియగానే బంధువులు, భక్తులు అందరూ స్టేషన్ కి రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. అలాగే మరి మనం చనిపోయినప్పుడు మన జీవుడిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరయినా వస్తారా అంటే వస్తారు. ఇక్కడ మనం మాట్లాడిన మంచి మాట, మంచి తలంపు, మనం చేసే మంచి పని ఏదీ వృధా కాదు. ఆ సత్కర్మ మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి మనల్ని చీకటి లోకాలకు తీసుకెళ్ళకుండా వెలుగున్న లోకాలకు తీసుకెళ్తుంది. జీవుడి కోసం ఎవరూ రారని అనుకోవద్దు అని నాన్నగారు అన్నారు.

నాన్నగారు ఎవరినైనా చూసి ఏదైనా అంటే ఆయన అనుగ్రహం వలన అది జరుగుతుంది. పటేల్ కి ఎంత ధైర్యం ఉందో పద్మకి అంత ధైర్యం ఉంది అనేవారు. ఒకసారి ఏదో చిన్న సంఘటన జరిగింది. నిజానికి ఆ సంఘటనకి నాకు రియాక్షన్ వచ్చింది. కానీ నాన్నగారు పద్మ అసలు ఈ చిల్లర విషయాలు పట్టించుకోదు అన్నారు. నాన్నగారు అలా అనగానే అయితే నాన్నగారు నన్ను చాలా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నారు అనుకున్నాను. అంటే యాక్షన్ ఉండాలి కానీ, రియాక్షన్ ఉండకూడదు అని నాన్నగారు గైడ్ చేసారు.

"సత్యజ్ఞానములేని ఈ జన్మ ఫలమేమి యొప్పగ రావేల అరుణాచలా!"

భగవాన్ అక్షరమణమాలలో చెప్పింది నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సత్యాన్ని తెలుసుకోకుండా, జ్ఞానం పొందకుండా ఈ దేహం చనిపోయింది అనుకోండి ఏం ప్రయోజనం? అంటూ భగవాన్ దగ్గరకి వచ్చిన ఒక వ్యక్తి గురించి చెప్పారు.

ఒక మాష్టారు చాలా సమస్యలు ఉండడంవల్ల చనిపోదామని నిర్ణయించుకుని, చివరిసారిగా దర్శనం చేసుకుందామని భగవాన్ దగ్గరకి వస్తారు. భగవాన్ ఆ సమయంలో విస్తరాకులు కుడుతూ ఉంటారు. ఈ విస్తరాకులు నేను ఎందుకు కుడుతున్నాను? అని అడిగారు. మీరు భోజనం చేయడానికి అని మాష్టారు సమాదానం చెప్పారు. భోజనం చేయకుండానే నేను ఈ విస్తరాకుని పడేసాననుకోండి ఏమిటి ప్రయోజనం? అన్నారు భగవాన్. మీరు కుట్టిన విస్తరాకు వృధా అయినట్టే అని చెప్పిన మాష్టారుకి వెంటనే స్ఫురించింది. నేను చనిపోదామని అనుకుంటున్న విషయం భగవాన్ కి అర్థమయింది, అందుకే విస్తరాకు గురించి ఉదాహరణగా చెపుతున్నారు. జ్ఞానం పొందకుండా చనిపోతే, విస్తరాకులాగే నా జన్మ కూడా వృధా అవుతుందని భగవాన్ తెలియజేస్తున్నారు అని అర్థమై ఆ మాష్టారు ఆత్మహత్యాప్రయత్నం విరమించుకున్నారు. అది మహాత్ముల దర్శనం వల్ల కలిగే ప్రయోజనం!

నాన్నగారు ఒక ప్రవచనంలో, మోక్షం వచ్చేవరకు గురువు వెంటాడుతూనే ఉంటాడు అని చెప్పారు. గురువు దేహంతో కూడానే ఉంటాడా అని అడిగాను. నాన్నగారు "దేహంతో సహా ఉంటాడు" అన్నారు. రామకృష్ణుడు మళ్ళీ పుడతాను అన్నాడు కదా! రామకృష్ణుడు మళ్ళీ పుట్టడం ఏమిటి? రామకృష్ణుడు అనే Individual విడిగా ఉంటుందా? తిరిగి పుట్టడానికి అని అడిగాను. అప్పుడు నాన్నగారు, కృష్ణుడు కూడా చెప్పాడు నేను మళ్ళీ పుడతానని!

యదా యదాహి ధర్మస్య
గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్॥

పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే ॥

ధర్మమునకు హాని కలిగినప్పుడు, అదర్మం పెచ్చుపెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. ధర్మ పరిరక్షణ కొరకు నేను ప్రతియుగమునందు అవతరిస్తాను అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు కదా! వాడు బ్రహ్మమై చెబుతున్నాడు. అంటే రామకృష్ణుడు కూడా బ్రహ్మమై చెబుతున్నాడు నేను మళ్ళీ వస్తాను అని. అంటే వారు దేహాన్ని సృజించుకుంటారు. ఉదాహరణ: వర్షం వచ్చినప్పుడు మన ఇళ్ళల్లో అన్ని తూరలలోంచి నీరు ప్రవహిస్తుంది. అన్ని తూరలలోంచీ వచ్చేది వర్షపు నీరే! అలాగే ఆచార్యులవారై వచ్చినా, రామకృష్ణుడై వచ్చినా.... ఏ రూపంలో వచ్చినా వారిద్వారా ప్రవహించేది మొత్తం బ్రహ్మమే! ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ఇంజన్ కి నీ పెట్టె తగిలించేస్తారు అన్నారు. నాన్నగారు కూడా బ్రహ్మమై చెబుతున్నారు నేను మళ్ళీ వస్తానని! మళ్ళీ పుడతాను అంటే అక్కడ నాన్నగారు అనికాదు. బ్రహ్మమే మళ్ళీ పుడుతుంది.

సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచః॥

భగవంతుడికోసం అన్ని ధర్మాలనూ విడిచిపెట్టేయచ్చు. అప్పుడు ఆయన మనలో ఉన్న పాపాలన్నీ కడిగి ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. అయితే శరణాగతి చెందడం మనచేయాల్సిన పని.

"వ్యక్తిగతమైన నేను ఉన్నంతసేపు గురువునో, ఈశ్వరుడినో నమ్మవలె" అన్నారు భగవాన్. రమణ భాషణములులో వస్తుంది. ఆ వాక్యము నాన్నగారు నాతో చదివించారు. భక్తిమార్గం safest & surest అన్నారు. అంటే నదిని ఈదుకుంటూ వెళ్ళవచ్చు, పడవలోనూ వెళ్ళవచ్చు. అంటే భక్తిమార్గం పడవలో క్షేమంగా ప్రయాణించినట్టు!

"రమ్మని యనలేదె వచ్చినా వంతివ్వ వెరకు నీ తలవిధి అరుణాచలా"

అని అక్షరమణమాలలో భగవాన్ అన్నారు కదా! అంటే రమ్మని పిలిచావు, నీ కూడా తిప్పుకున్నావు, ఇప్పుడు జ్ఞానం ప్రసాదించవలసిన బాధ్యత కూడా నీదే అని అర్థం. అంటే మనకు మోక్షం ప్రసాదించటం నాన్నగారికి, అరుణాచలేశ్వరుడికి వారి విధి అన్నమాట! అయితే కొంచెం మన ముఖం అటువైపు తిప్పి ఉంచాలి.

చివరిసారిగా నేను వైజాగ్ హాస్పిటల్ కి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు, నిండు పున్నమి చంద్రునిలా నవ్వుతూ రెండు చేతులూ ఎత్తి ఆశీర్వదించారు.

ఆయన జీవించి ఉన్నంతకాలం ఆయన సమక్షంలో ఆనందంగా గడిపే భాగ్యం నాకు కలుగచేసారు. అంతులేని ప్రేమ కురిపించారు. సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించారు. జ్ఞానబిక్ష పెట్టారు. మరణభయాన్ని దాటించారు. God realisation పొందేవరకూ కూడానే ఉంటానని అభయం ఇచ్చారు.

