Sunday, January 2, 2022

"నాన్నగారు మనతోనే ఉన్నారు" - (By సుజాతా గారు)

ఒకసారి నాన్నగారితో కాశీ వెళ్ళాము. నాన్నగారు ఎప్పుడూ నాకు పని చెప్పేవారు కాదు. నువ్వు అలసిపోతావమ్మ అనేవారు. ఒకసారి ఆయన బట్టలు ఉతకడానికి ఇస్తూ నీకు కష్టం అయిపోతుందేమో అన్నారు. పరవాలేదు నాన్నగారూ అని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఉతికి ఇస్త్రీ చేయించి ఇచ్చాను. నన్ను పవిత్రం చేయడానికి ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఒకసారి నాన్నగారి రూమ్ తుడుస్తుంటే వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నారు. ఎందుకో తెలియదు అలా అనేవారు. మా కజిన్స్ లో ఒకరు, తన సొంత పని ఎలా చేసుకుంటారో ఎదుటివారి పని కూడా అలాగే చేస్తారు. ఒకసారి నాన్నగారి దగ్గర తన గురించి చెప్పాను. అప్పుడు నాన్నగారు అలాంటి వారిని డబ్బుపెట్టి కొనుక్కోలేము కదమ్మా, ఇలాంటి వారు దొరకటం చాలా అరుదు అన్నారు.

గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తూ తిరిగేవాళ్ళం. ఒకసారి నా స్నేహితురాలు "మోహము త్రిప్పి నీ మోహ మొనర్చి నామోహము తీరదా అరుణాచల" అని అక్షరమణమాల లో ఉన్న ద్విపదను అంటుంటే, నాన్నగారు తనతో- ఈ ద్విపద ఇప్పుడు మనకు సరిపోదు. ముందు మనకు ఉన్న మోహములో నుండి బయటకు వచ్చేయాలి. ఆయన మీద మోహం కలిగిన తరువాత ఆయన తీసుకోవాలి అని చెప్పారు. నీకు ఏ ద్విపద అంటే ఇష్టం? అని తరువాత నన్ను అడిగారు. "ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అణగ నీ ద్యుతి చూపుము అరుణాచల." అని చెప్పాను.

నాకు సంగీతం నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఒక పది క్లాసుల వరకు సంగీతం నేర్చుకున్నాను. ఒకరోజు సంగీతం క్లాస్ కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే, భగవాన్ చెప్పిన వాక్యం ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే, ఒకరు భగవాన్ దగ్గరకు వచ్చి నువ్వే శరణు, నువ్వే శరణు అని పాట పాడుతున్నారు. ఇంత పాట, ఇన్ని దీర్ఘాలు ఎందుకు? ఆ పాడేది మనసు కదా! దానిని అర్పిస్తే సరిపోతుంది అన్న భగవాన్ మాట గుర్తుకు వచ్చింది. (ఆ తరువాత ఎప్పుడూ సంగీతం క్లాసుకి వెళ్ళలేదు). ఆరోజు ఇంటికి రాకుండా పద్మ గారి ఇంటికి వెళ్ళాను. ఆవిడ సత్సంగాలు చెపుతారని నాకు అప్పటికి తెలీదు. నేను వెళ్ళేసరికి అక్కడ సత్సంగం జరుగుతోంది. ఆ రోజు పద్మ గారు సత్సంగంలో నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు భగవద్గీతలోని నాకు చాలా ఇష్టమైన "గతే భర్త ప్రభు సాక్షి" అనే శ్లోకం చెప్పాను. నేను చెప్పడానికి ముందే పద్మ గారికి సుజాత వచ్చి ఈ శ్లోకం చెబుతుంది అని అనిపించిందట. నేను సత్సంగంలో చెప్పటం అలా మొదలయ్యింది. సత్సంగంలో నాన్నగారి వాక్యాలు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. లోపలనుండి శాంతి ఊరుతూ ఉండేది. ఒక్కొక్కసారి నాకు అర్థం కాని వాక్యం వస్తే దానిని వదిలి వేరే వాక్యం చెప్పేదానిని. ఈ సత్సంగాలు చెప్పటం, నాన్నగారి సబ్జెక్టు వినటం, నాన్నగారి సమక్షంలో గడపటం అవి అన్నీ కూడా ఎంతో అందమైన రోజులు. పద్మ గారు, నేను కలిసి ప్రతిరోజు నాన్నగారి సబ్జెక్టు స్మరించుకుంటూ అన్నీ బాగా చర్చించుకునే వాళ్ళం. అలా సబ్జెక్టు స్మరణ అనే మత్తులో ఏ బాధ తెలియకుండా కొన్ని సంవత్సరాలు మా ఇద్దరికీ గడిచిపోయాయి.

