Sunday, January 30, 2022

"దేవీ స్వరూపులు శ్రీ నాన్నగారు" - (By లేట్ కనుమూరి లక్ష్మి గారు)

జిన్నూరులో నాన్నగారి తమ్ముడుగారి ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం. మా పిల్లలు నాన్నగారి ఇంటి ఎదురుగా ఉన్న స్కూల్లో చదువుకునేవారు. నాన్నగారు గ్రామ పెద్దగా ఉండి అన్ని కార్యక్రమాల్లోను పాలుపంచుకునే వారు. మా పిల్లలకి ఆటల పోటీలలో బహుమతి వస్తే, నాన్నగారి చేతుల మీదగా అందుకున్నారు. నాకు చిన్నప్పటి నుండి దేవుడిని తెలుసుకోవాలి అనే కాంక్ష బలీయంగా ఉండేది. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వారు భగవంతుని మాటలు ఏమైనా చెబుతారా అని ఎదురు చూసేదాన్ని. నేను మూడోతరగతి చదువుతున్నప్పుడు అమ్మవారు నా జీవితంలోకి ప్రవేశించారు. అప్పటినుండి నాకు దేవి అంటే చాలా ఇష్టం. నాకు అప్పుడప్పుడు దర్శనం కూడా కలిగేది. స్కూలుకి వెళ్ళి నిన్ను మరిచి పోతున్నాను తల్లి అని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర బాధపడుతూ ఉండేదాన్ని. వివాహమై, ముగ్గురు సంతానం కలిగిన తర్వాత కూడా ప్రతినిత్యం అమ్మవారి పూజ చేసుకునేదాన్ని. నాకు ఏ కష్టం వచ్చినా అమ్మవారి తోనే పంచుకునే దానిని. నాకు తెలిసిన వారందరూ దేవిని ఎక్కువ పూజించడం వలన కష్టాలు వస్తాయి అనేవారు. అమ్మా, అందరూ ఇలా అంటున్నారు ఏమిటి అని దేవిని ప్రార్ధిస్తే, తల్లి బిడ్డలను ప్రేమిస్తుంది కానీ, కష్టాలు పాలు చెయ్యదు అనే సమాధానం వచ్చింది. నా భర్త సహకారం నాకు సరిగ్గా ఉండేది కాదు. అందువలన పిల్లలని పోషించలేనేమో అని చనిపోదాం అనుకున్నాను. అప్పుడు అమ్మవారు కలలో కనిపించి నాన్నగారిని చూపించి, ఆయన దగ్గరకు వెళ్ళు ఆయన నీకు మహోన్నతమైన స్థితిని ప్రసాదిస్తారు అని చెప్పింది.

నాన్నగారు దర్శనం కోసం నాన్నగారి ఇంటికి వెళ్ళగానే, నాన్నగారు నన్ను చూసి నాకు ఎదురొచ్చి లోపలకి తీసుకు వెళ్ళారు. నాకు చాప వేసి కూర్చోమని ఆయన మంచం మీద కూర్చున్నారు. రామకృష్ణుడు అన్నీ అమ్మవారితో పంచుకున్నట్టు నాకు నాన్నగారిని చూడగానే నా అనుభవాలన్నీ ఆయనకి చెప్పుకోవాలి అనిపించింది. నాన్నగారు నన్ను ఏమీ మాట్లాడనివ్వకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అప్పుడు నాన్నగారిలో ఉన్న ఆ బ్రహ్మ తేజస్సు ఈ విశ్వమంతా వ్యాపించినట్టు నాకు అనిపించింది. అందరూ నాన్నగారిని భక్తుడిగానే చూస్తున్నారు కానీ, ఆయన దేహం ధరించి వచ్చిన ఆ పరమేశ్వరుడే అనుకున్నాను. నా మానసిక రోగం తగ్గించటానికి నాకు ఒక మంచి వైద్యుడు లభించాడు అనిపించింది. అలా ఆ రోజు నుండి నాన్నగారు మీద విశ్వాసం కుదిరి ఆయనకే శరణాగతి చెందాను. నాన్నగారితో ఈ జీవిత యాత్ర దాదాపుగా 40 సంవత్సరాలు కొనసాగింది. ఏ రోజూ కూడా ఆయన మీద నమ్మకం చెక్కుచెదరనివ్వలేదు. ఆ రోజు నుండి ప్రతిరోజూ ఇంట్లో పూజ చేసుకుని, తర్వాత నాన్నగారి దర్శనం చేసుకుని వచ్చేదాన్ని. ప్రతిరోజు అదే నా దినచర్య. అలా నా జీవితానికి నాన్నగారి దర్శనం ఒక మహా వెలుగు అయ్యింది. నాన్నగారికి దగ్గరలో ఏవో కారణాలు వలన మా పిల్లలు ఇల్లు కొనుక్కోవద్దు అన్నారు. దూరంగా ఉంటే నాన్నగారిని చూడటానికి వీలుపడదు అని, నాన్నగారి ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకుంటాను, నా జీవితానికి అది సరిపోతుంది అని మా పిల్లలకి చెప్పాను. నాన్నగారి పట్ల నాకు కుదిరిన ఆ విశ్వాసం వలన నాన్నగారు నాకు భగవంతుడు స్వరూపంగానే కనిపించేవారు. కానీ అప్పట్లో అందరూ నన్ను మనిషిని పట్టుకుని దేవుడు అంటుంది ఏమిటి? అని విమర్శించేవారు. అయినా ఏమీ లెక్క చేసేదాన్ని కాదు. ఆ దైర్యానికి నాన్నగారు నన్ను మెచ్చుకునేవారు. నాకు ఎన్నో స్వప్నాలు వచ్చేవి. ఆ స్వప్నాల యొక్క అర్థం ఎవరిని అడిగినా మాకు తెలియదు అని చెప్పేవారు. ఒక్క నాన్నగారి దగ్గర మాత్రమే నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. నాన్నగారికి భిన్నంగా నాకు వేరే జీవితం అంటూ ఏదీ లేదు. అందుకే నా జీవితం గురించి నాకు తెలియదు. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితమంతా నాన్నగారే నిండి ఉన్నారు.

ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని నాన్నగారికి చెప్పకపోయినా, నాన్నగారు నాకు కొంత ధనము ఇచ్చి ఇది ఉపయోగించుకో అన్నారు. అప్పుడు నాన్నగారూ నేను మీ దగ్గరికి ఏదో ఆశించి రావటం లేదు. సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ నాకు లభించనటువంటి జ్ఞానం మీ దగ్గర లభిస్తోంది. దానివల్ల నా మనసుకి విపరీతమైన శాంతి చేకూరి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి నా మనసుని తాకటం లేదు. అందువలన మీ సమక్షానికి వస్తున్నాను అని నాన్నగారు ఇచ్చిన ధనాన్ని అక్కడ పెట్టేసాను. అప్పుడు నాన్నగారు నావెనకే వచ్చి అప్పు కింద తీసుకో, నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇవ్వచ్చమ్మా అని నా చేతోలో పెట్టేసి, నిన్ను చూస్తుంటే దేవత భూమి మీదకు వచ్చి నడుస్తున్నట్టు ఉంటుంది అన్నారు. ఒకసారి నాన్నగారు నీకు వచ్చే కష్టాలను చూసి నీకు భయం వేయటం లేదామ్మా అని అడిగారు. నాకు భయం వేయటం లేదు నాన్నగారు. అందరిలా పరిస్థితులు బావుంటే నేను ఇక్కడికి రావటానికి నా భర్త అంగీకరించకపోదురు. ఆ కష్టాలు ఉండటం వల్లనే ఇక్కడకు వచ్చి మీ సమక్షాన్ని ఆనందిస్తూ, మీ సబ్జెక్ట్ ని ఆస్వాదిస్తున్నాను. నాకు ఉపనిషత్తులు ఏమీ తెలియకపోయినా మీ నోటి నుండి వచ్చిన ప్రతి వాక్కు నాకు ఉపనిషత్తుతో సమానం. నాకు కష్టాలు ఉండటం వల్లనే ఈ ఉపనిషత్తులు వినటానికి నాకు ఇక్కడికి వచ్చే భాగ్యం కలిగింది. అందువలన ఆ కష్టాలు ఉన్నా పరవాలేదు అన్నాను. నువ్వు ఏమాట మాట్లాడినా ఉపనిషత్తులా మాట్లాడతావు అన్నారు. మాకు బంధువులు, స్నేహితులు అన్నీ నాన్నగారే అయ్యి నడిపించారు. ఒకసారి మా అబ్బాయిని నాన్నగారు మీరు మీ బంధువులందరినీ మరిచిపోయారా అని అడిగారు. అప్పుడు మా అబ్బాయి తాతయ్యా, మీ సమక్షంలో ఉండి మీ వాక్యాలు వింటూ అందరిని మరిచిపోయేలా చేసారు. మాకు అన్నీ మీరే అయ్యారు అన్నాడు.