అన్నీ తానై సులభంగా ఆధ్యాత్మిక ప్రయాణం చేయిస్తూ, లక్ష్యాన్ని చేరుస్తున్న నాన్నగారి పాదపద్మములకు సర్వదా కృతజ్ఞతా పూర్వక ప్రణామములు!

Thursday, September 16, 2021

"నాన్నగారి ప్రేమ - విశ్వ ప్రేమ" - (రాజశ్రీ గారు)

నాన్నగారు మన జీవితంలోకి వచ్చిన తరువాత మనం ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే మన జీవితం అంతా నాన్నగారే ఉంటారు. అంటే మన భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. ఎంతో ప్రేమగా మనల్ని సవరిస్తూ, మనల్ని శాంతిలో నిలబెడుతూ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళుతున్నారు.

నా ఆధ్యాత్మిక ప్రయాణం మా అమ్మగారి ద్వారానే మొదలైంది. అందువల్ల ఆమె నాకు తొలి గురువు. మా అమ్మగారు రాజమండ్రిలో ఉండేవారు. ఒకసారి నాకు ఫోన్ చేసి, ఉపదేశసారంలో ఉన్న మొట్టమొదటి శ్లోకాన్ని చెబుతూ నన్ను ఒక పేపర్ మీద రాసుకోమన్నారు. 'కర్తురాజ్ఞయా, ప్రాప్యతే ఫలం' అని రాయించారు. మా అమ్మగారు ఎక్కువ జ్ఞాన మార్గాన్ని ఇష్టపడేవారు. అదేవిధంగా జీవించి కూడా చూపించేవారు. మాకు ఎప్పుడూ ప్రవర్తన సరిగ్గా ఉండాలి అని చెబుతూ, రామాయణంలో రాముడు ఫలానా సంఘటన ఎదురయితే అలా ప్రవర్తించాడు అని అలా అందరి పుణ్య పురుషుల గురించి మాకు చెబుతూ, మీరు అలా సవరించుకుంటూ ఉండాలి అని బోధించేవారు. శాస్త్ర ప్రమాణంగానే నీ జీవితాన్ని సరిదిద్దుకో అని నాకు సలహా ఇస్తూ ఉండేవారు. ఒకసారి సుందర చైతన్య గారు రాజమండ్రిలో ఉపదేశసారం బోధించారు. అది మా అమ్మగారు విని, మహర్షి పట్ల చాలా ఆకర్షితులయ్యారు. తరువాత కొద్ధి రోజులకే బంధువులతో కలిసి అరుణాచల యాత్రకు వెళ్ళారు. అక్కడ రమణాశ్రమం చూసి వచ్చి చాలా ఆనందపడ్డారు. నేను నా భర్త ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళాలి అంటే, ఏదో ఒక పుణ్యక్షేత్రాన్నిదర్శించుకోవటానికి వెళ్ళేవాళ్ళం. మా అమ్మగారు అరుణాచలం చూసి వచ్చిన తరువాత, నువ్వు మీ భర్త పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటారు కదా! ఈసారి అలా వెళ్ళినప్పుడు అరుణాచలంలో రమణాశ్రమాన్ని తప్పక దర్శించుకోండి అని చెప్పారు.

తరువాత నా భర్తతో కలిసి అరుణాచలం వెళ్ళాను. రమణాశ్రమం గేటు చూడగానే, నాకు తెలియకుండానే దుఃఖం వచ్చేసింది. ఆ దుఃఖం పూర్వజన్మ అనుబంధం వలన వచ్చింది అని, నాన్నగారి దగ్గరకు వచ్చిన తరువాత అర్థమయ్యింది. గిరి ప్రదక్షిణ చేసిన తరువాత, మా అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగా లేనందువలన నా భర్త, మా అమ్మాయి కిందనే ఉండిపోయారు. నేను, మా అబ్బాయిని తీసుకుని గిరిపైకి వెళ్ళాను. అప్పుడు మా అబ్బాయి గిరి పైకి వెళితే, రమణమహర్షి కనిపిస్తారా? అని అడిగాడు. కనిపిస్తారు అని చెప్పి - మా అబ్బాయిని తీసుకు వెళ్ళాను. మధ్య దారిలో ఒక వృద్ధ సాధువు మమ్మల్ని ఆపి, 'రమణ మహర్షి జీవిత కథ కొద్దిగా ఇంగ్లీషులో చెప్పారు'. అది విని మా అబ్బాయి నిజంగానే రమణమహర్షి ఈ సాధువు రూపంలో వచ్చారు అని భావించి చాలా ఆనందపడ్డాడు. తిరిగి వచ్చేటప్పుడు సూరి నాగమ్మ గారి లేఖలు పుస్తకం తెచ్చుకున్నాను. ఆ గిరి, ఆ రమణాశ్రమం, నా మనసుని చాలా ఆకట్టుకున్నాయి. అరుణాచలం నుండి వచ్చిన తరువాత ఒక నలభై రోజులు సూరి నాగమ్మ గారి లేఖలు మొత్తం చదివాను. ప్రతిరోజు నా దైనందిన దినచర్య పూర్తి అయిన తరువాత, లేఖలను చదువుతూ ఉండేదాన్ని. రమణ మహర్షి గారి జీవిత వైభవం, ఆ సబ్జెక్టు నా మనసుని బాగా హత్తుకుని, చాలా ఆనందం అనిపించింది.
మేము అరుణాచలం వెళ్ళి వచ్చిన రెండు సంవత్సరాలకి నా భర్తని , అకస్మిక మరణంతో అరుణాచలేశ్వరుడు తీసుకు వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయారు అని కబురు తెలిసి మేము నా భర్త పనిచేసే నర్సింగ్ హోమ్ కి వెళ్ళాము. అక్కడ అయన దేహాన్ని చూడగానే, ఆయన హృదయం పైన నా తలని పెట్టుకోగానే నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. మా అన్నయ్య నన్ను పిలవగానే నాకు మెలకువ వచ్చి, భర్త చనిపోతే నిద్ర వస్తుందా! అనే సందేహం వచ్చింది కానీ, ఆ సందేహాన్ని నివృత్తి చేసేవారు లేరు. నా భర్త చనిపోయిన తరువాత ఎందుకో తెలియదు కానీ నాకు కలగవలసిన అంత దుఃఖం కలుగలేదు. భగవంతుడు దగ్గర మాత్రమే నాకు తెలియకుండా కన్నీరు వచ్చేసేది. ఆయన చనిపోయిన రెండు నెలలకు ఆయన పని చేసే హాస్పటల్ లోనే నాకు ఉద్యోగం వచ్చింది. భవిష్యత్తులో బిడ్డలు జీవితం వారికి ఏర్పడుతుంది కాబట్టి మనం ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థని పట్టుకొని ఉండాలి అనిపించి, అవకాశం ఉన్నప్పుడల్లా చాలా పుస్తకాలు చదివి, చాలా ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టూ తిరిగాను. నా భర్త చనిపోయిన సంవత్సరానికి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అరుణాచలం వెళ్ళాము. అక్కడ 'అరుణాచలేశ్వరుడిని చూడగానే గోలక్ష్మి తన సంతానాన్ని తీసుకువచ్చి భగవాన్ ఎదుట ఉంచి నీదే భారం అని భగవాన్ ఎదుట బోర్లాసాచి పడుకుంటుంది. ఈ వాక్యం లేఖలలో ఉంటుంది. అది నా మనసుకు స్ఫురించి, అరుణాచలేశ్వర గిరి వైపు చూస్తూ నా బిడ్డలను తీసుకువచ్చి నీకు అప్పజెప్పాను. నీదే భారం అనుకొని నేను తల్లి వేషం వేస్తాను. నువ్వే చూసుకో అని ఆయనకు అప్పగించేసాను'. అరుణాచలం నుండి తిరిగి వచ్చేస్తుంటే, ఆ గిరిని వదిలి వస్తూ ఉంటే, ఎప్పటి నుండో నా మదిలో దాగి ఉన్న దుఃఖం అంతా కట్టలు తెంచుకుని వచ్చేసింది. బస్సులో కూర్చుని ఆ గిరి వైపు చూస్తూ ఉంటే, తల్లిదండ్రులు తమ కూతురు అత్తవారి ఇంటికి వెళుతూ ఉంటే కన్నీటితో సాగనంపుతారు కదా! అదేవిధంగా గిరి కూడా నా కోసం కన్నీరు పెట్టుకుంటూ నన్ను సాగనంపుతున్నట్టు అనిపించింది. 'తండ్రి నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు. నేను నీ దగ్గరకు రావాలంటే చాలా సమయం పడుతుంది. నిన్ను విడిచి ఉండలేను. ఎలా నీ దగ్గరికి రాగలను అంటూ దుఃఖ పడుతూ ఉన్న సమయంలో మా అమ్మగారు రమణ మహర్షి గారి శిష్యులు 'నాన్నగారు' అని ఒకరు జీవించే ఉన్నారట ఆయనతో మనము సాన్నిత్యం పెంచుకోవాలి అని నాకు చెప్పారు.