సత్సంగాలు ఎప్పుడూ వీలైనంతవరకూ మానేదాన్ని కాదు. తరువాత ఇంట్లో పనుల వలన కొద్ది రోజులు సత్సంగాలకు వెళ్ళటం కుదరలేదు. తరువాత అరుణాచలంలో నాన్నగారు ఒకరోజు భక్తులు అందరూ ఉండగా, సుజాతకి ఈమధ్య సత్సంగానికి వెళ్ళటానికి సమయం దొరకట్లేదటండి, ఈ బిజీ ఏమైనా వల్లకాటికి వస్తుందా అన్నారు. ఆ మాట అనగానే నాకు కొట్టినట్టు అనిపించింది. ఎప్పుడూ మనం సబ్జెక్ట్ ని మిస్ అవ్వకూడదని నాన్నగారు చెప్తున్నారు అనుకుని, అప్పటి నుండి సత్సంగానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒకసారి మా అత్తయ్య గారి ఇంట్లో నాన్నగారు ఒక భక్తురాలిని సుజాత సత్సంగంలో ఏమి చెబుతోంది? అందులో నీకు నచ్చిన వాక్యం ఏమిటమ్మా అని అడిగారు. అప్పుడు ఆ భక్తురాలు జీవితాన్ని భరించమన్నారు నాన్నగారూ ఆ వాక్యం నాకు బాగా నచ్చింది అని చెప్పారు. దానికి నాన్నగారు చాలా మంచి వాక్యం అమ్మా అన్నారు. అంటే సత్సంగంలో నా ద్వారా వినిపించిన వాక్యం ఆమె పట్టుకున్నారు. నాన్నగారు అలా ఏదో ఒక రకంగా, ఏదో ఒక ఒంపు పెట్టుకుని మనల్ని పవిత్రం చేయటానికి అలా స్మరిస్తూ ఉండేవారు.

నాలో ఎన్ని వాసనలు ఉన్నాయో! అది నాకు, నా గురువుకి మాత్రమే తెలుస్తుంది. నాన్నగారు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునేదాన్ని. నాన్నగారు దేహం వదిలేముందు దేహబాధ చాలా అనుభవించారు. ఆ సమయంలో ఒకసారి నాన్నగారు ఆసుపత్రిలో పేపర్ చదువుతూ నాతో అమ్మా సుజాతా..! "పనిలో నేర్పు అంటే ఏమిటంటే, పనిని నేర్పుగా, ఓర్పుగా చేయడం నేర్చుకోవాలి. అంటే పని చెయ్యాలి, ఆ పని మనకు గుర్తు రాకూడదు. హృదయంలో ఉంటూ ఆ పనిని చేయాలి. హృదయం పని చేస్తుంది కానీ నేను చేశాను అని అనుకోదు. ఎందుకంటే, దానికి కర్తృత్వం లేదు. అలాగ నువ్వు కూడా ఏ పని చేసినా కర్తృత్వం పెట్టుకోకు. పని చేయ్యాలి అది నిన్ను అంటకూడదు. జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా నువ్వు హృదయంలో ఉండటం నేర్చుకో అదే అభ్యాసము!" అని చెప్పారు.