ఒక్కొక్కసారి నాకు నాన్నగారి చెబుతున్న వాక్యాలు వింటున్నాము కానీ వాటిని ఆచరించలేక పోతున్నాము, అవి ఆచరించలేనప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయనను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపించి వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు నాన్నగారే సైకిల్ తొక్కుకుంటూ మా ఇంటికి వచ్చి ఎందుకు రావటం లేదమ్మా లక్ష్మీ అని అడిగి రమ్మని చెప్పి వెళ్ళేవారు.

నాన్నగారు ఒకసారి "మీకు తలంపులు వస్తున్నా ఆ తలంపులు మీరు కాదు. తలంపులు లేని స్థితి ఒకటి ఉంటుంది అదే మీరు" అన్నారు. ఆ వాక్యం విని చాలాసేపు ఆలోచించుకుని, నాన్నగారూ నా తలంపులే నేను అనుకుంటున్నాను. అది మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తోంది. తలంపు లేని స్థితి ఒకటి ఉంటుంది అని మీరంటున్నారు. అది నాకు అనుభవంలో లేదు. అందువలన మీరు చెప్పిన దానిని నేను అంగీకరించలేక పోతున్నాను. దీని గురించి నాకు అర్థమయ్యేలా చెప్పండి అని అడిగాను. నాన్నగారు ఒక పది రోజులు నీకు కొంచెం కష్టంగా ఉంటుంది. తరువాత దీని గురించి నీకు బాగా అర్థమవుతుంది అన్నారు. తరువాత నాకు ఆ విషయాన్ని అవగాహనలోకి తెచ్చారు. అలా నాన్నగారు ఏదైనా వాక్యం చెబితే అది అనుభవంలోకి రావడం లేదని చాలా బాధ పడేదాన్ని. నేను పడుతున్న ఆ బాధ నాన్నగారికి తెలిసి అవమానాలు భరించకుండా, కష్టాలు పడకుండా ఆత్మ జ్ఞానం వస్తుంది అని ఎదురు చూడకు. అందుకు నీ మనసుని సిద్ధం చేసుకుని నా దగ్గరికి రా అన్నారు.

ఒకసారి నాన్నగారి ఇంటికి వెళ్ళి, నాన్నగారూ ఇంట్లోనూ న్యాయం చేయలేకపోతున్నాను, మీరు చెప్పిన వాక్యాలు విని అర్థం చేసుకొని జీవించలేకపోవటం వలన అనవసరంగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్నీ ఇబ్బంది పెడుతున్నాను. రేపటినుండి సత్సంగాలకి రాను నాన్నగారూ అన్నాను. అప్పుడు నాన్నగారు "ఒక గుడికి వెళ్తే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాము. కానీ ఆ కాయ ఒక్క దెబ్బకు పగలదు కదా! తొమ్మిదిసార్లు కొడితే పదవసారి పగులుతుంది. ఆ తొమ్మిది సార్లు కొట్టిన ప్రభావం దాని మీద ఉండటం వలన అది పదవసారి పగులుతుంది. అలాగే సబ్జెక్టు శ్రవణం చేయగా, చేయగా దాని ప్రభావం నీ మనసు మీద ఉంటుంది. ఈశ్వరుడు ఒక్కసారి నిన్ను తలుపు సందులో పెట్టి నొక్కి ఆ వాక్యాన్ని అనుభవంలోకి తీసుకు వస్తాడు. అందుకే శ్రవణం చేయమని చెబుతారు. అది నీకు ఎప్పుడు అనుభవంలోకి తీసుకురావాలో ఆ ముహూర్తం ఈశ్వరుడు పెట్టుకుంటాడు. నువ్వు ఇక్కడకు వచ్చి ప్రవచనం వింటూ ఉంటేనే నీకు మారు మనసు రావటం లేదు. ఇక ఇక్కడకి రాకపోతే నీకు మారు మనసు ఎలా వస్తుంది? అందువలన నువ్వు ప్రవచనం వినటానికి రావటం మానవద్దు" అని చెప్పారు. మరొక సందర్భంలో నాన్నగారు "స్నేహం అంటే రూపాలు వేరైనా, వారి హృదయం ఒక్కటిగానే ఉంటుంది. నీ స్నేహం నాకు ఇష్టం అమ్మా లక్ష్మీ" అన్నారు. నాన్నగారు రామచంద్రరాజుగారితో, లక్ష్మి చాలా కష్టాలు పడుతున్నప్పటికీ అవి ఏమి తన ముఖంలో కనిపించవు. అందరూ ఆశ్చర్యపడే స్థాయికి లక్ష్మిని ఈశ్వరుడు తీసుకువస్తాడు అన్నారట. లక్ష్మీ నువ్వు ఏమీ చింతించకు, నాన్నగారు నీ గురించి ఇలా అంటున్నారు అని రామచంద్ర రాజు గారు నాకు చెప్పారు. అలా డాక్టర్ గారు, రామచంద్ర రాజు గారు నాకు తోబుట్టువుల్లా ఉండేవారు. నేను ఎప్పుడయినా చెడు స్నేహాలలో పడినా, నాన్నగారు నాకు లోపలినుండి వారితో స్నేహం చేయకు అని గైడ్ చేసేవారు. అలా అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఒకసారి నేను వెళ్ళే సమయానికి నాన్నగారు ధ్యానంలో ఉన్నారు. నేను వచ్చిన సంగతి ఆయనకు తెలిసి ధ్యానం నుండి బయటకు వచ్చి అమ్మా లక్ష్మీ , ఈశ్వరుడు నీకు వరం ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఏమి వరం కావాలి? అని అడిగారు. నాకు జ్ఞానం కావాలి అన్నాను. జ్ఞానం మాట అటు ఉంచు. నీకు ధనం కావాలా? చదువు కావాలా? అన్నారు. నాన్నగారు నాకు చదువు కావాలి. చదువంటే ఇష్టం అని చెప్పాను. అప్పుడు నాన్నగారు అయితే మీ ముగ్గురు పిల్లలని ప్రయోజకులను చేసి ఈశ్వరుడు నీ చేతిలో పెడతాడమ్మా..! తరువాత జ్ఞానం కావాలి అని అడిగావు కదా..! జ్ఞానం అంటే ఏమిటో తెలుసా? అన్నారు. జ్ఞానం అంటే ఏమిటో నాకు తెలియదు నాన్నగారూ కానీ, అది పొందాలనే కాంక్ష మాత్రం బలీయంగా ఉంది అన్నాను. అప్పుడు నాన్నగారు నా జాతి దానివి ఎన్నాళ్ళకు దొరికావు? ఈ ప్రకృతి మాటలు విని నా చెవులు చిల్లులు పడిపోయాయి. నీ ముఖంలో ఎప్పుడూ అసూయ అన్నది నాకు కనపడదు. ఆ అసూయని పోగొట్టుకోవటానికి నువ్వు పూర్వజన్మలో చాలా తపస్సు చేసావు అని నాకు తెలుస్తోంది అన్నారు. నా దినచర్యలో భాగంగా ఒకసారి నాన్నగారి దర్శనానికి వెళ్ళాను. భోజనం చేసావా? పిల్లలకు పెట్టేవామ్మా..! నీ యోగ క్షేమాలు చూడకుండా నేను భోజనం చెయ్యను. ఈ దేహం ఈ భూమి మీద ఉన్నంతవరకు మీ కుటుంబ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అన్నారు.