మా అమ్మగారు మరియు నాన్నగారు భక్తురాలైన ఝాన్సీగారి తల్లిగారు అనుకోకుండా కలవటం, వారి మాటల మధ్యలో మా అమ్మాయి నాన్నగారు దగ్గరకు వెళుతుంది అని చెప్పటం అలా నాన్నగారు భక్తురాలైన ఝాన్సీగారు ద్వారా నాన్నగారు మా జీవితంలోకి ప్రవేశించారు. ఝాన్సీగారి ఇల్లు నేను పనిచేసే ఆఫీస్ కి దగ్గరగా ఉండటం వలన ఒకసారి వెళ్ళాను. ఝాన్సీ గారు నాకు ఒక అరడజను క్యాసెట్లు, రమణ సంభాషణలు అనే పుస్తకాన్ని కూడా ఇచ్చి, ఇవి చదువుతూ ఉండండి నాన్నగారు వచ్చినప్పుడు మీకు చెబుతాను దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకరోజు ఝాన్సీగారు ఫోన్ చేసి, ఫలానా చోటికి నాన్నగారు వస్తున్నారు అని నన్ను రమ్మని చెప్పారు. నా ఆఫీసు అయిపోయిన తరువాత మధ్యాహ్నం నుండి ఝాన్సీ గారు చెప్పిన అడ్రస్ కి వెళ్ళాను. అక్కడ కొంతమంది భక్తులు పువ్వులు కడుతున్నారు. భానుగారి పద్మ గారు సత్సంగం చెబుతున్నారు. ఆ మాటలు విని ఎంత అద్భుతంగా చెప్తున్నారో అని నాకు చాలా ఆనందం అనిపించింది. మా అమ్మాయి కాలేజ్ నుండి ఇంటికి వచ్చే సమయం అయినందువలన ఈ రోజుకి నాన్నగారు దర్శనం నాకు కలగదు ఏమో! అనుకొని, ఝాన్సీగారితో నేను బయలుదేరుతాను అండి అని చెప్పాను. అప్పుడు ఆమె మొదటిసారి వచ్చి నాన్నగారి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తారు అని, నన్ను నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళి, ఈమెకు ఈ మధ్యనే భర్త చనిపోయారు నాన్నగారు అని చెప్పారు. అప్పుడు నాన్నగారికి నాకు సంభాషణ ఈ విధంగా కొనసాగింది:

నాన్నగారు : ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
భక్తురాలు (రాజేశ్వరిగారు) : (అప్పటికే మా అబ్బాయి చదువుకి కొంచెం ఇబ్బంది ఉంది అని మనసులో మెదులుతూ ఉన్నా అందరి ముందు చెప్పలేక) 'భగవంతుడి దయవలన ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు నాన్నగారు'.
నాన్నగారు : 'అలాగా!'
నాన్నగారిని చూడటం అది మొదటిసారే అయినప్పటికీ, నాన్నగారు 'అలాగా' అనేసరికి నా మనసుకి "నీకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు అని నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది".
భక్తురాలు (రాజేశ్వరి గారు) : నాన్నగారు! నా భర్త చనిపోయినప్పుడు, ఆయన దేహం మీద నా తలవాల్చుకోగానే, నాకు మౌనం వచ్చేసింది. (అని నాకు తెలియకుండానే నాన్నగారితో చెప్పేసాను).
నాన్నగారు : కొద్ది క్షణాలు మౌనంగా ఉండి, 'నువ్వు తరిస్తావు' అమ్మా!
భక్తురాలు (రాజేశ్వరిగారు) : నాకు భృకుటి లో ఏదో తెలుస్తోంది అది మనస్సేనా?
నాన్నగారు : 'అవును' మనస్సే అమ్మా.
భక్తురాలు (రాజేశ్వరి గారు) : నాన్నగారు! భృకుటి మీద దృష్టి నిలపవచ్చా?
నాన్నగారు : నీ ఇష్టం అమ్మ! నీకు ఎక్కడ భావుంటే అక్కడ దృష్టి నిలుపు.
భక్తురాలు (రాజేశ్వరి గారు) : భృకుటి మీద ధ్యాస పెడితే మహిమలు వస్తాయి అంటారు కదా! నాన్నగారు.
నాన్నగారు : 'ఆ మహిమలు గొడవ మనకి ఎందుకమ్మా!'
నాన్నగారు నన్ను తరిస్తావు అమ్మ అని ఆశీర్వదించారు అని నాకు పట్టరాని ఆనందం వచ్చేసింది. ఆ తరువాత నాకు నేను ఇన్ని రోజులు ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థలో స్థిరపడాలని చాలా ఆధ్యాత్మిక కేంద్రాలు చుట్టూ తిరిగాను, అలా ఎందుకు తిరిగాను అంటే! 'నాన్నగారి ఆశీర్వచనం పొందటం కోసం తిరిగాను' అని అర్థమయ్యి, "ఆధ్యాత్మిక కేంద్రాన్ని పట్టుకుని తిరగడం నా లక్ష్యం కాదు. నేను తరించటమే నా జీవిత లక్ష్యం అని నాకు అవగతమైంది". అలాగే నాకు ఏమి కావాలో నా కంటే ఎక్కువ ఈయనకే తెలిసింది కాబట్టి 'నాన్నగారే నా భౌతికమైన గురువు' అని ఆ రోజు నాకు అర్థం అయింది.