నాన్నగారు మాతో, మీ మావయ్య గారిని మీరు చాలా బాగా చూసుకున్నారు. నాకు అలా గడవకపోవచ్చు అమ్మా అన్నారు. అప్పుడు నేను, నాన్నగారూ మిమ్మల్ని చూసుకోవటానికి ఎంతో మంది ప్రియమైన భక్తులు ఉన్నారు అన్నాను. నాన్నగారు పొగిడినప్పుడల్లా వాటిని మనం తీసుకుంటే హృదయంలో ఉన్న సత్యానికి దూరమైపోతాము అనిపిస్తూ ఉండేది. అలా పొగడ్తలు తీసుకోకూడదు అనే గైడెన్స్ కూడా నాన్నగారే ఇస్తున్నారు అని తెలుస్తూ ఉండేది. నాన్నగారు దేహం వదిలేసే ముందు వైజాగ్ ఆస్పత్రికి వచ్చినప్పుడు మా మరిది గారి ఇంట్లో కొద్ది రోజులు ఉన్నారు. అప్పుడు నాన్నగారి దేహ బాధలు చూడలేక నాకు నాన్నగారి దగ్గరకు వెళ్ళాలంటే భయం వేసేది. ఆ సమయంలో కూడా నాన్నగారు వచ్చిన భక్తులందరినీ ఎంతో ప్రేమపూర్వకంగా అనుగ్రహించి వారిని సంతృప్తి పరిచారు. అలాంటి సమయంలో నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను పిలిచి, అనారోగ్యం వచ్చి హాస్పిటల్ కి వెళితే వారందరూ డబ్బులు చాలా ఎక్కువ దోచేస్తున్నారు అమ్మా అని చెప్పారు. నాన్నగారు అంటే పూర్ణం. అంటే దైవత్వం లోనే మానవత్వం కూడా ఉంటుంది. కాబట్టే మానవులు పడే ఇబ్బందులను అర్థం చేసుకొని అలా బాధని వ్యక్తపరుస్తున్నారు అనుకునేదాన్ని. ఆ సమయంలో ఒకసారి నా భర్త వచ్చి, నాన్నగారూ ఇప్పుడే మీ ఆరోగ్యం కొద్దిగా కుదుటపడుతోంది కాబట్టి ఇప్పుడే మీరు జిన్నూరు వెళ్లొద్దు, కొద్దిరోజులు ఇక్కడే ఉండండి అన్నారు. దానికి నాన్నగారు మా భక్తులు జిన్నూరు లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు. అప్పుడు నా భర్త, భక్తుల కోసం బస్సులు వేద్దాము నాన్నగారూ, వారు వచ్చి మిమ్మల్ని దర్శించుకుని వెళతారు అని చెప్పారు. దానికి నాన్నగారు, అదంతా వద్దు నేనే జిన్నూరు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి మరలా తిరిగి వచ్చేస్తాను అన్నారు. అదే సమయంలో ఒక డాక్టర్ గారు నాన్నగారిని మీరు ఇప్పుడు జిన్నూరు వెళ్ళవద్దు, ఒక వేళ వెళ్ళినా మీరు మాట్లాడకుండా మౌనంగా కూర్చోండి. ఎవరో ఒకరు సబ్జెక్టు చెబుతారు అన్నారు. అప్పుడు నాన్నగారు నన్ను జిన్నూరు వెళ్ళవద్దు, అక్కడ మాట్లాడవద్దు అని మీ మనసు చెబుతోంది. అది అంతా నిజం కాదు. "నేను ఉండటానికి సంబంధించిన వాడిని. అది మీకు తెలియదు. మీరు కూడా ఉండటమనేది మననం చేయండి. అలా మననం చేయడం వలన మీ జీవితంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినప్పటికి అవి అన్నీ కాలి బూడిదైపోతాయి. ఆ ఉండటం అనేది అంత గొప్పది" అన్నారు. నాన్నగారి మాటలలో నాకు ఉండటం అనే వాఖ్యము చాలా ఇష్టము. దాని తాలూకు అనుభవాన్ని కూడా నాన్నగారు కొద్దిగా రుచి చూపించారు. ఆ ఉండటం అనే వాక్యము నా జీవితంలో చాలా రోజులు నన్ను వెంటాడింది. నాన్నగారు ఆఖరి సమయంలో హాస్పటల్ లో ఉండగా నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు మాత్రము ఇప్పటికీ నేను మరిచిపోలేను. భగవాన్ ఫోటో చూసినా, నాన్నగారి ఫోటో చూసినా ఆ చిరునవ్వే దర్శనం ఇస్తుంది. ఏ తలంపులు లేనిచోట నేను ఉన్నాను అనిపిస్తుంది. వెంటనే నాకు దక్షిణామూర్తి జ్ఞాపకం వస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నాన్నగారి ఫోటో దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, లోపల ఉన్న అశాంతిని తొలగించి, హృదయంలో ఉన్న శాంతిని ఎప్పటికప్పుడు నాకు రుచి చూపిస్తూ ఉంటారు. గురువు ఎప్పుడూ మనకి ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. మనకి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఒక అవకాశంగా భావించి దానిని పొందటానికి తయారు అవ్వాలి (పక్వానికి రావాలి).