ఆయన చేసే ప్రతి పనిలోను, ప్రతి మాటలోను ఆయన ఆత్మగా నాకు వ్యక్తమయ్యేవారు. నాన్నగారు ప్రేమ ఎటువంటిదంటే, ఒక రాయికి బాధ కలిగినా కూడా ఆ బాధ తీర్చటానికి స్పందించే ప్రేమ హృదయం నాన్నగారిది. నాకు వచ్చే సమస్యలన్నీ నాన్నగారి దగ్గర ఏమీ చెప్పకపోయినా, నా హృదయంలో ఉండి నా సమస్యలు అన్నీ తెలుసుకొని నన్ను అన్నివిధాలా సంరక్షించారు. భౌతికంగా నాకు తండ్రిలా, ఆధ్యాత్మికంగా నాకు దైవంలా నా వెన్నంటి ఉంటూ నన్ను అడుగడుగునా రక్షిస్తూ ఉండేవారు. అలాంటి ప్రేమను ఇకముందు ఎన్నడూ ఎవరిలోనూ చూడలేము. నాన్నగారి దేహం లేకపోయినా, ఇప్పడు కూడా నాకు లోపల నుండి గైడెన్స్ ఇస్తున్నారు.

నాన్నగారు నన్ను ఏది చెయ్యమని చెబితే అదే చేసేదానిని. నాకంటూ ప్రత్యేకమయిన అభిప్రాయం ఏమీ ఉండేది కాదు. మా పిల్లలు వివాహం జరిగే సమయంలో మా బంధువుల వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. "ఎవరి సలహాను అనుసరించి మనం జీవించగలము అమ్మా, నీకు స్ఫూర్తిని ఇచ్చేవాడు భగవంతుడు. ఆయన నీ హృదయం నుండి నిన్ను గైడ్ చేస్తాడు. దాని ప్రకారం నువ్వు పని చేసుకు వెళ్ళిపో!" అన్నారు. నా భర్తకి ఆరోగ్యం బాగా లేనప్పుడు నాన్నగారు నీ భర్తని చూసుకోమ్మా అన్నారు. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఆయనకు సేవ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఆయనకు సేవ చేసే శక్తి నాన్నగారు ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తూ ఉండేది. ఈ సేవ చేసే ప్రక్రియలో నాలో ఉన్న ఇష్టాలను, అయిష్టాలను కూడా నాన్నగారు తగ్గించేసారు. చాకిరి నేను చేస్తుంటే, గౌరవం నీకు వస్తోంది ఏమిటి లక్ష్మీ.. అన్నారు. అంటే నాలో ఉండి నాకు శక్తిని ఇస్తూ నాన్నగారు చేసేవారు. అలా ఆయన ప్రేమతో అన్నీ చేయిస్తూ ఆయన ప్రేమలో జీవుడిని కరగ పెట్టేవారు. "చెడు తలంపు లోనుంచి నువ్వు బయటకు రావాలి అని కష్ట పడుతూ ఉంటావు కదా! నువ్వు పడిన ఆ కష్టమే నిన్ను కష్టం లేని స్థితికి తీసుకు వెళుతుంది" అనేవారు.

నాన్నగారితో కలిసి చాగల్లు ప్రవచనానికి వెళ్ళాను. అక్కడ వంటచేసి నాన్నగారికి వడ్డించినప్పుడు, లక్ష్మీ... వంట బాగా చేసావమ్మా అన్నారు. తరువాత ఇంటికి వచ్చేసి ఆరోజు రాత్రి కింద ఏమీ పరుచుకోకుండానే నిద్రపోయాను. అప్పుడు మా ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేదు. నాకు సహజంగానే గాఢ నిద్ర పడుతుంది. ఆ రోజు అలా పడుకున్నప్పుడు ఎదో నా శరీరం మీద పాకుతున్నట్టు అనిపించింది. కానీ కళ్ళు తెరవలేక నాన్నగారి మీద భారం వేసి పడుకున్నాను. మరుసటి రోజు నాన్నగారి దర్శనానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి, దేహం మీద ఏమీ పాకుతోందో అనే స్పృహ లేకుండా పడుకున్నావు అంత నిద్ర ఏమిటి? కింద ఏమైనా పరుచుకొని పడుకోవాలి. చీకటిలో ఉన్నప్పుడు బ్యాటరీ లైట్ వేసుకో అనిచెప్పి కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. అంటే నువ్వు నిద్రపోతున్నా నీ హృదయములో ఉన్నవాడు మాత్రం నిద్ర పోకుండా నిన్ను చూస్తూ ఉంటాడు. వాడు ఒక్కడు మాత్రమే నీ క్షేమం కోరుకునేవాడు అని అంటారు కదా! అలా నాన్నగారు నా క్షేమం కోరుకుంటూ నాకు అడుగడుగునా సహాయం అందిస్తూ ఉన్నారు. ఒకసారి ఊరు వెళుతూ చపాతీ పిండి బయట మర్చిపోయి వెళ్ళిపోయాను. ఊరి నుండి వచ్చిన తరువాత, నాన్నగారిని దర్శనం చేసుకుని వచ్చి ఈ చపాతీ పిండితో చపాతీలు చేసుకుని తిందాము అనుకుని నాన్నగారి ఇంటికి వెళ్ళాను. అప్పుడు నాన్నగారు ఆ చపాతీ పిండిపై బల్లి పాకింది. ఈ రోజు నువ్వు మా ఇంట్లో భోజనం చెయ్యి అని, కన్నమ్మ గారితో లక్ష్మి కి కూడా వంట చెయ్యి అని చెప్పారు. కన్నమ్మగారు లక్ష్మి కి నేను వంట చేసే ఉంచాను అన్నారు. అలా వారు ఇరువురు నాపై చూపే ప్రేమలో నాకు భౌతిక జీవితంతో సంబంధం లేకుండా వారి ఇరువురి నడుమ పసిబిడ్డలా అనందిస్తూ గడిపేదాన్ని. నాన్నగారు నాకు ఏదైనా పండు ఇచ్చినా, ఈ పండు నీ ఆరోగ్యానికి మంచిది తిను లక్ష్మీ అని ప్రేమగా చెప్పి ఇచ్చేవారు.

ఒక భక్తుడు నాన్నగారితో లక్ష్మి మనస్తత్వం పిల్లల స్వభావంలా ఉంటుంది ఏమిటి నాన్నగారూ అన్నారట. లక్ష్మి మనసు మనకు ఉంటే ఒక్క సెకనులో భగవంతుడు మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నారట నాన్నగారు. ఎంతో మంది స్వాములు నాన్నగారి దర్శనానికి వచ్చి నన్ను చూసి, నాన్నగారి సమక్షంలో ఉంటూ ఆడుతూ, పాడుతూ నువ్వు పొందవలసినది పొందుతున్నావు. ఇంతకు మించిన భాగ్యం ఎవరికి లభిస్తుంది? అనేవారు. ఒక జ్ఞాని జీవుడిలో ఉన్న అజ్ఞానం తో పోరాడి, చివరికి ఆ పోరాటంలో జ్ఞానే విజయం సాధిస్తాడు. ఇది నా జీవితంలో నాన్నగారి ద్వారా జరిగింది. ఇది నా ప్రత్యక్ష అనుభవం.