నాకు ఆఫీసు ఉండటం వలన ఎక్కువ సత్సంగానికి వెళ్ళటం కుదిరేది కాదు. అవకాశం ఉన్నప్పుడు మాత్రము సోమవారం ఎస్ ఆర్ నగర్ లో సత్సంగానికి వెళుతూ ఉండేదాన్ని. తరువాత నాన్నగారు ఒకసారి శ్రీనగర్ కాలని వచ్చినప్పుడు, ఆఫీసులో ఒక గంట పర్మిషన్ తీసుకుని - ఉదయాన్నే నాన్నగారి దగ్గరకు వచ్చాను. నేను వచ్చేసరికి హాలంతా భక్తులతో నిండిపోయి ఉంది. నేను తిరిగి ఆఫీస్ కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నాన్నగారికి కనిపించే లాగా బయట కూర్చుని ఉన్నాను. నాన్నగారు చెబుతూ ఉంటే ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుతారు అనుకున్నాను కానీ, ప్రవచనం చెబుతున్నారని అప్పటికి నాకు తెలియదు. ఆరోజు నాన్నగారి ప్రవచనం వింటుంటే! చాలా అద్భుతంగా అనిపించి, నా మనసు బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఆఫీస్ కి వెళ్ళే సమయం అవ్వటం వలన ప్రవచనం వదిలి వెళ్ళవలసి వస్తోంది అని దుఃఖం వస్తూ, ఒకవైపు ఆఫీసు ఉండటం మరియు పిల్లల బాధ్యతలు వలన అందరిలా నాకు నాన్నగారి దగ్గరకు రావటం కుదరటంలేదు. ఎంత దౌర్భాగ్యమైనది నా ఈ జన్మ, అంత అద్భుతమైన సబ్జెక్ట్ ని వినటానికి అవకాశం లేని జన్మ కదా! అని దుఃఖిస్తూ లేచి నిలబడ్డాను. అప్పుడు నాన్నగారు 'వారం రోజులు నీతో ఉండే గురువుని నువ్వు ఏమి పట్టుకుంటావు? హృదయంలో నిరంతరం ఉండే గురువుని పట్టుకో అని చెప్పారు'. నాన్నగారు ఆ వాక్యం చెప్పగానే నా హృదయానికి బాగా హత్తుకొని అప్పటిదాకా ఉన్న దుఃఖం అంతా ఆనందం కింద మారిపోయి ఆఫీస్ కి వెళ్ళటానికి బయలుదేరాను. ఒకసారి నా స్నేహితురాలు Retirement తీసుకున్నారు. అప్పుడు ఆమెతో మీరు రిటైర్ అయిపోతున్నారు కదా! రేపటి నుండి ఎస్సార్ నగర్ సత్సంగానికి వెళుతూ ఉండవచ్చు అన్నాను. ఆ తర్వాత రోజు ఇద్దరం కలిసి ఎస్.ఆర్.నగర్ వెళ్ళాము. అక్కడ నాన్నగారు అంతకు ముందు రోజే జిన్నూరు వెళ్ళిపోయారు అని తెలిసింది. ఆ మాట వినగానే నాన్నగారిని చూసే అర్హత నాకు లేదా? అని చాలా దుఃఖం వచ్చేసింది. తరువాత అనుకోకుండా మేము అరుణాచలం వెళ్ళాము. అక్కడికి నాన్నగారు వస్తున్నట్లు మాకు తెలియదు. కానీ నాన్నగారు దర్శన భాగ్యం మాకు అరుణాచలంలో కలిగింది. నాన్నగారిని మా బాబు,పాప అరుణాచలంలోనే మొదటిసారి దర్శనం చేసుకున్నారు. నాన్నగారు హైదరాబాద్ వస్తుంటే, నాకు తెలియటం లేదు. నాన్నగారు భక్తులలో ఎవరో ఒకరిద్దరితో పరిచయం ఏర్పడితే నాన్నగారు వచ్చినప్పుడు చెబుతారు కదా! అనుకొని ప్రత్యేకించి వారితో మాట్లాడి, నాన్నగారు వచ్చినప్పుడు చెప్పమనేదాన్ని. వారు చాలా శ్రద్ధగా నాన్నగారు వచ్చినప్పుడల్లా నాకు చెబుతూ ఉండేవారు. అప్పటినుండి నాన్నగారు హైదరాబాదు వచ్చిన ప్రతీసారి తరచూ వస్తూ ఉండేదాన్ని.

తరువాత ఒక ఐదు సంవత్సరాలకి నాకు అనారోగ్యం వచ్చింది. అప్పటికే మా పిల్లలు ఇద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందువల్ల నేను నా ఉద్యోగానికి సెలవు పెట్టేసాను. అదే సమయంలో నాన్నగారు ప్రతి రెండు నెలలకు ఒకసారి హైదరాబాదు నాకోసమే వస్తున్నట్టు వచ్చి, పది రోజులు ఉండేవారు. నాకు నాన్నగారు అంటే ఇష్టం వలన మా పిల్లలు కూడా నాన్నగారి దగ్గరకు వెళ్తానంటే ఏమీ అనేవారు కాదు. అందువలన నాన్నగారు ఉన్న పది రోజులు కూడా ఉదయాన్నే వచ్చేసి, సాయంత్రం వరకు ఉండేదాన్ని. నాన్నగారు చెప్పే ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉండేవి. నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోయిన తరువాత కూడా ప్రతి సోమవారం ఎస్సార్ నగర్ సత్సంగానికి తప్పకుండా వెళ్ళేదాన్ని. ఆ సత్సంగాలకి క్రమం తప్పకుండా వెళ్ళటం వలన నాకు ఆ వాక్యాలు విలువ తెలియటం మొదలైంది.

ఒకసారి సత్సంగంలో 'లౌకికులు మన ఇంటికి వస్తే వారితో మీరు ఏమీ మాట్లాడకుండా, మీకు ఏమైనా పని ఉంటే చేసుకుంటూ ఉండండి అని వారితో ఎలా ప్రవర్తించాలో చెప్పారు'. ఆ వాక్యం వినగానే, వారితో అలా ప్రవర్తించాలా అనుకుంది నా మనసు. అదే వారంలో మా ఇంటికి లౌకికులు రావటం జరిగింది. నాకు ముందు నుండి వారితో మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మంచితనంలో చిన్న పిరికితనం ఉంటుంది కదా! ఆ పిరికితనం వలన వారిని భరిస్తూ వచ్చేదాన్ని. ఆ వారంలో వారు వచ్చినప్పుడు నాన్నగారి వాక్యం నా హృదయంలో వారితో ఎలా ప్రవర్తించాలి అనేది స్ఫురించి, వారికి మర్యాద చేయవలసింది చేసి, మౌనంగా కూర్చుని ఉన్నాను. వారు కూడా ఒక గంట కూర్చుని మాకు కూడా పని ఉంది వెళ్ళి వస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఏమీ మాట్లాడలేదు అని, వారికి నా మీద కోపం రాలేదు. ఆ సంఘటన నాకు చాలా వింతగా అనిపించింది. అలా నా జీవితంలో నాన్నగారి వాక్యాన్ని పట్టుకొని జీవించటం ప్రారంభమయింది. అప్పుడు 'నాకు మనకు అవసరమైనప్పుడు గురువు వాక్యం రూపంలో మన దగ్గరకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు అనిపించింది'.

మరొక సారి సత్సంగానికి వెళ్ళినప్పుడు 'బంధువులలో బంధువై ఉండు, స్నేహితులలో స్నేహితురాలివై ఉండు అని చెప్పారు'. ఈరోజు ఇలా చెప్తున్నారు ఏమిటి అనుకుని ఇంటికి వచ్చేసాను. తరువాత నాలుగు రోజులకి బంధువులు వచ్చారు. వారు రాగానే, నాన్నగారు చెప్పిన బంధువులలో బంధువై ఉండు అనే వాక్యం స్ఫురించి, వారికి నచ్చినట్టు ప్రవర్తించి వారిని పంపించేసాను. అలా నెమ్మదిగా వాక్యం పట్టుకొని జీవించటం మొదలయ్యింది.వాక్యాన్ని ఆచరణలో పెడుతూ ఉంటే, నాకు చాలా ఆనందం అనిపించేది. అప్పటినుండి వాక్యాలు విలువ నాకు అర్ధమయ్యి, ప్రతిరోజు నాన్నగారు ప్రవచనం వింటూ ఉండేదాన్ని.

నా స్నహితురాలు అయిన స్వర్ణ భర్త చనిపోయారు. నేను అరుణాచలం వెళ్ళేసరికి ఆమె కూడా అరుణాచలంలోనే ఉన్నారు. ఆమె చాలా భక్తి కలవారు అని నాకు ముందుగానే తెలుసు. ఆమె నన్ను అరుణాచలంలో చూసి గట్టిగా పట్టుకొని దుఃఖపడ్డారు అదే సమయంలో నాన్నగారు కూడా అరుణాచలంలోనే ఉన్నారు కానీ ఆమెని నేను కలిసే సమయానికి నాన్నగారు రెస్ట్ లోకి వెళ్ళిపోయారు. అందువలన ఒక్కసారి మీరు రేపు నాన్నగారి దర్శనం చేసుకోండి మీకు దుఃఖం అంతా నశిస్తుంది అని చెప్పాను. కానీ ఆమె మరుసటి రోజు బెంగుళూరు వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ తరువాత నాన్నగారు హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆమెకు చెబితే వచ్చి నాన్నగారిని దర్శనం చేసుకున్నారు. నాన్నగారు పాదాలు పట్టుకోగానే ఆమెకు చాలా శాంతి వచ్చేసింది. నాన్నగారు కూడా ఆమెను ఎదురు వెళ్ళి పలకరించి చాలా శ్రద్ధగా వస్తున్నావు అమ్మ అనేవారు. తరువాత నాన్నగారు హైదరాబాద్ నుండి శ్రీశైలం బయలుదేరేరుతున్నారు. అదే సమయంలో ఒక భక్తుడు వచ్చి, 'True Love' గురించి అడిగారు. ఆ ప్రశ్న వినగానే నాన్నగారు ఇది చెప్పటానికి ఒక రోజు సమయం పడుతుంది అని True Love గురించి రామకృష్ణుడిని ఉదహరిస్తూ చాలా అద్భుతంగా చెప్పారు. అప్పుడు రామకృష్ణుడు గురించి చెప్పటం మొదలు పెట్టి, ఆ తరువాత రెండు మూడు సంవత్సరాలు నాన్నగారు రామకృష్ణుడు గురించి చెబుతూ రామకృష్ణుడు అయిపోయారు. నాన్నగారు ఆ True Love గురించి చెబుతూ, అనుగ్రహం వర్షం కురిపించేసారు. అప్పుడు నా మనసును అంతర్ముఖము అయ్యి, నాన్నగారి అనుగ్రహ వర్షంలో తడవటం అనేది అదే మొదటిసారి. నాన్నగారు లేచి లోపలికి వెళ్ళి పోయినా నేను కళ్ళు తెరవలేకపోయాను. ఆరోజు నాన్నగారు అంటే ఏమిటో నాకు అనుభవంలోకి వచ్చింది.