నాన్నగారు నాకు దండలు వద్దు, నమస్కారాలు వద్దు. నేను ఏ స్పిరిట్ తో ఈ మాటలు చెబుతున్నానో, ఆ స్పిరిట్ తో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆచరించండి చాలు. అదే నాకు పెద్ద నమస్కారం అనేవారు. నాన్నగారి సబ్జక్ట్ వినేటప్పుడు చాలా ఏకాగ్రతగా వినేదాన్ని. అలా క్యాసెట్ రూపంలో అందిన నాన్నగారి సబ్జెక్ట్ ని చాలా ఎంజాయ్ చేశాను. మనం విన్నది ఏదీ కూడా వృధా పోదు. అది ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో పని చేస్తూనే ఉంటుంది.

నాన్నగారు చెప్పిన వాక్యాలలో "నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఫలానా, నేను ఇది, నేను అది అని అనుకోకుండా ఉంటే చాలు మనకి మోక్షం వచ్చేస్తుంది". అన్న ఈ వాక్యం నన్ను చాలాకాలం ఆచరిస్తూ జీవింపచేసింది. అలా గడిచిన రోజులలో నిరంతరం శాంతి నాలో ప్రవహిస్తూనే ఉండేది. అది భగవంతుని దయ! వాక్యము దేవుడై ఉంది దేవుడు, వాక్యం వేరు కాదు అన్నది నాన్నగారు అలా రుచి చూపించారు. కృష్ణుడు ఇదంతా నా విభూతి అంటాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ భగవంతుడు ఇస్తాడు. ఏ భక్తుల్ని చూసినా భగవంతుడి వైభవం కనిపిస్తుంది. నాన్నగారిని చూసినా భగవంతుడి వైభవం కనిపిస్తుంది. అలా మనసు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడే జ్ఞాపకం వచ్చేవాడు. అప్పుడు మనసు వెనక్కి తిరిగి హృదయం లోపలికి వెళ్ళిపోయేది. జననమరణాలకు మనము అలవాటు పడిపోయి, జ్ఞానాన్ని, భక్తిని మిస్ అయిపోతున్నాము అని నాన్నగారు ఒక మాట చెప్పారు. "మన జీవితంలో ఎన్నో వస్తాయి. వాటిని అన్నింటిని పరిష్కరించుకోవాలి అంటే అసలు పని అవ్వదు. దాన్ని దానికే వదిలేయాలి. మనం మనంగా ఉండడానికి ప్రయత్నించాలి. జీవితంలో ఎవరితోనూ పోల్చుకోకూడదు." అన్నారు. అంటే మనం ఎలా ఉంటున్నామో చూసుకుని, మనం తరించడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటి వారిలో ఉన్న మంచిని చూసి మనం ఆనందించాలి. దేహం వదిలే ఆఖరి సమయం వరకు మీ మనసుని నమ్మవద్దు అని నాన్నగారు చెబుతారు కదా! భగవంతుడు నన్ను మంచి కుటుంబంలో ఉంచి, మంచి గురువుని కూడా ప్రసాదించాడు. అందువలన జీవితంలో పెద్ద కష్టాలు అంటూ ఏమీ తెలియదు కానీ, చిన్న సమస్యలే పెద్ద భూతంలా కనిపిస్తూ ఉండేవి. కానీ నాన్నగారి దయ వలన ఇప్పుడు అలా అనిపించడం లేదు. మనకు కష్టాలు ఏమీ తెలియకుండా, మన భక్తులందరినీ కూడా నాన్నగారి అనుగ్రహం ఉంచుతోంది.