ఒకసారి మా ఇంట్లో అమ్మవారు ఎందుకో దుఃఖ పడుతున్నట్టు నాకు అనిపించింది. నాన్నగారి ఇంటికి వచ్చి చూస్తే నాన్నగారు కూడా అలాగే కనిపించారు. అప్పుడు నాన్న గారిని నేనేమైనా తప్పు చేశానా? మీరు ఇరువురూ అలా దుఃఖ పడుతున్నట్టు నాకు ఎందుకు అనిపిస్తోంది? నా తప్పు ఉంటే చెప్పండి నేను సరి చేసుకుంటాను అన్నాను. అప్పుడు నాన్నగారు "నీకు వచ్చే దుఃఖాన్ని మీ బంధువులు ఎవరూ పంచుకోలేరు. నువ్వు ప్రేమించే నీ దేవి, నువ్వు ఆరాధించే నేను మాత్రమే పంచుకోగలము. నీ హృదయంలో ఉన్న అంతరాత్మ తప్ప నీ దుఃఖాన్ని ఎవ్వరూ పంచుకోలేరు" అన్నారు. ఈ మాట భక్తులందరికీ కూడా ఉపయోగపడుతుంది అనిపించింది. ఒకసారి భగవాన్ జయంతికి నాన్న గారిని భోజనానికి రమ్మని ఆహ్వానించాను. అప్పుడు నాన్నగారు నువ్వు నా మాటలు అర్థం చేసుకుని ఆచరించు అదే నీ నుండి నేను ఆశిస్తున్నాను అన్నారు.

ఒకసారి నాన్నగారు అరుణాచలం వెళ్ళారు. అప్పుడు నాన్నగారు ఇక ఉండరు అనే భయం నాలో కలిగి అరుణాచలం వెళ్ళి నాన్నగారిని చూసేయాలి అనిపించింది. చేతిలో ప్రయాణానికి సరిపడా ధనం ఏమీ లేకపోయినా, అరుణాచలం వెళ్ళాలనుకుని స్టేషన్ కి వెళ్ళాను. అప్పుడు అక్కడ భక్తులు ఒకరు కనిపించి మిమ్మల్ని నేను తీసుకు వెళ్తానని చెప్పి తీసుకువెళ్లారు. అరుణాచలం వెళ్ళి నాన్నగారిని చూసిన తరువాత నాన్నగారు బానే ఉన్నారు. ఇది అంతా నా మనసు చేసే గారడీ అని అర్థమైంది. ఇంక ఎప్పుడు మనసు మాట వినకూడదు అనుకున్నాను.

నాన్నగారు ప్రవచనాలు చెప్పటం మొదట నాన్నగారి ఇంటి దగ్గర ప్రారంభించారు. ఆ తరువాత పోస్ట్ ఆఫీస్ లో చెప్పేవారు. నాన్నగారు అక్కడికి వెళ్ళేటప్పుడు మా అబ్బాయిలను కూడా సైకిల్ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళేవారు. నాన్నగారు అక్షరమణమాల పాడుతూ, మా అబ్బాయిని సైకిల్ ఎక్కించుకుని తొక్కుకుంటూ, ప్రతి పౌర్ణమికి పక్కనే ఉన్న చిన్న , చిన్న గ్రామాలకు ప్రవచనం చెప్పటానికి వెళ్ళేవారు. మా అబ్బాయిలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు అల్లరి చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళని నాన్నగారు వెంట తీసుకు వెళ్ళేవారు.

నాన్నగారి ప్రవచనాలు వేరే గ్రామాల్లో జరిగినప్పుడు, అక్కడికి వెళ్ళటానికి సరిపడా ధనం నా దగ్గర ఉండేది కాదు. అటువంటప్పుడు నన్ను ప్రవచనానికి తీసుకువెళ్ళే బాధ్యత మీదే నాన్నగారూ అని ప్రార్థించేదాన్ని. అలాగే నాన్నగారు ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ, నా ప్రయణానికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిస్తూ ఉండేవారు. ఒకసారి చించినాడలో గురుపౌర్ణమి చేసినప్పుడు నాన్నగారి ప్రవచనానికి వెళ్ళాను. అప్పుడు నాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి, "ఏ శక్తిని నమ్మి నువ్వు ఈ ప్రవచనాలకి వస్తున్నావో, నిన్ను తిరిగి ఇంటి దగ్గర దింపే భాధ్యత కూడా ఆ శక్తిదే." అందువలన నువ్వు ప్రతి ప్రవచనానికి రావచ్చు అన్నారు.

నాన్నగారి వాక్యాలు మా పిల్లలు కూడా వినాలని, ప్రతి ఆదివారం వాళ్ళకి ఇష్టం లేకపోయినా నాన్నగారి దగ్గరకు తీసుకు వెళ్ళేదాన్ని. అది చూసి నాన్నగారు పిల్లల్ని ఎందుకు తీసుకు వస్తున్నావు అని అడిగేవారు. వీళ్ళు కూడా బాగు పడాలి అనే నా స్వార్థం కోసం నేను తీసుకొస్తున్నాను నాన్నగారూ అని చెప్పేదాన్ని. అది విని వెరీగుడ్ అనేవారు.

ఒకసారి పాలకోడేరు ప్రవచనానికి వెళ్ళాము. అక్కడ ఎవరో నా గురించి చెడుగా చెప్పటం వల్ల ఒక పెద్దాయన నేను భోజనం చేస్తుండగా వచ్చి నన్ను మందలించడం మొదలు పెట్టారు. నాకు అక్కడి నుండి వెంటనే వచ్చేయాలని అనిపించింది. కానీ వ్యక్తి అంటే అహంకారం. అది ముఖ్యం కాదు. అన్నం అంటే పర బ్రహ్మ స్వరూపం. అంటే, అన్నం ముందు కూర్చున్నప్పుడు అది తినకుండా వచ్చేస్తే, అన్నాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది అని లోపల నుండి స్ఫురించింది. అందువల్ల ఆయన మాటలు పట్టించుకోకుండా భోజనం ముగించుకుని వచ్చేసాను. అలా అవమానాలను భరించే శక్తి కూడా లోపల నుండి నాన్నగారు ఇస్తూ ఉండేవారు.

నేను ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్ళేముందు నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను. అంతా సవ్యంగా అవుతుంది చేయించుకోమ్మా అన్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్స్ మీరు మాకు సహకరించాలి, మీరు బతుకుతారు అని గ్యారెంటీ కూడా ఇవ్వలేము అని చెప్పారు. దానికి ఈశ్వరుడు నన్ను ఈ ఆపరేషన్ వంక పెట్టుకుని తీసుకు వెళ్ళాలనుకుంటే తీసుకు వెళ్ళిపోతాడు. మీ పని మీరు చేయండి అన్నాను. నా నోటి ద్వారా నాన్నగారు పలికించిన ఆ వాక్యాలకి డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. నేను మగతలోకి జారుకుంటున్నప్పుడు అరుణాచలం గిరి పై నుండి ఒక మహా వెలుగు వచ్చి నా లోకి ప్రవేశించినట్టు అనిపించింది. ఆపరేషన్ అయిన తరువాత నాలో ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉండటం చూసి డాక్టర్లు, మా పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు.