నాన్నగారు శ్రీశైలం నుండి వచ్చిన తరువాత వేరే చోటికి వెళుతున్నారు అని నా స్నేహితురాలు అయిన స్వర్ణ గారితో కలిసి వెళ్ళాను. అక్కడ నాన్నగారు ఆమెను చూసి చాలా చనువుగా పలకరించారు. నాన్నగారు అలా ఆమెను పలకరించగానే, నేను నాన్నగారి దగ్గరకు వచ్చి ఆరు సంవత్సరాలు అయింది కానీ, నన్ను ఎన్నడూ ఇలా పలకరించలేదు అనుకున్నాను. తరువాత నాన్నగారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుడా అదేవిధంగా ఆమెని పలకరించారు. తరువాత మేము ఇద్దరం బయటకి వచ్చినప్పుడు ఆమెను మీకు జ్ఞానం వచ్చింది కదా! అని అడిగాను. ఆమె మౌనంగా ఒక చిరునవ్వు నవ్వారు. వెంటనే ఆమె పాదాలకు నమస్కరించి నన్ను కూడా అనుగ్రహించండి అన్నాను. అలాంటిది ఏమీ లేదు రాజేశ్వరి అన్నారు.

'రామకృష్ణుడు వివేకానందుడుని చూడగానే, వీడికి జ్ఞానం వచ్చేసింది అని తెలిసిపోయింది. అలాగే నా స్నేహితురాలికి జ్ఞానం వచ్చినట్టు నాన్నగారికి తెలిసిపోయింది కాబట్టి, నాన్నగారు రామకృష్ణుడే అన్నమాట అని అర్థమయింది. నాకు చిన్నప్పటినుండి రామకృష్ణుడు అంటే చాలా ఇష్టం. మా అమ్మగారు కూడా మా చిన్నప్పుడు రామకృష్ణుడు గురించి చెప్పేవారు, అలాగే రామకృష్ణడి జీవిత సంగ్రహం కూడా చదివాను.

'ముందురోజు నాన్నగారు True Love గురించి చెబుతూ, రామకృష్ణుడిని ఉదహరించారు. అప్పుడే నా మనసు అంతర్ముఖము అయ్యింది. తర్వాత రోజు నా స్నేహితురాలు స్థాయి నాన్నగారికి తెలిసింది కాబట్టి నా గురువు రామకృష్ణుడు అనుకొని నాన్నగారు, రామకృష్ణుడు ఒక్కరే అని బాగా నిర్ధారణకు రావటం జరిగింది'. ఆ తరువాత నుండి నెమ్మదిగా నాన్నగారు అంటే ఏమిటి అనేది నాకు బాగా అర్థమవుతూ ఉండేది. అప్పటినుండి నాన్నగారు అంటే ఇష్టం వచ్చి, బాగా చనువు ఏర్పడి, సబ్జెక్ట్ లో ఏ సందేహం వచ్చినా, నాన్నగారిని అడగటం మొదలుపెట్టాను.

నాన్నగారిని ఏ సందేహం వచ్చి అడిగినా, అలా కళ్ళల్లోకి చూస్తూ రెండేసి గంటలు చెప్పేవారు. నా భర్త పోయిన తరువాత భగవద్గీతలో శ్లోకాలు కాకుండా దాని తాత్పర్యం ఎక్కువ చదివేదాన్ని. అందువలన భగవద్గీత పట్ల బాగా ఇష్టం ఏర్పడింది. అందులో 'ఫలితం నీ చేతిలో లేదు, నా మీద భారం వెయ్యి' అనే వాక్యాలు బాగా మనసుకి హత్తుకునేవి. భగవద్గీతలో ఉన్న సంశయాలు అన్నీ నాన్నగారిని అడుగుతూ ఉండేదాన్ని.

నాన్నగారు ప్రవచనం వినే ముందు ప్రతి రోజూ విష్ణు సహస్రనామాలు వినేదాన్ని. అందులో 'శ్రీరామ రామ రామేతి మనోరమే' అనే శ్లోకం మూడుసార్లు చదువుతారు. ఆ శ్లోకం మూడుసార్లు చదవటానికి ఒక 90 సెకన్లు సమయంపడుతుంది. నాన్నగారు చచ్చిపోయినట్టు జీవించమన్నారు కదా! అని ఆ 90 సెకన్లు అలా ఉండటానికి ప్రయత్నించేదాన్ని. కానీ, నాన్నగారు ఆ సమయంలోనే ఎక్కువ పరీక్షలు పెట్టేవారు. అదే సమయంలో బయటినుండి ఎవరో ఒకరు వచ్చి తలుపు కొట్టేవారు. మొదట్లో రియాక్ట్ అయ్యిపోయేదాన్ని కానీ చనిపోయిన వాడికి రియాక్షన్ ఉండదు కదా! అని బాహ్య సంఘటనలకు రియాక్ట్ అవ్వడం మానేసాను. కానీ లోపల తలంపులు మాత్రం నిరవధికంగా వస్తూనే ఉండేవి. నాకు ఆ తలంపులు అన్నీ తగ్గి కేవలం ఆ 'నామంతోనే ఏకాగ్రంగా తాధాప్యం పొందటానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది'. నాన్నగారు చనిపోమంటున్నారు ఈ సమయానికి చనిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా అనుకొని ప్రతిరోజూ ఆ 90 సెకన్లు అలా అభ్యాసం చేయించారు. అలా నాన్నగారు వాక్యంలో నన్ను జీవించేటట్లు చేశారు.

ఒకసారి నాన్నగారు హైదరాబాదు నుండి వెళుతూ, ఈ హోలీ కంపెనీలో ఒకే ఒక మైనస్ పాయింట్ ఉంది. అది ఏమిటంటే, విడిపోయేటప్పుడు దుఃఖం వస్తుంది అన్నారు. నాన్నగారు దేహం జిన్నూరు వెళ్ళి పోయినా, హృదయంలో గురువు ఉన్నారు కదా! హృదయంలో ఉన్న గురువుని పట్టుకుందాము అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోతుంటే, నాంపల్లి స్టేషన్ కు వెళ్ళాను. నాన్నగారు ట్రైన్ ఎక్కే సమయానికి నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోతున్నారు రేపటినుండి మనకు దర్శనాలు ఉండవు అనే తలంపు వచ్చి, నాకు చాలా దుఃఖం వచ్చేసింది. మరొకవైపు హృదయంలో ఉన్న గురువుని పట్టుకుంటాను అన్నావు కదా! అని నాన్నగారు లోపల నుండి స్పురింప చేస్తున్నారు. ఒకవైపు దుఃఖం వస్తు ఉంది, మరొకవైపు వాక్యం స్పురిస్తూ ఉంది. నువ్వు హృదయంలో ఉన్న గురువుని పట్టుకోగలవా? అని నాన్నగారు నన్ను గట్టిగా అడిగినట్లు నా మనసుకి అనిపించింది. ఒక మూడు నిమిషాల తరువాత నాన్నగారు ట్రైన్ గుమ్మం దగ్గర కళ్లుమూసుకుని నిలబడ్డారు, నాకు కూడా కళ్ళు మూసుకో అని హృదయంలో నుండి స్పురింప చేసి, ఒక్క నిమిషం మనస్సును అంతర్ముఖం చేశారు. అప్పుడు పూర్తిగా దుఃఖం నశించి, మన తెలివితేటలు, సబ్జెక్ట్ జ్ఞాపకాలతో దుఃఖం ఆగదు గురువు దయతో మాత్రమే దుఖం ఆగుతుంది అని ఆ సంఘటన నాకు జీవితానికి సరిపడా గుణపాఠం నేర్పించి అప్పటి నుండి మనసు శరణాగతి చెందటం మొదలుపెట్టింది.