ఒకరోజు నా భర్తకి టిఫిన్ పెడుతున్నాను. అప్పుడు ఒక యాచకుడు వచ్చి అమ్మా బిక్షం అన్నాడు. రోడ్డున పోయే వాడు భిక్ష అడుగుతున్నాడు అని మా వారు అన్నారు. అప్పుడు నేను బయట ఉన్నవాడు చిన్న బిచ్చగాడు, మనము పెద్ద బిచ్చగాళ్ళం. మనమంతా భగవంతుడిని ఏదో ఒకటి కోరుకుంటున్నాము కదా! మనం పైకి బిక్ష అనే వేషం వేసుకోలేదు కానీ లోపల మనం కూడా బిచ్చగాళ్ళమే! ఆ వచ్చిన యాచకుడు అలా కనిపిస్తున్నాడు, మనం కనపడుట లేదు అంతే తేడా అన్నాను. వెంటనే మావారు నవ్వేసారు. నా భర్తకి ఆరోగ్యం బాగాలేనప్పుడు హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. అప్పుడు మా కజిన్ వచ్చి నాన్నగారిని చాలా విమర్శించారు. నాకు ఆ సమయంలో చాలా దుఃఖం వచ్చినా ఆపుకున్నాను. అప్పుడు నా భర్త మా వాళ్ళు ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మా ఇంట్లో అన్ని పనులు చేసుకునే సత్సంగానికి వెళ్తారు అన్నారు. తను వెళ్ళిపోయాక నాకు కన్నీళ్లు వచ్చేసాయి. అప్పుడు నా భర్త రోడ్డు మీద వెళ్ళే వారి మాటలు నువ్వు పట్టుకుంటావు ఏమిటి? ఆ మాత్రం విశ్వాసం నీకు లేదా? అన్నారు. వెంటనే మొత్తం దుఃఖం అంతా అణిగిపోయింది. ఎవరో ఒకసారి నా భర్త దగ్గర మీ ఆడవారు ఇంత చిన్న వయసులో సత్సంగానికి ఎందుకు వెళ్తున్నారు అన్నారంట. వారు అలా అడిగిన విషయం నా భర్త నాకు చెప్పలేదు. తరువాత ఎవరి ద్వారానో నాకు ఆ మాట తెలిసింది. అప్పుడు నేను, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నానా అని నా భర్తని అడిగాను. అప్పుడు మావారు నువ్వు చదివే భగవద్గీత మీద నీకు విశ్వాసం లేకపోతే అది కాలవలో పడేయి అన్నారు. అలా నాన్నగారు, మా కుటుంబ సభ్యులు, భక్తులు అందరూ నన్ను ప్రోత్సహించి బాగు చేస్తూనే ఉన్నారు.