ఒకసారి నాన్నగారు ఈ ప్రహరీ దాటి గుమ్మం లోపలికి వచ్చిన వారు ఎవ్వరూ కూడా ఒట్టి చేతులతో బయటకు వెళ్ళరు అన్నారు. నాకు పూజ ద్వారానే నాన్నగారు లభించారు అనిపిస్తుంది. పూజ చేసినప్పుడు దీపం వెలిగిస్తాం కదా! ఆ దీపం వెలిగించినప్పుడు ఎలా ప్రార్థించాలో చెప్పేవారు నాన్నగారు. హృదయంలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించడం నాకు తెలియక, దానికి పరోక్షంగా ఈ దీపాలను వెలిగిస్తున్నాను. నా హృదయంలో ఉన్న జ్ఞానాన్ని వెలుగులోకి తీసుకు రమ్మని చెప్పి భగవంతుడిని ప్రార్ధించి దీపం పెట్టుకోండి అనేవారు. అలాగే పూజ చేసి హారతి ఇచ్చేటప్పుడు, నాలో ఉన్న అజ్ఞానాన్ని కరిగించమని ఈశ్వరుడిని ప్రార్థించండి అనేవారు. నాకు పూజ అంటే ఆసక్తి ఉండటం వలన హారతి ఇచ్చేటప్పుడు హారతి ఇచ్చేది ఎవరు? అది పొందేది ఎవరు? అని ఒకోసారి అనిపిస్తూ ఉండేది. అంటే అంతా నాన్నగారే కదా! అలా మధ్య, మధ్యలో అద్వైతస్థితి అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తూ ఉండేవారు. నాన్నగారు దేహం వదిలేసే ముందు ఎందుకో నాకు ఇక నాన్నగారు దేహం ఎన్నో రోజులు ఈ భూమిపైన ఉండదు అనిపిస్తూ ఉండేది. అప్పుడు నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నాన్నగారికి దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా నాన్నగారిని విడిచి ఉండలేను అని మా అబ్బాయిలతో పోట్లాడి నాన్నగారి దగ్గరకు వచ్చేసేదానిని. మా పెద్దబ్బాయికి ఒకసారి నాన్నగారు స్వప్నంలో దర్శనమిచ్చి, మీ అమ్మను నా దగ్గరకు పంపించు నా దేహం ఇంకా ఎన్నో రోజులు ఉండదు అని చెప్పి, నన్ను చూడటానికి నువ్వు ఎప్పుడు వస్తావు? అని మా అబ్బాయిని అడిగారట.

ఒక భక్తురాలికి భగవాన్ స్వప్నంలో దర్శనం ఇచ్చి నన్ను అరుణాచలము తీసుకొని రమ్మని చెప్పారట. నాకు కూడా అదే సమయంలో స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు అరుణాచలం వస్తావా అని అడిగారు. అలా భగవాన్ అనుగ్రహంతో నా దగ్గర ప్రయాణానికి సరిపడా ధనం లేకపోయినా అరుణాచలం వెళ్ళాను. గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు గిరిని చూసి దేవుడు అనుకునే అంత భక్తి నాకు లేదు. రాయిని దేవుడు అంటారేమిటి అనుకున్నాను. ప్రదక్షణ చేసి వచ్చిన తర్వాత నా చుట్టూ నేను తిరుగుతున్నట్టు నాకు కల వచ్చింది. గిరి అంటే మన హృదయంలో ఉన్న ఆత్మ అని నాకు అప్పుడు అర్థమయింది.

నాన్నగారి దగ్గర ఏమాత్రం భయపడకుండా ఉండేదాన్ని. ఆయనంటే విపరీతమైన ఇష్టం ఉండటం వల్లనే ఆయనంటే భయం కలిగేది కాదు. నాన్నగారి సమక్షంలో ఉన్నప్పుడు నాన్నగారి నోటిలో నుండి వచ్చే ప్రతి వాక్యం అనుభవంలో నుండి వచ్చేది. అందువలన అక్కడ దేహ స్ఫురణ కూడా ఉండేది కాదు. నాన్నగారు నా వైపు చూస్తూ ఉంటే, ఎందుకు తరచుగా నా వైపు చూస్తూ ఉంటారు అనుకునే దానిని. నీ వైపు చూడకుండా ఉండలేక చూస్తున్నాను అమ్మా అనే వారు. నాన్నగారు ఏవాక్యం చెప్పినా కపటం లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు. ఆయన్ని చూస్తుంటే ఒక్కొక్కసారి జ్ఞానమే రూపం ధరించి వచ్చింది అనిపించేది. ఒకసారి నాన్నగారి దగ్గరకు వచ్చిన ఒక డాక్టరు mathematics కి అంతం ఏమిటి? అని అడిగారు. అంతం చైతన్యమే! అని నాన్నగారు చెప్పారు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు, జ్ఞాని నా స్వరూపం పొందుతాడు అని భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు అని నాన్నగారు చెప్పారు. అలా భక్తుల మనసులలో ఉన్న బండరాళ్ల లాంటి వాసనలు నాన్నగారి అనుగ్రహం ద్వారా తొలగించబడ్డాయి. అందువల్లనే ఈరోజు భక్తులు అందరం చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాము. ఇలా నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన రాస్తే ఒక పెద్ద గ్రంధం అవుతుంది. మనం బాగు పడటానికి ఒక గురువు చాలు అని నాన్నగారు చెప్పారు. అలా మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఒక రమణ భాస్కర చాలు అనిపిస్తుంది. ఎవరు ఏ యోగంలో ప్రయాణం చేసినా, మన దృష్టి అంతా ఎక్కడ కేంద్రీకరించాలి అంటే మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి. దేహంతో ఏ నేను అయితే తాదాప్యం పొందుతోందో దాని నుండి విడుదల పొందాలి.

Sunday, January 2, 2022

"నాన్నగారు మనతోనే ఉన్నారు" - (By సుజాతా గారు)

ఒకసారి నాన్నగారితో కాశీ వెళ్ళాము. నాన్నగారు ఎప్పుడూ నాకు పని చెప్పేవారు కాదు. నువ్వు అలసిపోతావమ్మ అనేవారు. ఒకసారి ఆయన బట్టలు ఉతకడానికి ఇస్తూ నీకు కష్టం అయిపోతుందేమో అన్నారు. పరవాలేదు నాన్నగారూ అని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఉతికి ఇస్త్రీ చేయించి ఇచ్చాను. నన్ను పవిత్రం చేయడానికి ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఒకసారి నాన్నగారి రూమ్ తుడుస్తుంటే వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నారు. ఎందుకో తెలియదు అలా అనేవారు. మా కజిన్స్ లో ఒకరు, తన సొంత పని ఎలా చేసుకుంటారో ఎదుటివారి పని కూడా అలాగే చేస్తారు. ఒకసారి నాన్నగారి దగ్గర తన గురించి చెప్పాను. అప్పుడు నాన్నగారు అలాంటి వారిని డబ్బుపెట్టి కొనుక్కోలేము కదమ్మా, ఇలాంటి వారు దొరకటం చాలా అరుదు అన్నారు.

గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తూ తిరిగేవాళ్ళం. ఒకసారి నా స్నేహితురాలు "మోహము త్రిప్పి నీ మోహ మొనర్చి నామోహము తీరదా అరుణాచల" అని అక్షరమణమాల లో ఉన్న ద్విపదను అంటుంటే, నాన్నగారు తనతో- ఈ ద్విపద ఇప్పుడు మనకు సరిపోదు. ముందు మనకు ఉన్న మోహములో నుండి బయటకు వచ్చేయాలి. ఆయన మీద మోహం కలిగిన తరువాత ఆయన తీసుకోవాలి అని చెప్పారు. నీకు ఏ ద్విపద అంటే ఇష్టం? అని తరువాత నన్ను అడిగారు. "ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అణగ నీ ద్యుతి చూపుము అరుణాచల." అని చెప్పాను.