సత్సంగానికి వెళ్ళేసరికి, ఆ వారంలో నాకు వచ్చే పరీక్షలకి సమాధానాలు ముందుగానే వచ్చేసేవి. అందువలన నాకు పరీక్షాసమయం వచ్చేసరికి, గురువు దయవలన ఆ వాక్యం స్పురణకు వచ్చి, దానిని ఆచరణలో పెట్టించేసేవారు. అలా నిత్యజీవితంలో వాక్యాన్ని అనుసంధానం చేసుకొని జీవించటానికి బాగా ఉపయోగపడింది. గురువు దయవలన ఏ సమయానికి ఏ వాక్యం అవసరమో, అది స్పురణకు వచ్చేది. అంతేకాకుండా! ఆ వాక్యాన్ని ఆచరించే శక్తి కూడా గురువే ఇచ్చేవారు. ఆచరించిన తరువాత దానికి ఫలితంగా శాంతియుత పరిష్కారం లభించేది. అలా 'నెమ్మదిగా నాన్నగారు శక్తిని, ప్రేమని నా మనసు చాలా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది'.

మా అమ్మాయి పెళ్ళికి అంతా నాన్నగారే చూశారు, నాన్నగారు ఎస్ అంటేనే సంబంధం ఖాయం చేశాము. ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చేస్తుంటే, నేను, నాన్నగారు మాత్రమే అరుగు మీద ఉన్నాము. అప్పుడు నన్ను నాన్నగారు నువ్వు సబ్జెక్ట్ చెప్తావా? అని అడిగారు. నేను నోటితో సమాధానం చెప్పకుండా, తల అడ్డంగా చెప్పను అని ఊపాను. ఎందుకు చెప్పను అన్నాను అంటే, నాకు అక్కడ రెండు వాక్యాలు గుర్తుకు వచ్చాయి.

మొదటది : ప్రతి ఒక్కరికి హృదయంలో ఈశ్వరుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఈమధ్య వర్తిత్వం ఎందుకు అంటారు భగవాన్. అది నేను సూరి నాగమ్మగారి లేఖలు లో చదివాను.
రెండవది : ఇతరులు ఎవరున్నారు బోధించడానికి అని కూడా అంటారు భగవాన్. ఈ రెండు వాక్యాలు నాకు అక్కడ గుర్తుకు వచ్చాయి. అందుకని నేను చెప్పను అని తల అడ్డంగా ఊపాను. నాన్నగారు కూడా ఏమీ మాట్లాడలేదు. మా అమ్మాయి వివాహం అయిపోయింది. నిజంగా చెప్పాలి అంటే, అమ్మాయి వివాహం రోజున నాకు నేను లేదు. మర్నాడు నాకు నేను వచ్చిన తరువాత తెలిసింది నిన్న నాకు నేను లేను అని. ఇదంతా గురువు దయ అని నాకు చాలా స్పష్టంగా తెలిసింది. ఈ సంఘటనతో నాన్నగారి మీద నాకు విపరీతమైన నమ్మకం వచ్చేసింది. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, దయామయుడు ఇవి అన్నీ నాకు అనుభవంలోకి వచ్చి ఆయన మీద ఉన్న విశ్వాసం నెమ్మదిగా బలపడుతోంది
అమ్మాయి వివాహం అయ్యి వెళ్ళిపోయిన తర్వాత తన ఫోటో చూస్తూ, ధారలుగా కన్నీరు కారుస్తూ ఉండేదాన్ని. మనసులో చాలా బెంగగా ఉండేది. నాకు తెలియకుండానే మా అమ్మాయి మీద ఇంత మమకారం ఉందా అని నాకే ఆశ్చర్యం వేస్తూ ఉండేది. ఈలోపు అదృష్టవశాత్తూ నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. వెంటనే, నాన్నగారు దగ్గరకు వెళ్ళిపోయి, 'పాప పెళ్లి అయ్యి వెళ్లిపోయింది కదా! మమకారంతో చాలా దుఃఖం వచ్చేస్తోంది నాన్నగారు అని చెప్పి, నన్ను మామకారం నుంచి విడుదల చేయండి నాన్నగారు అని అడిగేసాను. వెంటనే, నాన్నగారు పెద్ద నవ్వు నవ్వి రెండు చేతులు పైకిపెట్టి ఆశీర్వదించి, అలాగే అన్నట్టుగా సంకేతం ఇచ్చారు". నా బలహీనత లో నుండి నన్ను విడుదల చేయమని అడిగితే నాన్నగారు ఇంతగా ఆనంద పడతారా అనిపించి, నాన్నగారిని ఇలా అడగవచ్చు అని నాకు ఒక దారి దొరికినట్టు అయ్యింది. ఇంటికి వచ్చేసిన తరువాత దుఃఖం ఎక్కువ అయిపోయింది. అమ్మాయి ఫోటో చూడటం ఏడవటం ఇదే జరుగుతోంది. నన్ను ఇలా ఏడిపిస్తూ ఆ బలహీనతలో నుండి విడుదల చేస్తున్నారు అనే స్ఫురణని కూడా నాన్నగారు కలిగించారు. ఒక వారం రోజులకి నాన్నగారు జిన్నూరు వెళ్ళిపోయారు. ఆ తరువాత నుండి నాకు కన్నీళ్ళు రాలేదు. ఫోటో చూడాలి అనిపించలేదు. అప్పుడు నాకు అర్థం అయ్యి, నాన్నగారు మమకారపు దుఃఖం నుండి నన్ను విడుదల చేసారు అని అనుభవంలో తెలిసింది. అప్పటి నుండి నాలో ఉన్న బలహీనతలని చూసుకొని నాన్నగారిని విడుదల చేయమని అడగేదాన్ని అలా 'ప్రార్థనే మన సాధన' అని అర్థమయింది. అక్కడ నుండి వాలు గాలిలో సైకిల్ తొక్కినట్టు అయింది. రాగం లోంచి, ద్వేషం లోంచి, భయం లోంచి, మమకారం లోంచి ఇంకా అన్నిటిలో నుంచి ఏది ఉంటే అది చూసుకొని, నాన్నగారిని ప్రార్థించే దాన్ని. నాన్నగారు ఒకసారి నేను పళ్ళు ఇవ్వడానికి వెళ్తే నన్నుఅక్కడే నిలబెట్టి పక్కవారితో రామకృష్ణుడు వివేకానందుడుని బోధించమని చెబితే,నేను భోదించను అని చెప్పాడు అప్పుడు నువ్వు బోధించకపోతే నీ ఎముకలు బోధిస్తాయి అని అన్నాడు అని నాన్నగారు చెబుతున్నారు. ఆ మాట వినగానే, ఏంటి! నన్నే అంటున్నారా అనిపించింది నాకు. వెంటనే నా బుద్ధి నీకు పొగరెక్కిందా! ఆయన వివేకానందుడి గురించి చెప్తున్నారు వాళ్లతో నిన్ను నువ్వు పోల్చు కొంటావా! ఆని నా బుద్ధి నన్ను తిట్టింది. ఊరుకున్నాను. నాన్నగారు అదే మాటను మరలా 3 సార్లు చెప్పారు. అలా చెప్పేసరికి నన్నే అంటున్నారు అని అనుకుంటున్నాను. అవును, నిన్నే అని నాకు సంకేతము ఇచ్చినట్టుగా నాన్నగారు నా చేతిలో ఉన్న పండ్లని తీసుకున్నారు. అప్పుడు ఆ మాట నన్నే అంటున్నారు అని అర్థమైయ్యి, అప్పుడు నాకు విపరీతమైన స్ట్రగుల్ వచ్చేసింది. నా భర్త మరణింతో నేను ఇంటాబయటా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. నన్ను సబ్జెక్టు చెప్పమంటారు ఏమిటి? అనుకొని, నా మనసులో చాలా తిట్టుకున్నాను. పూర్వం ఒకసారి మెడిటేషన్ చేస్తే నా మనసు అరెస్టయింది అది దృష్టిలో పెట్టుకుని మెడిటేషన్ లోనే మనస్సు అరెస్ట్ అవుతుంది అనే అపోహ నాకు అప్పట్లో ఉండేది. పని చేసుకుని ఒక గంట కళ్ళు మూసుకుని కూర్చొవటానికే నాకు సమయం సరిపోవడం లేదు, నన్ను రాయమంటారు ఏమిటి, నన్ను చెప్పమంటారు ఏమిటి అని నా మనసు చాలా ఎదురు తిరిగింది. ఎంత పోరాటం అంటే 30 గంటలు చాలా స్ట్రగుల్ అయ్యాను. నా బుద్ధి ఎమో ఒకవైపు, మనసుని శరణాగతి చేశాను అంటున్నావు గురువు మాట వినవా? అని నన్ను అంటోంది. గురువు దయ ఉంటే! మన మనసులో ఉన్న వాసనలు ఏ పాటివి, చివరకి ఒక చిన్న పుస్తకంలో నాలుగు మాటలు రాసుకొని వెళ్ళాను. నాన్నగారు వచ్చి నా ముందు మౌనంగా రెండు నిమిషాలు నిలబడ్డారు అలా నాకు శక్తిని ఇచ్చానట్టు అనిపించింది. ఆ తరువాత నుండి మరలా ఎప్పుడూ రాయటం మానలేదు. మరునాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు ధ్యానంలో కూర్చుంటే నా ప్రయత్నం లేకుండానే నా మనసు అరెస్టయింది. 'నువ్వు రాయడం మూలంగానే ఈ స్థితి వచ్చింది అని నాకు స్పురింప చేశారు నాన్నగారు'. "అప్పుడు తండ్రి! నన్ను భాగు చెయ్యటం కోసం నాతో ఎన్ని తిట్లు తిన్నావు అనుకొని, బాగా దుఃఖం వచ్చేసింది. అప్పటినుండి పూర్ణ శరణాగతి చేశాను".