నాన్నగారు దేహం ఉన్నా, లేకపోయినా ఆయన పని జరుగుతోంది అనే దానికి నిదర్శనమే ఈ సత్సంగాలు. ఆయన మనతో ఉన్నారు అనటానికి నిదర్శనం ఏమిటంటే, మన లోపాలను మనకు చూపిస్తూ, వాటి బాధ మనకి తెలియకుండా తీసేస్తున్నారు. లోపల ఉన్న ఆనందాన్ని, శాంతిని మనము మరిచిపోతున్నా, మనల్ని మరవనివ్వకుండా చేస్తూ నడిపిస్తున్నారు. మనకి కుటుంబంలో వచ్చే సమస్యల వలన అవి తట్టుకునే శక్తి లేక, గురువు మాట వినకుండా మన వాసనల వెంట వెళ్ళిపోయి, అక్కడ ఉన్న అశాంతి తెలుసుకొని, ఈ అశాంతికి కారణం బయట గొడవలు కాదు, మన మనసే కారణం అని నాన్నగారు చెప్పిన వాక్యం స్మరణకి తెచ్చుకొని వెనక్కి తిరుగుతున్నాము. అలా ఎప్పటికప్పుడు నాన్నగారి అనుగ్రహం మనల్ని హృదయం వైపుకి మళ్ళిస్తూనే ఉంది. మనందరం నాన్నగారి బిడ్డలం. ఆయన అనుగ్రహానికి మనందరం కూడా వారసులమే! మన హృదయంలో ఉన్న ఆనందము స్వతంత్రమైనది అన్న విషయం మనకి అనుభవంలో లేదు. ఎన్ని పుస్తకాలు చదివినా అది అర్థం కాదు. కళ్ళతో చూసి, చెవులతో వింటేనే గానీ మనము నమ్మలేము. అందువల్ల దయామయుడైన భగవంతుడు తన దయనే ఒక గురువుగా నాన్నగారి రూపంలో మనకి పంపారు. మన హృదయంలో ఉన్న సత్యం తో మనకి అనుబంధం కుదిరితే ఎలా ఉంటుందో, నాన్న గారితో అనుబంధం అలా ఉంటుంది. ఈ అనుబంధం ఎన్ని జన్మల నుంచి కొనసాగుతుందో తెలియదు. కానీ మనకు మోక్షం వచ్చేవరకు అది వదలదు. హృదయంలో ఉన్న సత్యానికి మనము ఎంతగా దగ్గర అవుతామో, అంతగా బంధాలలో నుంచి విడివడుతూ ఉంటాము. కృష్ణుడి చిలిపితనం, రాముడి మర్యాద, గౌతముడి గంభీరం, ఆచార్యుడు సత్య బోధ, భగవానుడి ఆత్మనిష్ఠ... వీటన్నిటిని మనము నాన్నగారిలో దర్శించాము. ఆంజనేయుడికి రాముని పని తప్ప సొంత పని ఏమీ ఉండదు. అలాగే మన నాన్నగారు సొంత పని ఏమీ లేకుండా, మనల్ని ఉద్ధరించటమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఇలా అన్ని అవతారాలు కూడిన సత్యమే మన నాన్నగారు! భక్తులు ఆయన చెప్పిన ప్రవచనాలను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనము భక్తుల్ని, ఆ సత్యాన్ని, ఆ ప్రేమని, అన్నిటినీ పూర్ణంగా ఎంజాయ్ చేసాము. అదంతా మన అదృష్టము! నాన్నగారు దేహంతో ఉన్న సమయంలో అనుగ్రహం అనే మత్తులో ఉంచారు. ఆయన చూపు, మాట, మౌనం ద్వారా అనుగ్రహించి మన జీవితంలో ఎదురవుతున్న వాటికి, మనకి బాధ తెలియకుండా ఆయన దాటిస్తున్నారు. మీ అందరికీ బాధ తెలియకుండా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలి అని ఉంది. అదే నా ఆశ! అని నాన్నగారు అనేవారు. ఆ ఆశని ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. కొంతమంది తొందరగా పక్వానికి రావచ్చు, మరికొంతమందికి కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ ఈ గేట్ లోకి వచ్చిన తరువాత తరించడం అనేది కచ్చితంగా జరుగుతుంది. నాన్నగారి చూపు, నాన్నగారి మాట మనకి నిజమైన మత్తు. విషయాలు ఎక్కువైతే వేరే మత్తు వచ్చేస్తుంది. కాబట్టి వాటిలో పడకుండా, ఈ నిజమైన మత్తులోనే మన జీవితాలు వెళ్ళిపోవాలి. అలా నాన్నగారు మనల్ని అందరినీ అనుగ్రహించారు. ఈ రోజు ఇలా నాన్నగారి జ్ఞాపకాలు మీతో పంచుకోవడానికి, ఎప్పుడో అనుభవించిన ఆ శాంతిని నా ప్రమేయం లేకుండా మళ్ళీ నాన్నగారు కొద్ది కొద్దిగా రుచి చూపిస్తున్నారు. భక్తులకి - నాన్న గారి పట్ల ఉన్న ప్రేమ చూస్తూ ఉంటే నాకు కొంచెం ఈర్ష్య వస్తూ ఉండేది. మరలా వెంటనే ఎందుకు వస్తోంది ఈర్ష్య...? వారు ఎంత కష్టపడి వారి హృదయాలను ఖాళీ చేసుకుంటే వారికి నాన్నగారి పట్ల ప్రేమ కలిగింది...? అనుకుని అటువంటి వారిని చూసి మనం ఆనందించాలి. అలా ఆనందించే బుద్ధిని ఇమ్మని భగవంతుడిని ప్రార్థించేదాన్ని. ఎప్పుడూ ఆయన పాదాలను ఆశ్రయించి ఉండాలి అనుకునేదాన్ని. మన హృదయంలో ఉన్న ఆత్మ దగ్గరికి వెళ్ళి అక్కడ స్థిరపడటానికి ఒక్క గురువు తప్ప ఎవరూ సహాయం చేయరు.నాన్నగారు, మీకు శాస్త్రం అనుగ్రహం ఉంది, గురువు అనుగ్రహం ఉంది, అందరి అనుగ్రహం ఉంది.. మీ మనసు అనుగ్రహమే ఉండాలి అనేవారు. మన మనసు అంగీకరిస్తేనే కదా మనం అక్కడ ఉండగలిగేది. ఆయన సమక్షంలో మహిమలు జరిగేవి కానీ ఎప్పుడూ వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పాలకోడేరులో ప్రవచనం చెబుతూ నాన్నగారు, పావలాకే నీకు ఆనందం వచ్చేస్తూ ఉంటే రూపాయి గొడవ నీకు ఎందుకు? అన్నారు. చిన్న చిన్నవి మనకు తెలిసినవి ఆచరిస్తూ ఉంటేనే మనకు ఆనందం వచ్చేస్తోంది కదా... పెద్దపెద్ద వాటి గొడవ మనకు ఎందుకు అని చెప్పకుండా చెప్పారు అనిపించింది. మోక్షం గొడవ మనకెందుకు? భగవంతుడు ఇప్పుడు నీకు ఏది ఇస్తే అది పట్టుకుని ఎంజాయ్ చెయ్యి అని నాన్నగారు చెప్పేవారు. దేహ ప్రారబ్ధాన్ని బట్టి జరిగే వాటితో మనం తాధాప్యం పొందకుండా ఉండటమే సాధన! ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు సాధనే! నాన్నగారి సబ్జక్ట్ వలన సాధన చాలా సులభంగా జరుగుతుంది. అందుకే మన భక్తులతో కలిసి కూర్చున్నప్పుడు ఇవి ఆన్ని చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటాము. కృష్ణుడు ఒక మాట చెప్పాడు - మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎల్లమ్మ, పుల్లమ్మ కబుర్లు చెప్పుకోకుండా, నా గురించే మాట్లాడుకోండి. మీకు తెలియకుండానే మీ మనస్సు పక్వానికి వచ్చేస్తుంది అన్నాడు అని నాన్నగారు చెప్పారు. ప్రతిక్షణం నాన్నగారు మనతోనే ఉంటున్నారు కాబట్టి, మనం కూడా నాన్నగారిని వదలకుండా జీవించాలి.

No comments:

Post a Comment