నాకు సంగీతం నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఒక పది క్లాసుల వరకు సంగీతం నేర్చుకున్నాను. ఒకరోజు సంగీతం క్లాస్ కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే, భగవాన్ చెప్పిన వాక్యం ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే, ఒకరు భగవాన్ దగ్గరకు వచ్చి నువ్వే శరణు, నువ్వే శరణు అని పాట పాడుతున్నారు. ఇంత పాట, ఇన్ని దీర్ఘాలు ఎందుకు? ఆ పాడేది మనసు కదా! దానిని అర్పిస్తే సరిపోతుంది అన్న భగవాన్ మాట గుర్తుకు వచ్చింది. (ఆ తరువాత ఎప్పుడూ సంగీతం క్లాసుకి వెళ్ళలేదు). ఆరోజు ఇంటికి రాకుండా పద్మ గారి ఇంటికి వెళ్ళాను. ఆవిడ సత్సంగాలు చెపుతారని నాకు అప్పటికి తెలీదు. నేను వెళ్ళేసరికి అక్కడ సత్సంగం జరుగుతోంది. ఆ రోజు పద్మ గారు సత్సంగంలో నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు భగవద్గీతలోని నాకు చాలా ఇష్టమైన "గతే భర్త ప్రభు సాక్షి" అనే శ్లోకం చెప్పాను. నేను చెప్పడానికి ముందే పద్మ గారికి సుజాత వచ్చి ఈ శ్లోకం చెబుతుంది అని అనిపించిందట. నేను సత్సంగంలో చెప్పటం అలా మొదలయ్యింది. సత్సంగంలో నాన్నగారి వాక్యాలు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. లోపలనుండి శాంతి ఊరుతూ ఉండేది. ఒక్కొక్కసారి నాకు అర్థం కాని వాక్యం వస్తే దానిని వదిలి వేరే వాక్యం చెప్పేదానిని. ఈ సత్సంగాలు చెప్పటం, నాన్నగారి సబ్జెక్టు వినటం, నాన్నగారి సమక్షంలో గడపటం అవి అన్నీ కూడా ఎంతో అందమైన రోజులు. పద్మ గారు, నేను కలిసి ప్రతిరోజు నాన్నగారి సబ్జెక్టు స్మరించుకుంటూ అన్నీ బాగా చర్చించుకునే వాళ్ళం. అలా సబ్జెక్టు స్మరణ అనే మత్తులో ఏ బాధ తెలియకుండా కొన్ని సంవత్సరాలు మా ఇద్దరికీ గడిచిపోయాయి.

సత్సంగాలు ఎప్పుడూ వీలైనంతవరకూ మానేదాన్ని కాదు. తరువాత ఇంట్లో పనుల వలన కొద్ది రోజులు సత్సంగాలకు వెళ్ళటం కుదరలేదు. తరువాత అరుణాచలంలో నాన్నగారు ఒకరోజు భక్తులు అందరూ ఉండగా, సుజాతకి ఈమధ్య సత్సంగానికి వెళ్ళటానికి సమయం దొరకట్లేదటండి, ఈ బిజీ ఏమైనా వల్లకాటికి వస్తుందా అన్నారు. ఆ మాట అనగానే నాకు కొట్టినట్టు అనిపించింది. ఎప్పుడూ మనం సబ్జెక్ట్ ని మిస్ అవ్వకూడదని నాన్నగారు చెప్తున్నారు అనుకుని, అప్పటి నుండి సత్సంగానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒకసారి మా అత్తయ్య గారి ఇంట్లో నాన్నగారు ఒక భక్తురాలిని సుజాత సత్సంగంలో ఏమి చెబుతోంది? అందులో నీకు నచ్చిన వాక్యం ఏమిటమ్మా అని అడిగారు. అప్పుడు ఆ భక్తురాలు జీవితాన్ని భరించమన్నారు నాన్నగారూ ఆ వాక్యం నాకు బాగా నచ్చింది అని చెప్పారు. దానికి నాన్నగారు చాలా మంచి వాక్యం అమ్మా అన్నారు. అంటే సత్సంగంలో నా ద్వారా వినిపించిన వాక్యం ఆమె పట్టుకున్నారు. నాన్నగారు అలా ఏదో ఒక రకంగా, ఏదో ఒక ఒంపు పెట్టుకుని మనల్ని పవిత్రం చేయటానికి అలా స్మరిస్తూ ఉండేవారు.

నాలో ఎన్ని వాసనలు ఉన్నాయో! అది నాకు, నా గురువుకి మాత్రమే తెలుస్తుంది. నాన్నగారు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునేదాన్ని. నాన్నగారు దేహం వదిలేముందు దేహబాధ చాలా అనుభవించారు. ఆ సమయంలో ఒకసారి నాన్నగారు ఆసుపత్రిలో పేపర్ చదువుతూ నాతో అమ్మా సుజాతా..! "పనిలో నేర్పు అంటే ఏమిటంటే, పనిని నేర్పుగా, ఓర్పుగా చేయడం నేర్చుకోవాలి. అంటే పని చెయ్యాలి, ఆ పని మనకు గుర్తు రాకూడదు. హృదయంలో ఉంటూ ఆ పనిని చేయాలి. హృదయం పని చేస్తుంది కానీ నేను చేశాను అని అనుకోదు. ఎందుకంటే, దానికి కర్తృత్వం లేదు. అలాగ నువ్వు కూడా ఏ పని చేసినా కర్తృత్వం పెట్టుకోకు. పని చేయ్యాలి అది నిన్ను అంటకూడదు. జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా నువ్వు హృదయంలో ఉండటం నేర్చుకో అదే అభ్యాసము!" అని చెప్పారు.

నాన్నగారు మాతో, మీ మావయ్య గారిని మీరు చాలా బాగా చూసుకున్నారు. నాకు అలా గడవకపోవచ్చు అమ్మా అన్నారు. అప్పుడు నేను, నాన్నగారూ మిమ్మల్ని చూసుకోవటానికి ఎంతో మంది ప్రియమైన భక్తులు ఉన్నారు అన్నాను. నాన్నగారు పొగిడినప్పుడల్లా వాటిని మనం తీసుకుంటే హృదయంలో ఉన్న సత్యానికి దూరమైపోతాము అనిపిస్తూ ఉండేది. అలా పొగడ్తలు తీసుకోకూడదు అనే గైడెన్స్ కూడా నాన్నగారే ఇస్తున్నారు అని తెలుస్తూ ఉండేది. నాన్నగారు దేహం వదిలేసే ముందు వైజాగ్ ఆస్పత్రికి వచ్చినప్పుడు మా మరిది గారి ఇంట్లో కొద్ది రోజులు ఉన్నారు. అప్పుడు నాన్నగారి దేహ బాధలు చూడలేక నాకు నాన్నగారి దగ్గరకు వెళ్ళాలంటే భయం వేసేది. ఆ సమయంలో కూడా నాన్నగారు వచ్చిన భక్తులందరినీ ఎంతో ప్రేమపూర్వకంగా అనుగ్రహించి వారిని సంతృప్తి పరిచారు. అలాంటి సమయంలో నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను పిలిచి, అనారోగ్యం వచ్చి హాస్పిటల్ కి వెళితే వారందరూ డబ్బులు చాలా ఎక్కువ దోచేస్తున్నారు అమ్మా అని చెప్పారు. నాన్నగారు అంటే పూర్ణం. అంటే దైవత్వం లోనే మానవత్వం కూడా ఉంటుంది. కాబట్టే మానవులు పడే ఇబ్బందులను అర్థం చేసుకొని అలా బాధని వ్యక్తపరుస్తున్నారు అనుకునేదాన్ని. ఆ సమయంలో ఒకసారి నా భర్త వచ్చి, నాన్నగారూ ఇప్పుడే మీ ఆరోగ్యం కొద్దిగా కుదుటపడుతోంది కాబట్టి ఇప్పుడే మీరు జిన్నూరు వెళ్లొద్దు, కొద్దిరోజులు ఇక్కడే ఉండండి అన్నారు. దానికి నాన్నగారు మా భక్తులు జిన్నూరు లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు. అప్పుడు నా భర్త, భక్తుల కోసం బస్సులు వేద్దాము నాన్నగారూ, వారు వచ్చి మిమ్మల్ని దర్శించుకుని వెళతారు అని చెప్పారు. దానికి నాన్నగారు, అదంతా వద్దు నేనే జిన్నూరు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి మరలా తిరిగి వచ్చేస్తాను అన్నారు. అదే సమయంలో ఒక డాక్టర్ గారు నాన్నగారిని మీరు ఇప్పుడు జిన్నూరు వెళ్ళవద్దు, ఒక వేళ వెళ్ళినా మీరు మాట్లాడకుండా మౌనంగా కూర్చోండి. ఎవరో ఒకరు సబ్జెక్టు చెబుతారు అన్నారు. అప్పుడు నాన్నగారు నన్ను జిన్నూరు వెళ్ళవద్దు, అక్కడ మాట్లాడవద్దు అని మీ మనసు చెబుతోంది. అది అంతా నిజం కాదు. "నేను ఉండటానికి సంబంధించిన వాడిని. అది మీకు తెలియదు. మీరు కూడా ఉండటమనేది మననం చేయండి. అలా మననం చేయడం వలన మీ జీవితంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినప్పటికి అవి అన్నీ కాలి బూడిదైపోతాయి. ఆ ఉండటం అనేది అంత గొప్పది" అన్నారు. నాన్నగారి మాటలలో నాకు ఉండటం అనే వాఖ్యము చాలా ఇష్టము. దాని తాలూకు అనుభవాన్ని కూడా నాన్నగారు కొద్దిగా రుచి చూపించారు. ఆ ఉండటం అనే వాక్యము నా జీవితంలో చాలా రోజులు నన్ను వెంటాడింది. నాన్నగారు ఆఖరి సమయంలో హాస్పటల్ లో ఉండగా నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు మాత్రము ఇప్పటికీ నేను మరిచిపోలేను. భగవాన్ ఫోటో చూసినా, నాన్నగారి ఫోటో చూసినా ఆ చిరునవ్వే దర్శనం ఇస్తుంది. ఏ తలంపులు లేనిచోట నేను ఉన్నాను అనిపిస్తుంది. వెంటనే నాకు దక్షిణామూర్తి జ్ఞాపకం వస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నాన్నగారి ఫోటో దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, లోపల ఉన్న అశాంతిని తొలగించి, హృదయంలో ఉన్న శాంతిని ఎప్పటికప్పుడు నాకు రుచి చూపిస్తూ ఉంటారు. గురువు ఎప్పుడూ మనకి ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. మనకి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఒక అవకాశంగా భావించి దానిని పొందటానికి తయారు అవ్వాలి (పక్వానికి రావాలి).