మా బాబుకి దుబాయిలో జాబ్ వచ్చింది వెళ్ళిపోయాడు. అప్పుడు నాన్నగారు, అమ్మా! ఇప్పుడు నీకు ఏకాంతంగా ఉండటానికి అవకాశం వచ్చింది. కాలాన్ని సద్వినియోగం చేసుకో, సత్సంగాలకు వెళ్ళు, కాఫీ దొరకలేదని ఏండ్రిన్ తాగము కదా! ప్రసంగాలు దొరకకపోతే లౌకికంలోకి వెళ్ళకు, భగవంతుడు కాల రూపంలో ఉన్నాడు అని నాన్నగారు వేలు పెట్టి నన్ను చూపించి చెప్పారు.నాన్నగారు అలా చెప్పగానే లోపల నుండి నా ప్రయత్నం లేకుండానే కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా అనుగ్రహించు తండ్రి, నా ప్రయత్నంతోనే అవ్వదు,నీ అనుగ్రహంతోనే అవ్వాలి అని ప్రార్థన వచ్చింది.

సత్సంగం చెప్పడానికి వెళ్ళాలి, సత్సంగం వినటానికి వెళ్ళాలి, సత్సంగం రాయడానికి వెళ్ళాలి, హృదయంలో సత్సంగం చేయాలి, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి ఇలా ఐదు రకాల సత్సంగాలు. నాన్నగారు చెప్పిన సబ్జెక్టు రాస్తే, ఎవరో ఒకరు భక్తులు వచ్చి మీరు సబ్జెక్టు రాశారు అంట కదా! ఒకసారి చదవండి అని అడిగేవారు, అలా రోజూ ఎవరో ఒకరు అడిగేవారు. వారందరికీ చదివి వినిపించడంలో సబ్జెక్ట్ నాకు మననం అయిపోయేది. అలా మెల్లగా నాకు తెలియకుండానే నాన్నగారు నాకు టీచింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు. తరువాత ఉదయాన్నే నాన్నగారు ఈ రోజు నన్ను ఏమి సాధన చేసుకోమంటారు,అని మనసులో నాన్నగారిని అడిగి, ఉపన్యాసం పెట్టుకునేదాన్ని. నువ్వు గతంలోకి వెళ్ళి, మనసుకు పుండు చేసుకోకు అని ఒక రోజు, నిన్ను నువ్వు పొగుడుకోకు అని ఒకరోజు, ఎదుటి వాళ్లతో పోల్చుకోకు, ఎదుటివారిని విమర్శించకు, అందరిలో ఉన్న ఈశ్వరుడిని చూడు, అని అలా రోజుకు ఒక వాక్యం నాకు నచ్చేది. ఆ వాక్యాలు అన్నీ రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఈ రోజు గతంలోకి వెళ్ళవద్దు అన్నారు కదా! నాన్నగారు అనుకొని ఈరోజు గతం గుర్తు వస్తోంది ఏంటి, అని విచారణ చేసుకుని, అక్షరమణమాల, ఉపదేశసారము, నాన్నగారు నామము చేసుకుంటూ మనసుని నిరోధించేదాన్ని. మరాలా కాసేపటకి బయటకి వెళ్ళిపోయేది, మళ్లీ నాన్నగారు గుర్తుకు వచ్చేవారు, మళ్లీ సాధన చేసేదాన్ని అలా రోజుల్లో పది సార్లు ఆ వాక్యం గుర్తుకు వచ్చేది, మరుసటి రోజు ఇంకొక వాక్యం, ఆ రోజంతా ఆ వాక్యం మీదే సాధన.

"నాన్నగారిని అవినయం రాకుండా ఆశీర్వదించండి, - నాన్నగారు మీరు మరుపు రాకుండా ఆశీర్వదించండి, - పొగిడితే నాకు వికారం రాకుండా ఆశీర్వదించండి అలా నాలో ఉన్న బలహీనతలు అన్నిటినీ చూసుకొని ప్రార్థించేదాన్ని. నేను మొదటసారి జిన్నూరు వెళ్ళినప్పుడు నాన్నగారు నా వైపు చూడాలి, నాన్నగారు నన్ను పలకరించాలి అని మనసులో కోరుకునేదాన్ని. ఇంతలో నాన్నగారు ఇంట్లో వారిని పలకరించడం అవసరమా! అని ఎవరితోనో అంటున్నారు. అప్పటి వరకు పలకరిస్తే బాగుండును అనుకున్న మనసు, నాన్నగారు నన్ను పలకరించకుండా ఉంటే బాగుండును అనుకుంది. అలా నన్ను ఎక్కువగా పలకరించేవారు కాదు. నాన్నగారి దయ నాకు మౌనంగానే తెలిసేది. నాన్నగారితో మాట్లాడవలసిన పని లేదు, హృదయంలో ఉన్న గురువుతోనే నాన్నగారు అని చెప్పేసుకుంటే సరిపోయేది.