నాన్నగారు నాకు దండలు వద్దు, నమస్కారాలు వద్దు. నేను ఏ స్పిరిట్ తో ఈ మాటలు చెబుతున్నానో, ఆ స్పిరిట్ తో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆచరించండి చాలు. అదే నాకు పెద్ద నమస్కారం అనేవారు. నాన్నగారి సబ్జక్ట్ వినేటప్పుడు చాలా ఏకాగ్రతగా వినేదాన్ని. అలా క్యాసెట్ రూపంలో అందిన నాన్నగారి సబ్జెక్ట్ ని చాలా ఎంజాయ్ చేశాను. మనం విన్నది ఏదీ కూడా వృధా పోదు. అది ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో పని చేస్తూనే ఉంటుంది.

నాన్నగారు చెప్పిన వాక్యాలలో "నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఫలానా, నేను ఇది, నేను అది అని అనుకోకుండా ఉంటే చాలు మనకి మోక్షం వచ్చేస్తుంది". అన్న ఈ వాక్యం నన్ను చాలాకాలం ఆచరిస్తూ జీవింపచేసింది. అలా గడిచిన రోజులలో నిరంతరం శాంతి నాలో ప్రవహిస్తూనే ఉండేది. అది భగవంతుని దయ! వాక్యము దేవుడై ఉంది దేవుడు, వాక్యం వేరు కాదు అన్నది నాన్నగారు అలా రుచి చూపించారు. కృష్ణుడు ఇదంతా నా విభూతి అంటాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ భగవంతుడు ఇస్తాడు. ఏ భక్తుల్ని చూసినా భగవంతుడి వైభవం కనిపిస్తుంది. నాన్నగారిని చూసినా భగవంతుడి వైభవం కనిపిస్తుంది. అలా మనసు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడే జ్ఞాపకం వచ్చేవాడు. అప్పుడు మనసు వెనక్కి తిరిగి హృదయం లోపలికి వెళ్ళిపోయేది. జననమరణాలకు మనము అలవాటు పడిపోయి, జ్ఞానాన్ని, భక్తిని మిస్ అయిపోతున్నాము అని నాన్నగారు ఒక మాట చెప్పారు. "మన జీవితంలో ఎన్నో వస్తాయి. వాటిని అన్నింటిని పరిష్కరించుకోవాలి అంటే అసలు పని అవ్వదు. దాన్ని దానికే వదిలేయాలి. మనం మనంగా ఉండడానికి ప్రయత్నించాలి. జీవితంలో ఎవరితోనూ పోల్చుకోకూడదు." అన్నారు. అంటే మనం ఎలా ఉంటున్నామో చూసుకుని, మనం తరించడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటి వారిలో ఉన్న మంచిని చూసి మనం ఆనందించాలి. దేహం వదిలే ఆఖరి సమయం వరకు మీ మనసుని నమ్మవద్దు అని నాన్నగారు చెబుతారు కదా! భగవంతుడు నన్ను మంచి కుటుంబంలో ఉంచి, మంచి గురువుని కూడా ప్రసాదించాడు. అందువలన జీవితంలో పెద్ద కష్టాలు అంటూ ఏమీ తెలియదు కానీ, చిన్న సమస్యలే పెద్ద భూతంలా కనిపిస్తూ ఉండేవి. కానీ నాన్నగారి దయ వలన ఇప్పుడు అలా అనిపించడం లేదు. మనకు కష్టాలు ఏమీ తెలియకుండా, మన భక్తులందరినీ కూడా నాన్నగారి అనుగ్రహం ఉంచుతోంది.

ఒకరోజు నా భర్తకి టిఫిన్ పెడుతున్నాను. అప్పుడు ఒక యాచకుడు వచ్చి అమ్మా బిక్షం అన్నాడు. రోడ్డున పోయే వాడు భిక్ష అడుగుతున్నాడు అని మా వారు అన్నారు. అప్పుడు నేను బయట ఉన్నవాడు చిన్న బిచ్చగాడు, మనము పెద్ద బిచ్చగాళ్ళం. మనమంతా భగవంతుడిని ఏదో ఒకటి కోరుకుంటున్నాము కదా! మనం పైకి బిక్ష అనే వేషం వేసుకోలేదు కానీ లోపల మనం కూడా బిచ్చగాళ్ళమే! ఆ వచ్చిన యాచకుడు అలా కనిపిస్తున్నాడు, మనం కనపడుట లేదు అంతే తేడా అన్నాను. వెంటనే మావారు నవ్వేసారు. నా భర్తకి ఆరోగ్యం బాగాలేనప్పుడు హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. అప్పుడు మా కజిన్ వచ్చి నాన్నగారిని చాలా విమర్శించారు. నాకు ఆ సమయంలో చాలా దుఃఖం వచ్చినా ఆపుకున్నాను. అప్పుడు నా భర్త మా వాళ్ళు ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మా ఇంట్లో అన్ని పనులు చేసుకునే సత్సంగానికి వెళ్తారు అన్నారు. తను వెళ్ళిపోయాక నాకు కన్నీళ్లు వచ్చేసాయి. అప్పుడు నా భర్త రోడ్డు మీద వెళ్ళే వారి మాటలు నువ్వు పట్టుకుంటావు ఏమిటి? ఆ మాత్రం విశ్వాసం నీకు లేదా? అన్నారు. వెంటనే మొత్తం దుఃఖం అంతా అణిగిపోయింది. ఎవరో ఒకసారి నా భర్త దగ్గర మీ ఆడవారు ఇంత చిన్న వయసులో సత్సంగానికి ఎందుకు వెళ్తున్నారు అన్నారంట. వారు అలా అడిగిన విషయం నా భర్త నాకు చెప్పలేదు. తరువాత ఎవరి ద్వారానో నాకు ఆ మాట తెలిసింది. అప్పుడు నేను, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నానా అని నా భర్తని అడిగాను. అప్పుడు మావారు నువ్వు చదివే భగవద్గీత మీద నీకు విశ్వాసం లేకపోతే అది కాలవలో పడేయి అన్నారు. అలా నాన్నగారు, మా కుటుంబ సభ్యులు, భక్తులు అందరూ నన్ను ప్రోత్సహించి బాగు చేస్తూనే ఉన్నారు.

నాన్నగారు దేహం ఉన్నా, లేకపోయినా ఆయన పని జరుగుతోంది అనే దానికి నిదర్శనమే ఈ సత్సంగాలు. ఆయన మనతో ఉన్నారు అనటానికి నిదర్శనం ఏమిటంటే, మన లోపాలను మనకు చూపిస్తూ, వాటి బాధ మనకి తెలియకుండా తీసేస్తున్నారు. లోపల ఉన్న ఆనందాన్ని, శాంతిని మనము మరిచిపోతున్నా, మనల్ని మరవనివ్వకుండా చేస్తూ నడిపిస్తున్నారు. మనకి కుటుంబంలో వచ్చే సమస్యల వలన అవి తట్టుకునే శక్తి లేక, గురువు మాట వినకుండా మన వాసనల వెంట వెళ్ళిపోయి, అక్కడ ఉన్న అశాంతి తెలుసుకొని, ఈ అశాంతికి కారణం బయట గొడవలు కాదు, మన మనసే కారణం అని నాన్నగారు చెప్పిన వాక్యం స్మరణకి తెచ్చుకొని వెనక్కి తిరుగుతున్నాము. అలా ఎప్పటికప్పుడు నాన్నగారి అనుగ్రహం మనల్ని హృదయం వైపుకి మళ్ళిస్తూనే ఉంది. మనందరం నాన్నగారి బిడ్డలం. ఆయన అనుగ్రహానికి మనందరం కూడా వారసులమే! మన హృదయంలో ఉన్న ఆనందము స్వతంత్రమైనది అన్న విషయం మనకి అనుభవంలో లేదు. ఎన్ని పుస్తకాలు చదివినా అది అర్థం కాదు. కళ్ళతో చూసి, చెవులతో వింటేనే గానీ మనము నమ్మలేము. అందువల్ల దయామయుడైన భగవంతుడు తన దయనే ఒక గురువుగా నాన్నగారి రూపంలో మనకి పంపారు. మన హృదయంలో ఉన్న సత్యం తో మనకి అనుబంధం కుదిరితే ఎలా ఉంటుందో, నాన్న గారితో అనుబంధం అలా ఉంటుంది. ఈ అనుబంధం ఎన్ని జన్మల నుంచి కొనసాగుతుందో తెలియదు. కానీ మనకు మోక్షం వచ్చేవరకు అది వదలదు. హృదయంలో ఉన్న సత్యానికి మనము ఎంతగా దగ్గర అవుతామో, అంతగా బంధాలలో నుంచి విడివడుతూ ఉంటాము. కృష్ణుడి చిలిపితనం, రాముడి మర్యాద, గౌతముడి గంభీరం, ఆచార్యుడు సత్య బోధ, భగవానుడి ఆత్మనిష్ఠ... వీటన్నిటిని మనము నాన్నగారిలో దర్శించాము. ఆంజనేయుడికి రాముని పని తప్ప సొంత పని ఏమీ ఉండదు. అలాగే మన నాన్నగారు సొంత పని ఏమీ లేకుండా, మనల్ని ఉద్ధరించటమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఇలా అన్ని అవతారాలు కూడిన సత్యమే మన నాన్నగారు! భక్తులు ఆయన చెప్పిన ప్రవచనాలను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనము భక్తుల్ని, ఆ సత్యాన్ని, ఆ ప్రేమని, అన్నిటినీ పూర్ణంగా ఎంజాయ్ చేసాము. అదంతా మన అదృష్టము! నాన్నగారు దేహంతో ఉన్న సమయంలో అనుగ్రహం అనే మత్తులో ఉంచారు. ఆయన చూపు, మాట, మౌనం ద్వారా అనుగ్రహించి మన జీవితంలో ఎదురవుతున్న వాటికి, మనకి బాధ తెలియకుండా ఆయన దాటిస్తున్నారు. మీ అందరికీ బాధ తెలియకుండా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలి అని ఉంది. అదే నా ఆశ! అని నాన్నగారు అనేవారు. ఆ ఆశని ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. కొంతమంది తొందరగా పక్వానికి రావచ్చు, మరికొంతమందికి కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ ఈ గేట్ లోకి వచ్చిన తరువాత తరించడం అనేది కచ్చితంగా జరుగుతుంది. నాన్నగారి చూపు, నాన్నగారి మాట మనకి నిజమైన మత్తు. విషయాలు ఎక్కువైతే వేరే మత్తు వచ్చేస్తుంది. కాబట్టి వాటిలో పడకుండా, ఈ నిజమైన మత్తులోనే మన జీవితాలు వెళ్ళిపోవాలి. అలా నాన్నగారు మనల్ని అందరినీ అనుగ్రహించారు. ఈ రోజు ఇలా నాన్నగారి జ్ఞాపకాలు మీతో పంచుకోవడానికి, ఎప్పుడో అనుభవించిన ఆ శాంతిని నా ప్రమేయం లేకుండా మళ్ళీ నాన్నగారు కొద్ది కొద్దిగా రుచి చూపిస్తున్నారు. భక్తులకి - నాన్న గారి పట్ల ఉన్న ప్రేమ చూస్తూ ఉంటే నాకు కొంచెం ఈర్ష్య వస్తూ ఉండేది. మరలా వెంటనే ఎందుకు వస్తోంది ఈర్ష్య...? వారు ఎంత కష్టపడి వారి హృదయాలను ఖాళీ చేసుకుంటే వారికి నాన్నగారి పట్ల ప్రేమ కలిగింది...? అనుకుని అటువంటి వారిని చూసి మనం ఆనందించాలి. అలా ఆనందించే బుద్ధిని ఇమ్మని భగవంతుడిని ప్రార్థించేదాన్ని. ఎప్పుడూ ఆయన పాదాలను ఆశ్రయించి ఉండాలి అనుకునేదాన్ని. మన హృదయంలో ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్ళి అక్కడ స్థిరపడటానికి ఒక్క గురువు తప్ప ఎవరూ సహాయం చేయరు.నాన్నగారు, మీకు శాస్త్రం అనుగ్రహం ఉంది, గురువు అనుగ్రహం ఉంది, అందరి అనుగ్రహం ఉంది.. మీ మనసు అనుగ్రహమే ఉండాలి అనేవారు. మన మనసు అంగీకరిస్తేనే కదా మనం అక్కడ ఉండగలిగేది. ఆయన సమక్షంలో మహిమలు జరిగేవి కానీ ఎప్పుడూ వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పాలకోడేరులో ప్రవచనం చెబుతూ నాన్నగారు, పావలాకే నీకు ఆనందం వచ్చేస్తూ ఉంటే రూపాయి గొడవ నీకు ఎందుకు? అన్నారు. చిన్న చిన్నవి మనకు తెలిసినవి ఆచరిస్తూ ఉంటేనే మనకు ఆనందం వచ్చేస్తోంది కదా... పెద్దపెద్ద వాటి గొడవ మనకు ఎందుకు అని చెప్పకుండా చెప్పారు అనిపించింది. మోక్షం గొడవ మనకెందుకు? భగవంతుడు ఇప్పుడు నీకు ఏది ఇస్తే అది పట్టుకుని ఎంజాయ్ చెయ్యి అని నాన్నగారు చెప్పేవారు. దేహ ప్రారబ్ధాన్ని బట్టి జరిగే వాటితో మనం తాధాప్యం పొందకుండా ఉండటమే సాధన! ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు సాధనే! నాన్నగారి సబ్జక్ట్ వలన సాధన చాలా సులభంగా జరుగుతుంది. అందుకే మన భక్తులతో కలిసి కూర్చున్నప్పుడు ఇవి ఆన్ని చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటాము. కృష్ణుడు ఒక మాట చెప్పాడు - మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎల్లమ్మ, పుల్లమ్మ కబుర్లు చెప్పుకోకుండా, నా గురించే మాట్లాడుకోండి. మీకు తెలియకుండానే మీ మనస్సు పక్వానికి వచ్చేస్తుంది అన్నాడు అని నాన్నగారు చెప్పారు. ప్రతిక్షణం నాన్నగారు మనతోనే ఉంటున్నారు కాబట్టి, మనం కూడా నాన్నగారిని వదలకుండా జీవించాలి.