ఒకసారి ఒక భక్తురాలు భర్త చనిపోయారు అని వచ్చారు. నాకు ఆమెను చూసి అయ్యో! నా భర్త చనిపోయే సమయానికి నేను నాన్నగారు దగ్గరకి లేకపోతే, ఆ జీవుడుని కూడా ఆశీర్వదించేవారు కదా!, ఆ జీవుడు కూడా పవిత్రులు అయ్యేవారు కదా! మంచి జరిగేది కదా! అనుకున్నాను. వెంటనే, నాన్నగారు అమ్మా! డాక్టర్ గారు ఎప్పుడు చనిపోయారు అని అడిగారు.అంటే మన మనసులో ఉన్నది ఆయనకు తెలిసిపోతుంది కదా, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో నాన్నగారే ఉంటారు మనం ఉండము. ఎప్పుడైతే, పిల్లల్ని కొండకు అప్పచెప్పానో అప్పటి నుండి నాన్నగారే పిల్లల్ని చూసుకున్నారు. 'రూపు దాల్చిన గిరి మన నాన్నగారు'. లేకపోతే కొండకు పిల్లల్ని అప్పగిస్తే, ఈయన చూసుకున్నారు కదా. నాన్నగారిలో జ్ఞానులు అందరినీ దర్శింప చేశారు. అలా క్రమంగా నాలో మార్పు తీసుకు వచ్చి, ఈ సత్సంగాలు అన్నీ ఆయనే చెప్పిస్తున్నారు, అది కేవలం ఆయన అనుగ్రహం మాత్రమే. నాన్నగారు వివిధ ప్రవచనాలలో మహాత్ముల అందరి గురించి బోధించి ఉన్నారు. అవి అన్నీ ఒక చోట నన్ను తెలుగులో రాయమని విజయ్ నాకు చెప్పారు. అవి తను ఇంగ్లీషులోకి అనువదించుకుని నాన్నగారు అంగీకారంతో వెబ్ సైట్ లో పెట్టారు. ఆ పాయింట్ ల కోసం ప్రవచనాలు వింటూ, నిరంతరం రాసుకోవడం వలన సబ్జెక్ట్ చెప్పటానికి నాకు చాలా సహాయ పడింది. అలా నాన్నగారి దయతో విజయ్ చేసిన జ్ఞానయజ్ఞంలో నన్ను కూడా సమెధను చేశారు. ఒకసారి నాన్నగారు సార్ నాథ్ లో బుద్ధుడు గురించి చెబుతూ, బుద్ధుడు అయిపోయారు. నాన్నగారు మార్గం మనకి చాలా సులభంగా ఉంటుంది. కానీ మనం చేసే ప్రయత్నం చాలా సిన్సియర్ గా చేయాలి. ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నామో చూసుకొని అక్కడ మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. గురువు ఆ ప్రయత్నమే చూస్తాడు.

'గురువుకి నీ జీవితం అంకితం చెయ్యి, గురువు యందు విశ్వాసం చెదరకుండా చూసుకో'. ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టమైనవి. అంటే గురువు చెయమన్న పనిచేసి, వద్దు అన్న పని చెయ్యకూడదు. అలా జీవిస్తూ, తండ్రి! నన్ను, నువ్వు చెప్పినట్టు జీవించే విధంగా అనుగ్రహించు. అని ప్రార్థిస్తూ ఉండాలి. నెమ్మదిగా ప్రయాణం చేసినా, గమ్యం మాత్రం మరిచిపోకూడదు. నిరంతరం గురుస్మరణలో ఉండాలి. గురువు మీద విశ్వాసం చెదరకుండా చూసుకుంటూ, గురుస్మరణలో ఉంటే, నీ కర్తవ్య కర్మలు నీవు చెయ్యకూడదు అనుకున్నా, చెయ్యకుండా ఉండలేవు. అలా చేస్తూ ఉంటే ఆయన దయ మనపై ఉండి తప్పనిసరిగా హృదయ సుఖాన్ని పొందుతాము.

సూర్యుడు భూమిపై ఒక భాగాన్ని విడిచి వెళ్ళిపోతూ, నేను వెళ్ళిపోతున్నాను ఈ భాగానికి ఎవరైనా వెలుగుని ప్రసరించగలరా? అని సూర్యుడు అడిగితే, ఒక కిరసనాయిలు దీపం ముందుకు వచ్చి, ఓ సర్యుడా! నువ్వు ఏ విధంగా అయితే వెలుగును ప్రసరింపచేస్తున్నావో, నేను కూడా అదే విధంగా ప్రసరింపచేస్తాను. నువ్వు కోట్ల మందికి వెలుగు ఇస్తే, నేను నలుగురికే ఇస్తాను. నువ్వు వెళ్లి రా, నువ్వు చేసే పని నేను చేస్తాను అందట కిరసనాయిలు దీపం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన ఈ వాక్యం చాలా బావుంటుంది.

నాన్నగారి ప్రేమ, సూర్యుడి వెలుగులా విశ్వప్రేమ. మనం నాన్నగారిలా కాకపోయినా, కిరసనాయిల దీపంలా ఒక నలుగురిని ప్రేమిద్దాము. అలా ఒక చిన్న ప్రయత్నం చేసి, ఆ ప్రేమించే శక్తిని ఇమ్మని గురువుని ప్రార్థిందాము. అలా చేస్తూ ఉంటే, తప్పనిసరిగా గురువు తన hold లోకి తీసుకుంటాడు. మన అందరము గురువు గర్భంలోనే జీవిస్తున్నాము అనటంలో ఎటువంటి సందేహము లేదు. నాన్నగారు చేయవలసిన పని ఏమీ లేకపోయినా, మనకోసం బోధిస్తూ, పనిచేసి చూపించారు. కాబట్టి ఆయన జీవితమే బోధ అయ్యింది. ఆ భోదే మనకి ఆదర్శం. నాన్నగారు సామాన్య గురువు కాదు, నాన్నగారు మన అందరికీ జ్ఞానం వస్తుంది అని 'అభయమిస్తూ' అనేక రకాలుగా ఆశీర్వదించారు కాబట్టి మనందరం తప్పనిసరిగా తరించి తీరుతాము.

నాన్నగారికి ఒక ఆస్ట్రేలియా భక్తుడు 'ఒక ఉత్తరంలో మీరు నన్ను ఏ విధంగా ప్రేమించారో ఆ ప్రేమను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే, ఆ ప్రేమలో నా అహంకారం కరిగిపోతోంది అని ఉత్తరంలో రాశాడట'. అలాగా నాన్నగారి ప్రేమను జ్ఞాపకం తెచ్చుకుని ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉందాము. గురువు జీవించి ఆదర్శంగా చూపించిన రీతిలో యధాతధంగా మనం జీవించటానికి చిన్న ప్రయత్నం చేసి శరణాగతి చేయాలి. నన్ను అలా జీవింపచేయి తండ్రి! అని ప్రార్థించాలి. అప్పుడు మన గురువుకి కృతజ్ఞత చెప్పుకున్నవాళ్ళం అవుతాము. గురువు ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడో, ఆ చైతన్య స్థాయికి మనల్ని తీసుకువెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాడు. మనసు నశించే వరకూ ప్రయత్నం విడిచిపెట్టకూడదు. మనసు నశించిన తరువాత ఆ దేహం ద్వారా జరగవలసిన పనులు జరుగుతూ ఉంటాయి.

"తుది పలుకులు" :
అమ్మ! అనారోగ్యం, క్యాన్సర్ అంటున్నారు. శరీరమంతా వ్యాపించేసింది. నాన్నగారు చూసుకుంటారు. "నాన్నగారి అనుగ్రహంతో మనసు చాలా బాగుంది; నాన్నగారిలో ఐక్యం అవ్వటానికి ప్రయత్నం చేస్తోంది. ఈరోజు ఉదయం క్యాసెట్ పెట్టుకుంటే మోక్షం మీ అందరికీ ఇచ్చేస్తాను సందేహపడకండి అని చెప్పారు. ఎవరూ కంగారు పడవద్దు. దేహం నేను కాదు, మనసు నేను కాదు, మన అందరం ఆత్మ స్వరూపులము. అదిగా నిలిచి ఉందాము". నా మనసు చాలా హాయిగా ఉంది. బెంగగా ఉన్నవారు ఎవరైనా ఉంటే! ఈ రాజేశ్వరిని తీసుకుని వెళ్ళి నాన్నగారి సన్నిధిలో అప్పగించండి. కంగారు పడకండి, ఉంటాను. "సబ్జెక్టుకు ఎవరు దూరం అవ్వకండి. సబ్జెక్టే గురువు" "గిరి రూపమో, గురు రూపమో శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యము. ఓం శ్రీ గురుభ్యోనమః.